icon icon icon
icon icon icon

Rahul Gandhi: మహిళల బ్యాంకు ఖాతాల్లో రూ.లక్ష డిపాజిట్‌ చేస్తాం: రాహుల్‌ గాంధీ

ఈ దేశంలో రాజ్యాంగంతోనే పేదలకు బలమైన శక్తి వచ్చిందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు.

Updated : 09 May 2024 17:50 IST

నర్సాపూర్‌: ఈ దేశంలో రాజ్యాంగంతోనే పేదలకు బలమైన శక్తి వచ్చిందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో నిర్వహించిన కాంగ్రెస్‌ జనజాతర సభలో ఆయన ప్రసంగించారు. ‘‘గొప్ప మేధావులు ఏళ్ల తరబడి కృషి చేసి దేశానికి రాజ్యాంగం అందించారు. ఎంతో గొప్పదైన మన రాజ్యాంగాన్ని మారుస్తామని భాజపా నేతలు చెబుతున్నారు. దేశంలో 90శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రాజ్యాధికారం దక్కటం లేదు. విద్య, ఉద్యోగాలు, ఓటు హక్కు అన్నీ మనకు రాజ్యాంగం ద్వారానే వచ్చాయి. దాంతో పాటు రిజర్వేషన్లు కూడా రద్దు చేయాలని భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్ర చేస్తున్నాయి.

రిజర్వేషన్లు రద్దు చేసే కుట్రలో భాగంగానే ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయిస్తున్నారు. క్రమంగా అన్నింటినీ ప్రైవేటు పరం చేసి రిజర్వేషన్లు రద్దు చేయాలనేది భాజపా ఆలోచన. మోదీ పదేళ్లలో విమానాశ్రయాలు, పోర్టులు, భారీ పరిశ్రమలు విక్రయించారు. భాజపా కుట్రలను అడ్డుకునేందుకు ఇండియా కూటమి శాయశక్తులా పోరాడుతోంది. మోదీ పాలనలో కేవలం 2శాతం ఉన్న బిలియనీర్ల చేతిలోకి దేశ సంపద అంతా వెళ్తోంది. బలహీన వర్గాల్లో రాజకీయ చైతన్యం తెచ్చేందుకు మేం కృషి చేస్తున్నాం. దేశంలో పేదరికాన్ని సమూలంగా నిర్మూలించేందుకు గొప్ప పథకాన్ని రూపొందించాం. ఇండియా కూటమి అధికారంలోకి వచ్చాక.. నిరుపేదలందరితో ఒక జాబితా రూపొందిస్తాం. ప్రతి కుటుంబం నుంచి ఒక మహిళ పేరును ఎంపిక చేసుకుని వారి బ్యాంకు ఖాతాలో రూ.లక్ష డిపాజిట్‌ చేస్తాం’’ అని రాహుల్‌ గాంధీ తెలిపారు.

ఇందిరాగాంధీ హయాంలోనే మెదక్‌ అభివృద్ధి..

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. మెదక్‌ ఎంపీ అభ్యర్థి నీలం మధును గెలిపించాలని కోరారు. 1980లో మెదక్‌ నుంచి ఇందిరాగాంధీ ఘన విజయం సాధించారని, ఆమె ఎంపీగా ఉన్నప్పుడే ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందన్నారు. భెల్‌, ఇతర పరిశ్రమలు ఈ ప్రాంతానికి వచ్చాయన్నారు. గత 25 ఏళ్లుగా మెదక్‌ లోక్‌సభ స్థానం భారాస, భాజపా చేతిలో చిక్కి నలిగిపోయిందని వ్యాఖ్యానించారు. దుబ్బాక ప్రజలను మోసం చేసిన వ్యక్తే మళ్లీ మెదక్‌ భాజపా ఎంపీ అభ్యర్థిగా ఉన్నారని ఎద్దేవా చేశారు. కలెక్టర్‌గా ఉన్నప్పుడు ఈ ప్రాంత రైతులపై అక్రమ కేసులు పెట్టి హింసించిన భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని ఓడించి కేసీఆర్‌, హరీశ్‌రావుకు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img