5 Unique Railway Stations: పేర్లు లేనివి.. వీసా ఉంటేనే అనుమతిచ్చే రైల్వేస్టేషన్ల గురించి విన్నారా!

రైల్వే స్టేషన్లలోకి వెళ్లాలంటే ఫ్లాట్‌ఫామ్‌ టికెట్‌ ఉంటే సరిపోతుంది. కానీ, ఈ స్టేషన్‌లోకి వెళ్లాలంటే తప్పనిసరిగా వీసా ఉండాలి.

Published : 10 Jan 2022 01:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సాధారణంగా రైల్వే స్టేషన్లలోకి వెళ్లాలంటే ఫ్లాట్‌ఫామ్‌ టికెట్‌ ఉంటే సరిపోతుంది. కానీ, ఈ రైల్వే స్టేషన్‌లోకి ప్రవేశించాలంటే తప్పనిసరిగా వీసా ఉండాల్సిందే. సహజంగా రైల్వేస్టేషన్‌కు వెళ్లాలంటే ఇంటి నుంచి ఆటోనో, బస్సునో తీసుకొని ఫలానా రైల్వేస్టేషన్‌ పేరు చెప్పి ప్రయాణాన్ని కొనసాగిస్తాం. కానీ, పేరు లేని రైల్వే స్టేషన్‌కు వెళ్లాలంటే ఏం పేరు చెబుతాం. అలాంటి అరుదైన, ఆసక్తికరమైన రైల్వేస్టేషన్లు ఎక్కడో లేవండి. మన దేశంలోనే ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం వాటి ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం పదండి..


(photo source: google Maps)

ఇంజిన్‌ ఓ రాష్ట్రంలో.. బోగీ మరో రాష్ట్రంలో..

రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న భవానీ మండి రైల్వే స్టేషన్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఈ స్టేషన్‌కు రైలు వచ్చి ఆగితే ఇంజిన్ ఒక రాష్ట్రంలో... రైలు బోగీలు మరొక రాష్ట్రంలో ఉంటాయి. మరో ప్రత్యేకత ఏంటంటే.. టికెట్‌ తీసుకునే ప్రయాణికులు మధ్యప్రదేశ్‌లో నిలబడితే.. టికెట్‌ ఆఫీసు మాత్రం రాజస్థాన్‌లో ఉంటుంది. ఇలాంటి ప్రత్యేకతలు ఉన్న ఈ రైల్వేస్టేషన్‌ గురించి 2018లో ‘భవానీ మండి టేసన్ (Bhawani Mandi Tesan)’ అనే బాలీవుడ్‌ సినిమానూ నిర్మించారు.


వీసా ఉంటేనే అనుమతి..

విదేశాలకు వెళ్లే వారికి వీసా తప్పనిసరి ఉండాలని మనకు తెలుసు. కానీ, పంజాబ్‌లోని అట్టరీ రైల్వే స్టేషన్‌లోకి వెళ్లాలంటే కచ్చితంగా వీసా ఉండాలి. ఇది భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉంది. భద్రత ప్రమాణాల దృష్ట్యా ఈ రైల్వేస్టేషన్‌లోకి ప్రవేశించే వారు వీసా చూపించాల్సి ఉంటుంది. ఒకవేళ వీసా లేకుండా ఎవరైనా పట్టుబడితే కఠినమైన శిక్ష విధిస్తారు.


పేర్లు లేని రైల్వే స్టేషన్లు..

దేశ వ్యాప్తంగా కొన్ని వేల రైల్వే స్టేషన్లు ఉన్నాయి. వాటిలో అన్నింటికీ ఏదో ఒక పేరు ఉండే ఉంటుంది. కానీ, పేర్లు లేని రైల్వేస్టేషన్లు కూడా మన దేశంలో ఉన్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని బంకురా-మసగ్రం మధ్యన ఓ పేరు లేని రైల్వే స్టేషన్‌ ఉంది.  మొదటగా ఈ రైల్వే స్టేషన్‌ను రైనగర్‌ అని పిలిచేవారు. కానీ, పక్కనే ఉన్న రైనా గ్రామస్థులు తమ గ్రామం పేరిట మార్చాలని గొడవ చేశారు. దీని కారణంగా  రెండు గ్రామాల మధ్య గొడవలు చెలరేగడంతో రైల్వే బోర్డు జోక్యం చేసుకుని ఉన్న పేరును తొలగించింది. దీంతో అప్పటి నుంచి ఈ స్టేషన్ పేరు లేకుండానే నడుస్తోంది. అయితే, టికెట్లు మాత్రం రైనగర్ అనే పేరుతో ఇస్తున్నారు. అలాగే ఝార్ఖండ్‌లో మరో పేరు లేని రైల్వేస్టేషన్‌ ఉంది. 2011లో మొదటిసారి ఇక్కడ రైళ్లు నడవడం ప్రారంభించాయి. తొలుత ఈ స్టేషన్‌ను బక్రీచంపి అని పిలిచినా.. స్థానికులు ఆందోళనలు చేయడంతో పేరును తొలగించారు. ప్రస్తుతం పేరు లేకుండానే ఈ రైల్వే స్టేషన్‌ కార్యకలాపాలను సాగిస్తోంది.


(photo source: Piyush goyal twitter)

రెండు రాష్ట్రాల్లో రైల్వే బెంచీ..

మహారాష్ట్ర, గుజరాత్‌ సరిహద్దుల్లో ఉన్న నవపూర్‌ రైల్వేస్టేషన్‌కు ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇక్కడ స్టేషన్‌లోని బెంచీ మధ్యలోంచి మహారాష్ట్ర, గుజరాత్‌ సరిహద్దు రేఖ వెళ్లింది. దీంతో బెంచీలో సగం మహారాష్ట్రలో ఉంటే మరో సగం గుజరాత్‌లో ఉంటుంది. బెంచీ మీద రెండు రాష్ట్రాల పేర్లుంటాయి. ఈ రైల్వేస్టేషన్‌లో టికెట్‌ కౌంటర్‌ మహారాష్ట్ర కిందికి వస్తే.. వెయిటింగ్‌ రూమ్‌, స్టేషన్‌ మాస్టర్‌ ఆఫీసులు గుజరాత్‌ పరిధిలోకి వస్తాయి. అనౌన్స్‌మెంట్స్‌ కూడా నాలుగు (హిందీ, ఇంగ్లిష్‌, మరాఠీ, గుజరాతీ) భాషల్లో చేస్తారు. అప్పట్లో రైల్వేమంత్రిగా ఉన్నపుడు పీయూష్‌ గోయల్‌ కూడా ఈ బెంచీ ఫొటోను ట్విటర్‌లో షేర్‌ చేసి ‘రాష్ట్రాలు విడగొట్టినా… రైల్వే కలిపింది’ అంటూ ట్వీట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని