icon icon icon
icon icon icon

ముమ్మాటికీ రిఫరెండమే!

రూ.50 వేల  కోట్లతో పూర్తి చేయాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.లక్షన్నర కోట్లు, నివాసానికి విలాసవంతమైన భవనాలు, కావాల్సిన వారికి కాంట్రాక్టు విలువను భారీగా పెంచి రూ.లక్ష పనిని రూ.10 లక్షలు చేయడం.. ఇలా అనేక రకాలుగా భారాస హయాంలో ఖజానాపై భారం మోపి భారీగా అప్పులు చేశారని సీఎం రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు.

Updated : 29 Apr 2024 10:25 IST

మా పాలనపై నమ్మకంతో చెబుతున్నా... 14 సీట్లు గెలుస్తాం
కాంగ్రెస్‌, భాజపాల మధ్యే పోటీ
కేసీఆర్‌కు ఎందుకు ఓటేయాలని ప్రజలు అడుగుతున్నారు
హామీలన్నీ అమలు చేస్తాం  
రుణమాఫీకి ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటుచేస్తాం
చంద్రబాబుపై వ్యక్తిగత ద్వేషంతోనే ఏపీ ఎన్నికలపై కేసీఆర్‌, కేటీఆర్‌ వ్యాఖ్యలు
‘ఈనాడు-ఈటీవీ’ ముఖాముఖిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
ఈనాడు - హైదరాబాద్‌

కాళేశ్వరం ప్రాజెక్టులో సమస్య వచ్చిందని 2021లోనే గుర్తించినా ఆనాటి భారాస ప్రభుత్వం పట్టించుకోలేదు. 2023 సెప్టెంబరులో మేడిగడ్డ కుంగింది. డిసెంబరు 7 వరకు కేసీఆరే సీఎంగా ఉన్నారు కదా. అప్పుడే కుంగిన పిల్లర్లను తొలగించి ఎందుకు మరమ్మతులు చేయలేదు? మేం రాగానే విచారణకు ఆదేశించి నిపుణుల కమిటీని నియమించాం. కేసీఆర్‌లాగే మేం కూడా చేస్తే కూలిపోతుంది. మేడిగడ్డ అనేది కాళేశ్వరం ప్రాజెక్టుకు వెన్నెముకలాంటిది. మనిషికి వెన్నుపూస దెబ్బతిన్నాక కాళ్లు, చేతులున్నాపనిచేయగలరా? మేడిగడ్డలో నీరుంటే అన్నారంలో, అక్కడి నుంచి సుందిళ్లలో ఎత్తిపోయాలి. మేడిగడ్డలో నీరు ఆపడానికి లేదు. కేసీఆర్‌ వితండవాదంతో ప్రజలను తికమకపెడుతున్నారు.

-సీఎం రేవంత్‌రెడ్డి

‘‘ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు, ఎండిపోయిన రిజర్వాయర్లను కేసీఆర్‌ మా ప్రభుత్వానికి వారసత్వంగా అందించారు. 2014లో ఏడాదికి రూ.ఆరువేల కోట్లు అప్పుల కింద తిరిగి చెల్లిస్తే.. ఇప్పుడు నెలకు రూ.ఏడువేల కోట్లు చెల్లించాల్సిన దుస్థితి. మేం వచ్చాక నాలుగు నెలల్లోనే అప్పులకు రూ.26 వేల కోట్లు చెల్లించాం. దుబారాను తగ్గించి నిధులను జాగ్రత్తగా వినియోగించడం, ఆదాయం పెంపు చర్యలు తీసుకోవడం వల్ల ఇప్పటికే ప్రతి నెలా రూ.500 కోట్ల నుంచి రూ.600 కోట్ల వరకు ఆదాయం పెరిగింది’’ అని ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. రూ.50 వేల  కోట్లతో పూర్తి చేయాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.లక్షన్నర కోట్లు, నివాసానికి విలాసవంతమైన భవనాలు, కావాల్సిన వారికి కాంట్రాక్టు విలువను భారీగా పెంచి రూ.లక్ష పనిని రూ.10 లక్షలు చేయడం.. ఇలా అనేక రకాలుగా భారాస హయాంలో ఖజానాపై భారం మోపి భారీగా అప్పులు చేశారని ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారంటీల్లో ఐదు అమలు చేశామని, ఆగస్టు 15లోగా రైతుకు రుణమాఫీ చేసి తీరతామని ‘ఈనాడు-ఈటీవీ’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎం స్పష్టం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ను స్థాపించి వందేళ్లు అయిన సందర్భంగా రిజర్వేషన్ల రద్దుకు కుట్ర జరుగుతోందని, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు ఉండాలనుకునేవారు కాంగ్రెస్‌కు ఓటు వేయాలని కోరారు. తాము అధికారం చేపట్టిన కొన్ని నెలలకే లోక్‌సభ ఎన్నికల కోడ్‌ వచ్చిందని, ఈ స్వల్పకాలంలో తాము అద్భుతాలు సృష్టించకపోయినా తప్పులు చేయలేదని, ప్రజలను నిరాశపర్చలేదని చెప్పారు. ఐదేళ్లు పాలించేందుకు ప్రజలు తీర్పు ఇస్తే మొదటి వంద రోజుల్లోనే గ్యారంటీల అమలుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ నమ్మకంతోనే లోక్‌సభ ఎన్నికలను తమ పాలనకు ముమ్మాటికీ రిఫరెండంగానే భావించాలని ప్రజలను కోరుతున్నామన్నారు. మోదీని దించాలా ఉంచాలా అనేదానిపైనే ప్రస్తుత ఎన్నికలు జరుగుతున్నాయని.. తెలంగాణలో పోటీ కాంగ్రెస్‌కు, భాజపాకు మధ్యనేనని స్పష్టం చేశారు. బలహీన అభ్యర్థులను నిలిపి కొన్ని నియోజకవర్గాల్లో భాజపా విజయానికి భారాస ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

ఈ ఎన్నికల్లో విజయానికి ఏం చేయబోతున్నారు?

సీఎం: ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో మూడు బహిరంగ సభలు నిర్వహిస్తాం. గ్రామస్థాయి వరకు మేం చేసింది, చేయబోయేదీ వివరిస్తాం. జాతీయస్థాయి నేతలు ఖర్గే, రాహుల్‌, ప్రియాంకాగాంధీలు ప్రచారంలో పాల్గొంటారు. జాతీయ మ్యానిఫెస్టోను ప్రజలకు వివరిస్తాం. మోదీ పాలనలో దేశానికి, యువత, మైనార్టీలకు మహిళలకు జరుగుతున్న అన్యాయాలను ప్రజలకు వివరిస్తాం.

ఈ ఎన్నికలు మీ పాలనపై రిఫరెండం అని ఇప్పటికే మీరు ప్రకటించారు. ఎన్ని సీట్లు వస్తాయని మీ అంచనా ?

సీఎం: కచ్చితంగా వంద రోజుల మా పాలనను రిఫరెండంగా భావించి ఓటు వేయాలని ప్రజలను కోరుతున్నాం. 14 ఎంపీ సీట్లు సాధిస్తాం. ప్రజాతీర్పు ఎలా ఉన్నా గౌరవించాల్సిందే. గత నాలుగు నెలల్లో మేం అందించిన పాలనలో అద్భుతాలు చేయకపోయినా.. తప్పులు మాత్రం చేయలేదని మేం బలంగా నమ్ముతున్నాం. ప్రజలు ఆశించిన ప్రకారం చేస్తున్నాం. మా పాలన కొన్ని వర్గాలను ఎక్కువ సంతోషపెట్టి ఉండవచ్చు. మరికొన్ని వర్గాలను సంతోషపెట్టకపోయి ఉండవచ్చు. కానీ మేం ఎక్కడా ప్రజలను నిరాశపరిచే విధంగా వ్యవహరించలేదనే నమ్మకంతోనే రిఫరెండంగా భావించమని చెబుతున్నాం.

కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంలో యువత ప్రధాన పాత్ర పోషించింది. వచ్చే ఐదేళ్లలో నిరుద్యోగ యువతకు మీరు ఏం చేయబోతున్నారు?

సీఎం: మేం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 30 వేల ఉద్యోగాలను భర్తీ చేశాం. గ్రూప్‌ 1, మెగా డీఎస్సీ తదితర ఖాళీలకూ నోటిఫికేషన్లు ఇచ్చాం. ప్రభుత్వ ఉద్యోగాల్లోని అన్ని ఖాళీలనూ భర్తీ చేస్తాం. మనకున్న నిరుద్యోగానికి ఈ ఖాళీలను భర్తీ చేస్తే సరిపోదు. ప్రపంచంలో ఉండే అవకాశాలను అందిపుచ్చుకోవాలి. అమెరికా తదితర దేశాల్లో మన రాష్ట్ర విద్యార్థులు ఉన్నతవిద్యను అభ్యసించాలి. అక్కడ ఉద్యోగ, వ్యాపారాల్లో రాణించాలి. ఇందుకు సంబంధించిన అన్ని రకాల ప్రోత్సాహకాలు, అవకాశాలను కల్పించే విధంగా ప్రణాళిక ఉంటుంది.

రిజర్వేషన్ల రద్దు గురించి మాట్లాడుతున్నారు. అది అవాస్తవమని, సాధ్యం కాదని భాజపా నేతలు అంటున్నారు..?

సీఎం: లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్ల మెజార్టీ ఇవ్వాలని భాజపా అడుగుతోంది అందుకే కదా. గతంలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఆంగ్లో ఇండియన్లకు రిజర్వేషన్‌ ఉండేది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల చట్టంలోనే సబ్‌ క్లాజ్‌ కింద ఆంగ్లో ఇండియన్ల రిజర్వేషన్‌ ఉండేది. లోక్‌సభలో దాన్ని సులువుగా రద్దు చేశారు. లోక్‌సభలో 300 సీట్ల బలంతో.. రాజ్యసభలో మెజార్టీ లేకున్నా ఆర్టికల్‌ 370, ట్రిపుల్‌ తలాక్‌, జీఎస్టీ, నోట్ల రద్దు వంటి నిర్ణయాలన్నీ అమలు చేశారు. రిజర్వేషన్లు ఉండవద్దన్నది ఆర్‌ఎస్‌ఎస్‌, భాజపాల విధానం. ఎస్సీ, ఎస్టీ, బీసీలు అంటూ అనేక కులాల విభజన కనిపించకుండా హిందువులంతా ఒకే వర్గంగా ఉండాలన్న లక్ష్యంతో రిజర్వేషన్లు రద్దు చేయాలనేది వాళ్ల లక్ష్యం. ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పడి 2025కి వందేళ్లు పూర్తవుతున్నందున దీన్ని అమలు చేయాలనుకుంటున్నారు. రెండు రోజుల కిందట ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన సమావేశంలో.. రిజర్వేషన్లు తొలగిస్తే మద్దతిచ్చేవారు లేచి నిలబడండి అని అడిగారు. రిజర్వేషన్ల రద్దు యోచనతోనే బీసీ జనాభా లెక్కలను సేకరించడానికి మోదీ అంగీకరించడం లేదు.

కాంగ్రెస్‌ ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి..?

సీఎం: ఆరు గ్యారంటీల్లో ఐదు అమలు చేశాం. మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు ఇచ్చాం. బీసీ జనాభా లెక్కల సేకరణకు శ్రీకారం చుట్టాం. ప్రతి నెలా మొదటితేదీనే జీతాలు, పెన్షన్లు, ఆసరా పింఛన్లు ఇస్తున్నాం. కేసీఆర్‌కు 2014లో రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పగించాం. తొమ్మిదిన్నరేళ్ల పాలన తరువాత రూ.7 లక్షల కోట్ల అప్పుతో మాకు అప్పగించారు. శ్రీశైలం, సాగర్‌, జూరాల వంటివన్నీ ఎండబెట్టి మాకు ఇచ్చారు. వీటిని తీసుకుని ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ.. నాలుగు నెలల్లో రూ.26,500 కోట్ల  కిస్తీలు కట్టాం. రాష్ట్రాన్ని గాడిన పెట్టడానికి మేం కష్టపడుతుంటే అభినందించకపోగా అడ్డగోలుగా మాట్లాడుతున్నారు.

కాంగ్రెస్‌ వచ్చినందునే కరవు వచ్చిందని ప్రతిపక్షాలు అంటున్నాయి. దీనివల్ల ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉందా ?

సీఎం: ఓటు వేసేవారు రైతులు. వానలు ఎప్పుడు పడతాయనేది వారికి తెలియదా? మేం డిసెంబరు 7న చలికాలంలో పాలనలోకి వచ్చాం. చలికాలంలో వానలు పడతాయా? కాంగ్రెస్‌ డిసెంబరులో అధికారంలోకి వస్తే కరవు వచ్చిందనడానికి కేసీఆర్‌కు ఆలోచన ఉందా? వానాకాలంలో వానలు పడి రిజర్వాయర్లు నిండి.. ఆ నీటిని మేం వదిలేస్తే మా తప్పవుతుంది. పై రాష్ట్రాల్లో వానలు పడితే మన రిజర్వాయర్లలోకి నీరు వస్తుంది. కరవు రాష్ట్రంగా ప్రకటించిన కర్ణాటక సుప్రీంకోర్టుకు వెళ్లి నిధుల కోసం పోరాడితే కేంద్రం వాళ్లకి రూ.3495 కోట్లు ఇచ్చింది. తెలంగాణలోని జూరాల, శ్రీశైలం, సాగర్‌ వంటి ప్రాజెక్టులకు నీరు రావాలంటే ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకల్లో వర్షాలు పడాలి. అక్కడ కరవు ఉందని ఆ రాష్ట్రాలు కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుంటుంటే.. ఇక్కడ కాంగ్రెస్‌ వల్ల కరవు వచ్చిందని కేసీఆర్‌ మాట్లాడుతున్నారంటే ఏమనాలి?

తెలంగాణకు కాంగ్రెసే ప్రధాన శత్రువు అని కేసీఆర్‌ అంటున్నారు. మీకు పాలన చేతకాలేదని ప్రచారం చేస్తున్నారు.?

సీఎం: కేసీఆర్‌ అక్కసు వెళ్లగక్కుతున్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌.. ప్రథమ శత్రువు ఎలా అయింది? గతంలోనే రైతు రుణమాఫీ చేసినందుకా? రైతులకు ఉచిత కరెంటు ఇచ్చినందుకా? ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేసినందుకా? రాజీవ్‌ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చినందుకా? మైనారిటీ రిజర్వేషన్లు ఇచ్చినందుకా? హైదరాబాద్‌కు కృష్ణా, గోదావరి జలాలు తెచ్చినందుకా? మెట్రో రైలు ఇచ్చినందుకా? ఔటర్‌ రింగ్‌రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించినందుకా.. ఎందుకు శత్రువులమయ్యాం? పదేళ్లపాటు కేసీఆర్‌, మోదీ ఫెయిల్‌ అయ్యారు. 2014 వరకు 14 మంది ప్రధానమంత్రులు చేసిన అప్పు రూ.55 లక్షల కోట్లయితే.. ఆ తర్వాత పదేళ్లలో నరేంద్రమోదీ చేసిన అప్పు రూ.113 లక్షల కోట్లు. ఆయనేమో మూడోసారి ప్రధాని కావాలట.. 100 రోజుల్లో వచ్చిన నేను మాత్రం దిగిపోవాలట. రూ.7 లక్షల కోట్ల అప్పు చేసిన చంద్రశేఖర్‌రావు నన్ను దిగిపొమ్మంటున్నారు. ఇది వారిద్దరి ఒప్పందం. అసలాయన ఎవరి మీద కొట్లాడుతున్నారు? ఎవరిని తిడుతున్నారు? ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నవి ఎవరికి? దిగాల్సింది ప్రధానమంత్రి కదా? ఆయన్ను విడిచిపెట్టి.. నా మీద పడతారేంటి? అంటే కేసీఆర్‌ స్పష్టంగా మోదీతో సుపారీ తీసుకొని.. కాంగ్రెస్‌ను ఖతం చేయడానికి బయలుదేరారు. ఇది ప్రజలు గమనిస్తున్నారు.

మీ ప్రభుత్వాన్ని కూల్చడానికి భాజపా, భారాసలు కలిసి కుట్ర చేస్తున్నాయని మీరు ఆరోపించడం.. ప్రజల్లో ఉన్న వ్యతిరేకత నుంచి దృష్టి మరల్చడానికేనని విపక్షాలు అంటున్నాయి..  

