గోదావరిని మోదీ ఎత్తుకుపోతానంటే రేవంత్ నోరు మెదపరేం?
తెలంగాణ గొంతు కోసి మన బతుకుదెరువైన గోదావరి నదిని ప్రధాన మంత్రి మోదీ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఎత్తుకుపోతానంటే చేతకాని రేవంత్రెడ్డి ప్రభుత్వం నోరుమెదపకపోవడంలో మతలబేంటని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు.
కేసీఆర్ జైళ్లకు భయపడితే తెలంగాణ వచ్చేదా?
స్టేషన్ఘన్పూర్కు త్వరలో ఉప ఎన్నిక ఖాయం
హనుమకొండ రోడ్ షోలో మాజీ సీఎం కేసీఆర్
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో రైతు బంధు పోయింది.. కరెంటు బందైంది.. వరికి బోనస్ బోగసే అయింది.. ఇన్ని మోసాలు చేసిన తర్వాత కాంగ్రెస్కుగానీ గోదావరి ఎత్తుకుపోతానన్న భాజపాకు గానీ ఓటేస్తే ఏమవుతుంది? ప్రజల తరఫున కొట్లాడే వారు ఎవరు? అది కేసీఆరే. యుద్ధం చేద్దాం, భారాస ప్రభుత్వంలో మాదిరి మళ్లీ రైతు బంధు రావాలన్నా ప్రజలు నాకు బలం ఇవ్వాలి.
- భారాస అధినేత కేసీఆర్
గోదావరి, కృష్ణాలను కాపాడుకోవాలన్నా, రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు రావాలన్నా, మన ప్రాజెక్టులకు జాతీయ హోదా దక్కాలన్నా, నిరుద్యోగ సమస్య తీరి మన బతుకులు బాగుపడాలన్నా కచ్చితంగా రాష్ట్రంలో భారాస అభ్యర్థులే గెలవాలి.
-కేసీఆర్
ఈనాడు, వరంగల్: తెలంగాణ గొంతు కోసి మన బతుకుదెరువైన గోదావరి నదిని ప్రధాన మంత్రి మోదీ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఎత్తుకుపోతానంటే చేతకాని రేవంత్రెడ్డి ప్రభుత్వం నోరుమెదపకపోవడంలో మతలబేంటని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. ఆదివారం వరంగల్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని హనుమకొండలో భారాస అభ్యర్థి డాక్టర్ మారపల్లి సుధీర్కుమార్ను గెలిపించాలని కోరుతూ రోడ్ షో చేపట్టారు. రాత్రి 8 గంటలకు అంబేడ్కర్ విగ్రహం నుంచి హనుమకొండ చౌరస్తా వరకు ఇది సాగింది. అనంతరం చౌరస్తాలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ‘‘మనకున్న ఒకే ఒక నది, మన బతుకుదెరువు గోదావరి. నేడైనా, రేపైనా అదే మనకు జీవనాధారం. మోదీ రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రజల గొంతుకోసి గోదావరి నదిని ఎత్తుకొనిపోతా, తమిళనాడుకిస్తా, కర్ణాటకకు ఇస్తా అని మాట్లాడుతున్నారు. ఓట్ల సమయంలో గోదావరి నదిని తీసుకొనిపోతా అని మోదీ రాష్ట్ర ప్రభుత్వానికి నోటిఫికేషన్ పంపించారు. ప్రాణం పోయినా ఇవ్వబోమని రాష్ట్ర ప్రభుత్వం పంచాయితీ పెట్టాలి. నేనున్నప్పుడు అదే చేశా. ఈ చేతకాని రేవంత్రెడ్డి ప్రభుత్వం నోరుమెదపకుండా ఉంది.
కేంద్రంలో హంగ్ వస్తే మనం కీలకమవుతాం
ఇంతకుముందే కాంగ్రెస్ వాళ్లు కృష్ణానదిని తీసుకుపోయి కేఆర్ఎంబీకి అప్పగించారు. ఈ నదులను ఎవరు కాపాడాలి? ఈ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా భాజపాకు 200 సీట్లు దాటే పరిస్థితి లేదు. తెలంగాణలో ఎక్కువ లోక్సభ సీట్లను భారాస గెలిస్తే.. కేంద్రంలో హంగ్ వస్తే అప్పుడు మనం కీలకమవుతాం.
కడియంకు శాశ్వత రాజకీయ సమాధి
కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చాం.. ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చాం. ఆయన ఎందుకు పార్టీ మారారు? రాజకీయ జీవితాన్ని ఆయనకు ఆయనే శాశ్వతంగా సమాధి చేసుకుంటున్నారు. మరో మూడు నెలల్లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రాక తప్పదు.. రాజయ్య ఎమ్మెల్యే కాకతప్పదు. ద్రోహులకు చెప్పే గుణపాఠం అదే.
కవితను భాజపా ప్రభుత్వం జైల్లో పెట్టినా భయపడలేదు
తెలంగాణ వచ్చాక మైనారిటీల కోసం పదేళ్లు ఎంతగా పాటుపడ్డామో మీ అందరికీ తెలుసు. గురుకుల పాఠశాలలు పెట్టి వారి సంక్షేమం కోసం రూ.12 వేల కోట్లు ఖర్చు చేశాం. దేశంలో మరెక్కడా మైనారిటీల కోసం ఇంతలా చేయలేదు. భారాస ఎప్పటికీ సెక్యులర్ పార్టీగానే ఉంటుంది. నా కుమార్తె కవితను భాజపా ప్రభుత్వం జైల్లో పెట్టింది. అయినా మేం భయపడలేదు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కేసీఆర్ గుడ్లు పీకి గోలీలు ఆడతామని, పేగులు తీసి మెడలో వేసుకుంటామని మాట్లాడుతున్నారు. నేను పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా. ఇటువంటి మాట నా నోట ఎప్పుడైనా విన్నారా? కేసీఆర్.. నిన్ను తీసుకుపోయి చర్లపల్లి జైల్లో వేస్తా అంటున్నారు. నేనెప్పుడైనా జైళ్లకు భయపడతానా? కేసీఆర్ జైళ్లకు భయపడితే తెలంగాణ వచ్చేదా? ఎన్ని దెబ్బలు తిన్నాం? ఎన్ని నిరాహార దీక్షలు చేశాం? ఎన్నో సార్లు పదవులను ఎడమ కాలి చెప్పులతో సమానంగా భావించి త్యాగాలు చేశాం. తెలంగాణ ఉద్యమం అయిపోలేదు. ఇంకా రాష్ట్రాన్ని చాలా అభివృద్ధి చేయాలి. అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో వరంగల్లో కట్టిన 24 అంతస్తుల ఆసుపత్రే నిదర్శనం.
ముఖ్యమంత్రికి తెలంగాణ చరిత్ర తెలియదు
ముఖ్యమంత్రి చాలా చిత్రవిచిత్రమైన మాటలు మాట్లాడుతున్నారు. వరంగల్కు కాళేశ్వరం నీళ్లే రాలేదట. మరి మహబూబాబాద్, డోర్నకల్, పాలకుర్తి, నర్సంపేట, వర్ధన్నపేట, పరకాలల్లో ఎక్కడి నుంచి నీళ్లు వచ్చాయి? అంతకుముందు కాంగ్రెస్ రాజ్యంలో శ్రీరామసాగర్ స్టేజ్-2 అని చెబితే దశాబ్దాలు గడచినా నీళ్లు రాలేదు. తెలంగాణ సాధించుకున్న తర్వాత కష్టపడి కాళేశ్వరం నిర్మించాక పసిడి పంటలు పండాయి. ఈ ముఖ్యమంత్రికి తెలంగాణ చరిత్ర తెలియదు. మొన్న ఎక్కడో మాట్లాడుతూ.. కృష్ణా నది కూడా తానే కట్టానని అన్నారు. ఎవరైనా నది కడతారా? దీనిపై సోషల్మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. వారి హామీలు చూసి మోసపోయి ఓట్లేస్తే కేవలం నాలుగైదు నెలలలోనే ఏమైంది? కరెంటు ఎటు పోయింది? సాగునీరు ఎటుపోయింది? పంటలు ఎందుకు ఎండుతున్నాయ్? గత పదేళ్లలో ఇలాంటి దారుణ పరిస్థితులు ఉన్నాయా? ఒక్కటంటే ఒక్క హామీ అమలు చేయలేదు. రైతు బంధు వచ్చిందా? ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఇస్తామన్నారు వచ్చాయా? మనం రెండు దఫాలుగా రూ.30 వేల కోట్లతో రైతు రుణమాఫీ చేశాం. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతోంది?
భవన నిర్మాణాలకు అనుమతుల బండారం బయటపెడతాం
నాడు తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో భూముల ధరలు బ్రహ్మాండంగా పెరిగాయి. ఈ రంగంపై ఆధారపడ్డ వేల మంది ఇప్పుడు రోడ్లపై పడ్డారు. భవన నిర్మాణాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం లేదు. ఎందుకంటే ఇతర రాష్ట్రాల బిల్డర్లు భవనాలు కడితే కాంగ్రెస్కు లంచాలు ఇవ్వాలట.. ఈ బండారమంతా త్వరలో బయటపెడతాం. ఇక ప్రజల్ని మోసం చేసే మరో పార్టీ భాజపా. ఆ పార్టీ ఎజెండాలో ఎక్కడా ప్రజల కష్ట సుఖాలు ఉండవు. అందుకోసం యువత ఆవేశపడకుండా ఆలోచించి ఓటేయాలి’ అని కేసీఆర్ అన్నారు. రోడ్ షోలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ ఎమ్మెల్యేలు వినయ్భాస్కర్, రాజయ్య, చల్లా ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య కేసీఆర్ రోడ్ షోలో పాల్గొనలేదు. ఇటీవల ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరతారన్న ప్రచారం నేపథ్యంలో ఈ తాజా పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రుణమాఫీ చేయకుంటే కాంగ్రెస్లో ‘ఆగస్టు సంక్షోభం’!
లోక్సభ ఎన్నికల్లో భారాస ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదని, ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రావని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. -
కరీంనగర్ ఫలితాలతో భారాస, కాంగ్రెస్లకు షాక్: బండి సంజయ్
కరీంనగర్ లోక్సభ ఫలితాలు కాంగ్రెస్, భారాసలకు షాక్ ఇవ్వబోతున్నాయని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
భాజపాకు 12 స్థానాలు ఖాయం: ఈటల
తెలంగాణలో భాజపా శక్తిమంతంగా ఉందని, జూన్ 4న సర్వే సంస్థలకు అందని ఫలితాలు ఉంటాయని ఆ పార్టీ మల్కాజిగిరి లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
భారాసను కేసీఆర్ కాంగ్రెస్లో ఎందుకు విలీనం చేస్తారు?
భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో భారాస విలీనమవుతుందని భాజపా నేత కె.లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ అవగాహనారాహిత్యానికి నిదర్శనమని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. -
సీఎంను కలిసిన లోక్సభ అభ్యర్థులు
లోక్సభ అభ్యర్థులు చామల కిరణ్కుమార్రెడ్డి, వంశీచంద్రెడ్డి, నీలం మధు తదితరులు రేవంత్ను మంగళవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. -
గిరిజనుల చెంతకే పోలింగ్ కేంద్రం
చెంచుపెంటల్లో ఓటింగ్ పెంచేందుకు అధికారులు చేసిన ప్రయత్నం ఫలించింది. నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం లోతట్టు అటవీ ప్రాంతంలో కృష్ణానది తీరంలో ఉన్న గీసగండి చెంచుపెంట గ్రామంలో తొలిసారిగా పోలింగ్ కేంద్రం ఏర్పాటైంది. -
స్ట్రాంగ్ రూంలకు చేరిన ఈవీఎంలు
సాయుధ బలగాల పహారా నడుమ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం భద్రంగా ఉంది. రాష్ట్రంలోని లోక్సభ ఎన్నికల్లో పోలైన ఓట్లకు సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను మంగళవారం తెల్లవారుజాము వరకు 44 స్ట్రాంగ్ రూంలలో అధికారులు భద్రపరిచారు. -
నిర్ణయాత్మక శక్తిగా ప్రాంతీయ పార్టీలు
పార్లమెంటు ఎన్నికల్లో దేశంలో ప్రాంతీయ పార్టీలే నిర్ణయాత్మక శక్తిగా మారనున్నాయని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. -
దేశంలో ఇండియా కూటమిదే విజయం