సీఎం: మా ప్రభుత్వం వచ్చింది మొన్నే కదా. వ్యతిరేకత ఎందుకుంటుంది? బడిలో చేరిన విద్యార్థి ఒకటో తరగతి నుంచి రెండో తరగతికి వెళ్లాలంటే కనీసం ఏడాది పాటు చదవాలి కదా. ప్రభుత్వం పనిచేస్తోందా లేదా అని తెలియడానికి వంద రోజులు సరిపోతుందా? మోదీ, కేసీఆర్‌ పదేళ్లు దుర్మార్గాలు చేసి.. మేం పాలనలోకి వచ్చిన వెంటనే మాపై వ్యతిరేకత వచ్చిందంటూ.. కూలగొడతాం, పడగొడతాం అంటున్నారు. వాళ్ల ట్రాక్‌ రికార్డు అలాగే ఉంది.  

ఔటర్‌ రింగ్‌రోడ్డు చుట్టూ టౌన్‌షిప్‌లను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. దీనికి సంబంధించి మీ ప్రణాళికలేమిటి?

సీఎం: ఫార్మా క్లస్టర్లు, హెల్త్‌, ఎడ్యుకేషన్‌, స్పోర్ట్స్‌ టూరిజంలతో పాటు.. ఆర్గానిక్‌ ఫుడ్‌పైనా దృష్టి పెట్టాం. సేంద్రియ పంటలు పండించడానికి రైతులకు సాంకేతిక నైపుణ్యం, నీళ్లు అందించనున్నాం. రీజినల్‌ రింగురోడ్డు మనకు పెద్ద వరం. ఔటర్‌ రింగురోడ్డుతో మన ఆర్థిక పరిస్థితులు ఒక స్థాయికి వచ్చినట్లే రీజినల్‌ రింగురోడ్డుతో మరింత అభివృద్ధి సాధ్యమవుతుంది. ఈ రాష్ట్రం ప్రపంచ పెట్టుబడులకు ద్వారం తెరిచినట్లు అవుతుంది. ఇతర రాష్ట్రాలు, దేశాల్లోని పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెడతాయి. వాళ్ల పెట్టుబడికి నష్టం కలగకుండా చూసే బాధ్యత మనది. దీంతో రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకొని భవిష్యత్‌ ప్రణాళిక ఉంటుంది.

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి సీఎం కావడానికి అన్ని అర్హతలున్నాయని మీరు అనడం ఏ విధమైన ఎత్తుగడ..?

సీఎం: నేను భువనగిరిలో ఆ మాట అన్న సందర్భాన్ని గుర్తించాలి. అంతకు ఒకరోజు ముందు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. కోమటిరెడ్డి బ్రదర్స్‌ దిగజారిపోయారు, మంత్రి పదవి కోసం సీఎం కాళ్లు పట్టుకుని మస్కా కొడుతున్నారని, వాళ్లకు ఆ అర్హతే లేదని ఏదేదో అన్నారు.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆమరణ దీక్ష చేసి మంత్రి పదవిని సైతం త్యాగం చేశారు. మళ్లీ మంత్రి పదవి ఇస్తానన్నా తీసుకోలేదు. ఆయన ట్రాక్‌ రికార్డు తెలుసుకుని మాట్లాడాలి కదా. అన్ని అర్హతలూ ఉన్న వెంకట్‌రెడ్డికి సీఎం అయ్యే అర్హత కూడా ఉందని, మంత్రి పదవి కోసం మస్కా కొట్టాల్సిన అవసరం ఆయనకు లేదని నేను జగదీశ్‌రెడ్డిని ఉద్దేశించి అన్నాను. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎంతో అనుభవమున్న పార్లమెంటేరియన్‌.

మీరు భాజపాలో చేరుతారని భారాస బాగా ప్రచారం చేస్తోంది?

సీఎం: నేను కాంగ్రెస్‌ పార్టీకి నూటికి నూరు శాతం నిబద్ధతతో పనిచేసేవాణ్ని. కొందరు అసూయతో మాట్లాడతారు. ఇలాంటి వ్యాఖ్యలకు విలువ ఉండదు. మోదీ ప్రధాని, నేను ముఖ్యమంత్రి. మేం అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు శత్రువుల్లా ఉంటామా? మన రాష్ట్రానికి కావాల్సింది నేను అడిగా. ఆయన ఇవ్వగలిగింది ఇస్తారు. ఇవ్వకపోతే కొట్లాడడానికి నాకెలాగూ మార్గం ఉంటుంది. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో నేను భాజపాను విమర్శించకుండా ఊరుకుంటున్నానా? వాళ్ల తప్పిదాలను లేవనెత్తకుండా వదిలేశామా?

వచ్చే ఐదేళ్లలో తెలంగాణ స్వరూపాన్ని ఎలా ఊహిస్తున్నారు?

సీఎం: రాబోయే పదేళ్లు కాంగ్రెస్‌ అధికారంలో ఉంటుంది. వచ్చే పదేళ్లలో ప్రపంచంతో పోటీపడే విధంగా తెలంగాణను తీర్చిదిద్దుతాం. ‘వైబ్రెంట్‌ తెలంగాణ 2050’ అనే ప్రణాళికతో మొత్తం తెలంగాణ ముఖచిత్రమే మార్చాలనేది ఆలోచన. ఆనాడు కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు.. ఔటర్‌ రింగురోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం, ఐటీ కారిడార్లు, ఫార్మా కంపెనీలు, మెట్రో రైలు, గోదావరి- కృష్ణా నదీ జలాలను హైదరాబాద్‌కు తరలించడం, శాంతిభద్రతలను నియంత్రణలో ఉంచడం.. ఇవన్నీ జరిగాయి. వీటిని ఇంకా ఉద్ధృతంగా ముందుకు తీసుకెళ్లడానికి మా ప్రభుత్వం ప్రయత్నిస్తుంది.

ఈ ఎన్నికల్లో మీకు రాష్ట్రంలో ఎవరితో పోటీ ఉందనుకుంటున్నారు. ప్రజల నాడి ఎలా ఉందని భావిస్తున్నారు ?

సీఎం: అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు కేసీఆర్‌తో మాకు పోటీ. ఇప్పుడు దేశానికి ప్రధానిని ఎన్నుకోవడానికి ఈ ఎన్నికలు జరుగుతున్నందున మోదీతోనే మాకు పోటీ. భాజపాను దించడానికే ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. అందుకే భాజపా పాలన విధానాలను, ఆ పార్టీ మళ్లీ వస్తే జరిగే ప్రమాదాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఎన్నికల్లో పోటీ మాకు భాజపాతోనే ఉంటుంది. భారాస పోటీలోనే లేదు. గతంలో భారాసకు ఎంపీ సీట్లు వచ్చినా మోదీకే మద్దతిచ్చారు. దీన్నిబట్టి ఆయనకు ఓటేస్తే మోదీకే మద్దతిస్తారని.. ప్రజలు ఈసారి కేసీఆర్‌కు ఓటు ఎందుకు వేయాలని అభిప్రాయపడుతున్నారు. భాజపా, భారాస నేతలు చీకట్లో మాట్లాడుకుంటున్నారు. బయటికేమో పొత్తు లేదంటూ చీకట్లో పొత్తు పెట్టుకుని.. భాజపానే గెలిపించాలని అనుకోవడం వల్ల భారాస ఉనికినే కోల్పోతోంది.

కాంగ్రెస్‌ అధిష్ఠానానికి తెలంగాణలోని మీ ప్రభుత్వం ఏటీఎంలాగా మారిందని ప్రధానమంత్రి మోదీ, భాజపా నేతలు ఆరోపిస్తున్నారు..?

సీఎం: ఎన్నికలున్నప్పుడల్లా వాళ్లు దిల్లీ నుంచి వచ్చి ఇలాంటి మాటలే చెబుతుంటారు. మొన్నటి ఎలక్టోరల్‌ బాండ్లలో ఎవరు అవినీతిపరులో.. ఎవరికి బాండ్లు ఇచ్చారో.. ఎవరి మీద కేసులున్నాయో తెలిసిపోయింది.  ఈ దేశంలో అత్యంత అవినీతిపరులుగా అధికంగా కేసులు ఎదుర్కొంటున్న వాళ్లందరూ భాజపాలోనే చేరారు. నరేంద్రమోదీ పక్కనే కూర్చొంటున్నారు.

తెలంగాణలో రియల్‌ ఎస్టేట్‌ బలహీనపడిందనే విమర్శలున్నాయి..?

సీఎం: ఇది పూర్తిగా అబద్ధపు ప్రచారం. డిసెంబరు 7, 2022 నుంచి ఏప్రిల్‌ 7, 2023 వరకూ నాలుగు నెలల్లో భారాస ప్రభుత్వ హయాంలో రియల్‌ ఎస్టేట్‌ రంగంలో అనుమతులు, నిరభ్యంతర పత్రాలు, రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ ఏ మేరకు ఉన్నాయో లెక్కలు తీయండి. అదే విధంగా డిసెంబరు 7, 2023 నుంచి ఏప్రిల్‌ 7, 2024 వరకూ మా ప్రభుత్వం వచ్చాక రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పురోగతిని పరిశీలించండి. హైదరాబాద్‌కు ఇచ్చిన నీళ్లు, విద్యుత్‌ సరఫరా గణాంకాలు కూడా తీయండి. అప్పటి, ఇప్పటి లెక్కలతో మీరే నివేదికలు తయారు చేయండి. రియల్‌ ఎస్టేట్‌ పెరిగిందా? తగ్గిందా? అనేది మీకే అర్థమవుతుంది. ఎలాగైనా సరే కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని బద్నామ్‌ చేయాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ అద్భుతంగా ఉంది. అనుమతులు సులువుగా వచ్చేస్తున్నాయి. ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరిగింది.

కాంగ్రెస్‌ నేతల్లో ఎన్నడూ లేనంత ఐక్యత ప్రస్తుతం మీ ప్రభుత్వంలో కనిపిస్తోంది. కారణం..?

సీఎం: మా అందరికీ తెలంగాణ అభివృద్ధిపైనే తప్ప వ్యక్తిగత ప్రయోజనాలేవీ లేవు. మా కాంగ్రెస్‌ నేతలంతా సీనియర్లు. ఎంతో అనుభవమున్నవారు. నాకు అనుభవం కొంత తక్కువగా ఉంది. వారి సూచనలు తీసుకుని పనిచేస్తున్నందున ప్రభుత్వాన్ని నడపడంలో నాకు ఎలాంటి ఇబ్బందులు లేవు.

గ్యారంటీ హామీలు, రుణమాఫీ అమలుకు భారీగా నిధులు అవసరం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే అదనపు ఆదాయం పెంచేందుకు ప్రణాళికలేంటి...?