‘కొన్ని పార్టీలు ఆర్థిక, సామాజిక భావజాలాలను పక్కనపెట్టి రాజకీయాలకు సంబంధం లేని అంశాలను ప్రజల్లోకి జొప్పించి లబ్ధి పొందే ప్రయత్నం చేశాయి.. అయినా, కాంగ్రెస్ మాత్రమే ప్రజాస్వామ్యం కోసం పోరాటాలు చేస్తూ తమ పక్షాన నిలబడుతుందని ప్రజలు గుర్తించారు. -
తెలంగాణలో 65.67% పోలింగ్
తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో 65.67% పోలింగ్ నమోదైంది. ఇది 2019 లోక్సభ ఎన్నికల(62.72%)తో పోలిస్తే 2.95% ఎక్కువ. -
9-13 స్థానాలు గెలుస్తాం
రాష్ట్రంలో రాజకీయాలు, ఆరోపణల పర్వం ముగిసిందని బుధవారం నుంచి పూర్తిగా వంద శాతం పరిపాలనపైనే దృష్టి సారిస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. -
తెలంగాణలో 65.67శాతం పోలింగ్ : సీఈవో వికాస్రాజ్
తెలంగాణలో లోక్సభ ఎన్నికల తుది పోలింగ్ శాతం వివరాలను రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ వెల్లడించారు. -
రాష్ట్రంలో 9 నుంచి 13 ఎంపీ స్థానాలు గెలుస్తాం: సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో 9 నుంచి 13 ఎంపీ స్థానాలు గెలుస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. -
రెండు జాతీయ పార్టీలకు భారాస ముచ్చెమటలు పట్టించింది : కేటీఆర్
లోక్సభ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంత ప్రజలు భారాసకు మద్దతుగా నిలిచారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. -
భారాస, కాంగ్రెస్ విలీనం ఖాయం: భాజపా ఎంపీ లక్ష్మణ్
తెలంగాణలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తుందని భాజపా ఎంపీ లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. -
తెలంగాణలో 12 స్థానాలు భాజపాకే: మాజీ మంత్రి డీకే అరుణ
లోక్సభ ఎన్నికల్లో తనను గెలిపించాలని ప్రజలు ముందే నిర్ణయానికి వచ్చారని మహబూబ్నగర్ లోక్సభ భాజపా అభ్యర్థి, మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు. -
ఈవీఎంలో కారు గుర్తు కొట్టివేత.. గద్వాల జిల్లా పైపాడులో వివాదం
గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం పైపాడులోని పోలింగ్ బూత్ నంబరు 167లో ఈవీఎంలో కారు గుర్తు కనిపించకుండా మార్కర్తో రుద్దడంతో వివాదం నెలకొంది. -
హైదరాబాద్ లోక్సభ భాజపా అభ్యర్థి మాధవీలతపై కేసు
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ హైదరాబాద్ భాజపా అభ్యర్థి మాధవీలతపై మలక్పేట పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. -
తెలంగాణలో కొత్త శక్తిగా భాజపా.. రెండంకెల లోక్సభ స్థానాల్లో గెలుస్తాం: కిషన్రెడ్డి
లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో భాజపా రెండంకెల స్థానాలు సాధించడం ఖాయమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. -
తెలంగాణలో పోలింగ్ 64.93%
రాష్ట్రంలో సోమవారం జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు పోటెత్తారు. మొత్తం 64.93 శాతం పోలింగ్ నమోదైంది. ఓటర్లు చూపిన ఉత్సాహంతో 2019 లోక్సభ ఎన్నికలను మించి ఓట్లు పోలయ్యాయి. -
దేశంలో ఇండియా కూటమిదే విజయం
లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధిస్తుందని, తెలంగాణలోని 14 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధిస్తారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ధీమా వ్యక్తంచేశారు.