సీఎం: రైతుభరోసా వంటి వాటికి అదనంగా కొంత అవసరం. వందకు వంద శాతం మేం రైతులకు రుణమాఫీ చేసి చూపిస్తాం. ఆషామాషీగా చెప్పట్లేదు. సీఎం అయిన తరువాత అంచనా లేకుండా మాట్లాడతానా? అందుకే రాజీనామా లేఖను జేబులో పెట్టుకుని రమ్మని, ఆగస్టు 15న మాట్లాడతానని హరీశ్‌రావుకు చెప్పా. రుణమాఫీ కోసం కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తాం. రైతుల రుణాలన్నీ ఈ కార్పొరేషన్‌కు బదిలీ చేసేలా చర్యలు తీసుకుంటాం. దీంతో రుణానికి, రైతుకు సంబంధం ఉండదు, కాళేశ్వరం కార్పొరేషన్‌, రుణాలకోసం ఇతర కార్పొరేషన్లు ఏర్పాటు చేసినట్లే ఇది కూడా. వచ్చే బడ్జెట్‌లో రాష్ట్ర ఆదాయం, వ్యయం ఎంత అనేది మాకు అర్థం అవుతుంది. దాన్ని బట్టి రుణం తీసుకుని రుణమాఫీకి కట్టేసి రైతులకు విముక్తి కల్పిస్తాం. ఈ ప్రక్రియ అంతా  జూన్‌ 4న ఎన్నికల కోడ్‌ ముగిశాక ప్రారంభించి ఆగస్టు 15కల్లా పూర్తిచేస్తాం. ఏటా 10 నుంచి 12 శాతం ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి పెరుగుతుంది. ఇప్పటికే నెలకు రూ.500 కోట్ల నుంచి రూ. 600 కోట్ల వరకూ పెరిగింది. ఈ అదనపు ఆదాయాన్ని రైతు రుణమాఫీ కోసం మేం తీసుకోబోయే కొత్త రుణానికి కిస్తీ కింద కడితే 60 నెలల్లో బాకీ తీరిపోతుంది.

కాళేశ్వరంలో ఇప్పుడు తలెత్తిన పరిస్థితుల దృష్ట్యా.. నీటి కొరత ప్రమాదం ఏర్పడింది. వచ్చే ఖరీఫ్‌, రబీ సీజన్లకు నీటి కొరతను ఎలా అధిగమిస్తారు?

సీఎం: కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టుల్లో ప్రధానమైనది పాలమూరు రంగారెడ్డి. దీనికి నీటి కేటాయింపులు తీసుకొని వాటిని పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తాం. గోదావరి మీద తుమ్మిడిహెట్టి దగ్గర కట్టాల్సిన దాన్ని కేసీఆర్‌ నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు మహారాష్ట్రతో సంప్రదింపులు మొదలుపెట్టాం. అక్కడ 1800 ఎకరాల భూమిని తీసుకుని తుమ్మిడిహెట్టిలో 152 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు కడితే.. అక్కడి నుంచి నీళ్లు నిల్వ చేసుకొని కిందకు కాల్వలు తవ్వాలి. దీనివల్ల తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీళ్లు ఇవ్వచ్చు. ఇప్పటికే కేసీఆర్‌ కట్టిన వాటిలో కూలినవెన్ని? కుంగినవెన్ని? ఉపయోగపడేవి ఎన్ని ఉన్నాయనేది కూడా చూస్తాం. కేసీఆర్‌ కట్టారని.. వాటిని గాలికి వదిలేయం. ప్రజలకు ఉపయోగిస్తాం. కేసీఆర్‌ వాళ్ల ఆస్తులో.. తాతముత్తాతల ఆస్తులో అమ్మి వాటిని కట్టలేదు కదా. ప్రజల సొమ్ముతోనే నిర్మించారు కదా. అందుకే ప్రజలకు ఉపయోగపడేవాటిని సరిగ్గా వినియోగిస్తాం. గోదావరి జలాలకు సంబంధించిన కాళేశ్వరాన్ని కూడా ఉపయోగంలోకి తీసుకొస్తాం.

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై మీకున్న సమాచారమేమిటి?

సీఎం: ఎన్నికల కోడ్‌ రావడం వల్ల ఈ అంశంపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టలేదు. మధ్యలో వివరాలు నేను బయటకు చెబితే.. విచారణకు ఇబ్బంది అవుతుంది. ఎన్నికల తర్వాత బడ్జెట్‌ సమావేశాలొచ్చినప్పుడు.. శాసనసభలో పూర్తిస్థాయిలో దాని వివరాలను బయటపెడతాం. దీనిపై అధికారులు టెలిగ్రాఫిక్‌ చట్టం, సైబర్‌ క్రైమ్‌ చట్టాలను పరిశీలిస్తున్నారు.

భారాస ఎమ్మెల్యేల చేరికలకు గేట్లు అన్నీ తెరిచినట్టేనా?

సీఎం: ఒక తలుపు తెరిచాం. గేట్లు అన్నీ తెరవలేదు. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలనేది పార్టీ ఆదేశిస్తుంది. దాన్ని బట్టి మేం ముందుకెళ్తాం.

25 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని కేసీఆర్‌ చెబుతున్నారు. మీ ఎమ్మెల్యేలు ఏమైనా భారాసతో టచ్‌లో ఉన్నారా?

సీఎం: కేసీఆర్‌ చెప్పింది వాళ్ల ఎమ్మెల్యేల గురించి. మా ఎమ్మెల్యేల గురించి కాదు. భారాస ఎమ్మెల్యేలు కేసీఆర్‌కు టచ్‌లో లేకుండా బయట తిరుగుతున్నారు కదా. అందులో 25 మంది టచ్‌లోనే ఉన్నారని ఆయన అన్నారు. కేసీఆర్‌ది దింపుడుకళ్లెం ఆశ. ఇలాగైనా పార్టీని కాపాడుకుందామనే ప్రయత్నం చేస్తున్నారు.

కక్ష సాధింపు అనే పదం రాకుండా.. రేవంత్‌రెడ్డి న్యాయవిచారణ పేరిట పకడ్బందీగా వ్యవహరిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి..

సీఎం: అవినీతి జరిగిందంటే.. ఎవరు నిర్ధారించాలి? రాజకీయంగా మేం నిర్ధారిస్తే అపోహలుంటాయి. అందుకే సంబంధిత ఏజెన్సీలతో విచారణ జరిపిస్తున్నాం. వారిచ్చే నివేదికల ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటాం. వ్యక్తిగత కక్షలకు తావు లేదు. అలాంటి చర్చకు కూడా నేను ఆస్కారం ఇవ్వదలుచుకోలేదు. నాకు ఎవరిపైనా వ్యక్తిగతంగా కోపం లేదు. నన్ను ఎవరన్నా ఇబ్బంది పెట్టినా నేను పట్టించుకోను. నెగెటివ్‌ పాలిటిక్స్‌కు, వ్యక్తులకు నష్టం చేసే విధానాలకు నేను విరుద్ధం. తప్పు జరిగినట్లు విచారణ సంస్థలు నిర్ధారిస్తే.. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. దానికి నాతో సహా ఎవరూ అతీతులు కాదు. నీటిపారుదల ప్రాజెక్టులు, విద్యుత్‌, ధరణిలపై విచారణ చేయిస్తున్నాం.

కొత్త ప్రభుత్వంపై ప్రజల్లో ఆశలు, ఆకాంక్షలు ఎక్కువగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఏం చేయనున్నారు?

సీఎం: దుబారా తగ్గించుకోవాలి. ప్రాజెక్టుల ప్రాధాన్యక్రమంలో ఎంపిక చేసుకోవాలి. 80 శాతం పూర్తయిన ప్రాజెక్టుల్లో 20 శాతం పనులను తొలుత పూర్తిచేసి అందుబాటులోకి తెస్తాం. తర్వాత క్రమంలో 60 శాతం పూర్తయినవి, వాటి తర్వాత 40 శాతం.. ఇలా ప్రాధాన్య క్రమంలో పూర్తి చేయడంపై దృష్టిపెట్టాం. అన్నిటినీ ఒకే రకంగా చూస్తే.. పెండింగులోనే ఉండిపోతాయి. అందుకే ఏ, బీ, సీ, డీ కేటగిరీలుగా విభజించి.. క్రమబద్ధంగా పూర్తిచేస్తాం. దీనివల్ల మనకు ఆర్థిక వెసులుబాటు వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. కేసీఆర్‌లా నేను ఆర్భాటపు ప్రచారాల జోలికి పోను. మేం ఏం చేశామన్నది.. కనీసం ఒక ఏడాది తర్వాతే కనిపిస్తుంది.

మీ హామీలను అమలు చేయడానికి ఆదాయం ఉందా?

సీఎం: ఆదాయం పెంచాలి. పేదలకు పంచాలి అనేది మా విధానం. పన్నులు ఎగ్గొడుతున్న వారిని నియంత్రిస్తే, కొత్తగా పెట్టుబడులు తెస్తే ఆదాయం పెరుగుతుంది. కేసీఆర్‌లా దుబారా వ్యయం చేయకుండా తగ్గించుకుంటే ఆదాయం పక్కాగా సరిపోతుంది. కేంద్రం నుంచి రూ.వేల కోట్లు మ్యాచింగ్‌ గ్రాంట్లుగా వస్తాయి. వారు ఇచ్చే నిధులకు 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం జత చేస్తే సరిపోతుంది. ఈ నిధులను కచ్చితంగా కేంద్రం నుంచి రాబట్టాలని ఆర్థికశాఖకు చెప్పాను. కేంద్ర పథకాల కింద అన్ని రాష్ట్రాలకు ఏటా వచ్చే రూ.15 వేల కోట్లు కూడా కేసీఆర్‌ ఎప్పుడూ తీసుకోలేదు.

కాంగ్రెస్‌ను దెబ్బకొట్టడానికి భాజపాతో భారాస కుమ్మక్కైందని మీరు ఆరోపించారు..

సీఎం: అవును. మహబూబ్‌నగర్‌, చేవెళ్ల, మల్కాజిగిరి, భువనగిరి, జహీరాబాద్‌లలో ఆ పార్టీ ప్రచారం, అభ్యర్థుల స్థితి చూడండి. వాళ్లకు భారాస పార్టీ పరంగా ఏం మద్దతిస్తున్నారు? మొన్న ఎమ్మెల్యే మల్లారెడ్డి.. మల్కాజిగిరి భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌తో ఏం మాట్లాడారో మీరు చూశారు. దీని వెనుక చాలా వ్యూహం ఉందని కేటీఆర్‌ అంటున్నారు. ఏం వ్యూహం రాజేందర్‌ను గెలిపించే వ్యూహమా?

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ గెలవబోతున్నట్లు తమకు సమాచారముందని కేసీఆర్‌, కేటీఆర్‌లు అంటున్నారు. ఇదేమైనా రాజకీయ వ్యూహమా? ఆ వ్యాఖ్యల ప్రభావం తెలంగాణపై పడే అవకాశముందా?

సీఎం: చంద్రబాబునాయుడుపై ఉండే అసూయ. ద్వేషం.. అంతకంటే ఏముంటుంది? కేసీఆర్‌కు ఏదో బాధ, దుఃఖం. కేసీఆర్‌కు, జగన్‌ల మధ్య అవగాహన ముందు నుంచీ ఉన్నదే. చంద్రబాబు అరెస్టును కూడా సమర్థించారు. జగన్‌, కేసీఆర్‌ ఒక జట్టుగా వ్యవహరిస్తున్నారు.

ఏపీలో ఎన్నికల ఫలితాలపై మీ అంచనా?

సీఎం: ఎక్కడైనా ప్రస్తుతం కొనసాగుతున్న ప్రభుత్వాలపై వ్యతిరేకత ఉంది. వాళ్లు చెప్పిన మాట నిలబెట్టుకోనందువల్ల ప్రతికూల వాతావరణం ఉంది. మేం షర్మిల నాయకత్వంలో అక్కడ కాంగ్రెస్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించాం. ఎన్ని సీట్లను గెలిపించుకోగలం? షర్మిల ప్రశ్నించే గొంతుకగా ప్రజా సమస్యలపై ఎలా కొట్లాడుతున్నారు? ఆమెకు ఎలా మద్దతుగా నిలబడాలి? అనేదే నా ప్రణాళిక. ఏపీలో కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలనేదే మా రాజకీయ ప్రణాళిక. ఈసారి అక్కడ అన్ని సీట్లలో పోటీకి దిగాం. మా దృష్టంతా కాంగ్రెస్‌కు అనుకూలమైన ఎన్నికల వాతావరణాన్ని సృష్టించడంపైనే.

షర్మిల కట్టుకున్న చీర గురించి కూడా జగన్‌ మాట్లాడారు..

సీఎం: అది ఆయన విజ్ఞత. సొంత చెల్లెలనే  కాదు.. ఇతర ఆడపిల్లల గురించి కూడా జాగ్రత్తగా మాట్లాడడం మంచిదని నా సూచన.

ప్రభుత్వాన్ని కూలగొడతారని మీ వద్ద ఏమైనా సమాచారం ఉందా?

సీఎం: మీ ప్రభుత్వం ఎలా ఉంటుందో చూస్తాం అని.. కేసీఆర్‌, కేటీఆర్‌, లక్ష్మణ్‌, కిషన్‌రెడ్డిలు బహిరంగంగానే అంటున్నారు కదా.. అదే నాకు సమాచారం. నేను ఇంతదూరం వచ్చానంటే కాంగ్రెస్‌ కార్యకర్తల కష్టమే కారణం. అందుకే ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని, కూలగొట్టేవారు ఊళ్లలోకి వస్తే వీపులు పగులగొట్టాలని కార్యకర్తలకే చెబుతున్నా.


‘పాలమూరు-రంగారెడ్డి’కి వచ్చే నిధులూ కేసీఆర్‌ తెచ్చుకోలేకపోయారు..

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని వంద లేఖలు రాసినా కేంద్రం ఇవ్వలేదని రెండు రోజుల కిందట కూడా కేసీఆర్‌ అన్నారు. పాపం ఆయన మానసిక పరిస్థితి ఏంటో తెలియడం లేదు. మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చే విధానాన్ని తొలగించారు. పీఎంకేఎస్‌వై కింద గుర్తిస్తే వ్యయంలో 60 శాతం కేంద్రం భరిస్తుంది. కేంద్ర జలశక్తి మంత్రి ఈ విషయం కేసీఆర్‌కు చాలాసార్లు చెప్పారు. పాలమూరు ప్రాజెక్టు వివరాలన్నీ పంపితే ఈ పథకం కింద ఎంపిక చేస్తామన్నారు. అలా దాదాపు రూ.30 వేల కోట్లు వచ్చేవి. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు వివరాలన్నీ పంపితే కేంద్రం నుంచి నిధులు వచ్చేవి. కానీ కేంద్రం ఎన్నిసార్లు అడిగినా వారు చెప్పిన పద్ధతిలో ప్రాజెక్టు వివరాలు పంపలేదు. కానీ వినతిపత్రం ఇచ్చానని కేసీఆర్‌ చెబుతున్నారు. వినతిపత్రం అంటే ఒక అంశంపై కేంద్రం దృష్టి పెట్టడానికే ఉపయోగపడుతుంది. నిధులు మంజూరు చేయాలంటే వారు తెలిపిన నిర్ణీత పద్ధతిలో అన్ని వివరాలు ఇవ్వాలి. మేం అధికారంలోకి వచ్చాక కేంద్ర మంత్రిని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నేను కలిసినప్పుడు ఈ విషయం చెబితే వారు అడిగినట్లుగా వివరాలు పంపాం. నీటి కేటాయింపులకు సూత్రప్రాయ ఆమోదం లభించే స్థితిలో ఉంది. నీటి కేటాయింపు ఉంటేనే నిధులొస్తాయి. ఇలాంటి పనులేవీ చేయకుండా చుట్టూ భజన సంఘాన్ని కూర్చోపెట్టుకుని ఊకదంపుడు ఉపన్యాసాలిస్తూ కేసీఆర్‌ పాలన సాగించారు. నేను సీఎం అయ్యాక కేంద్రం వద్దకెళ్లి అన్నీ అడుగుతున్నా. నేను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను కలవడానికి వెళ్లినప్పుడు ఇతర రాష్ట్రాల వారితో మాట్లాడుతూ ఆమె బిజీగా ఉంటే అక్కడే నేను గంటన్నర వేచి ఉండి.. మన రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి చర్చించగా.. ఆమె మంజూరుకు ఆదేశాలిచ్చారు. నేను మొనగాడిని, నేను వెళతానా, నేను వేచి చూస్తానా అంటే నిధులొస్తాయా?

ఈనాడు హైదరాబాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img