India-Pak Heritage : వారసత్వ జ్ఞాపకాలకు వారధి.. ఈ ఫేస్‌బుక్‌ గ్రూప్‌!

దేశ విభజన కారణంగా పాక్‌ నుంచి భారత్‌కు వలసొచ్చిన ప్రజలకు మంచి జ్ఞాపకాలను పంచుతోంది ఓ సామాజిక మాధ్యమ గ్రూపు(Social media).

Published : 22 Mar 2023 20:12 IST

(Image : Noshaba facebook)

అవిభక్త భారత దేశం 1947లో భారత్‌-పాక్‌(India-Pak)లుగా విడిపోయాయి. కలలో కూడా ఊహించని ఈ పరిణామంతో సామాన్యులు అభద్రతా భావానికి గురయ్యారు. అప్పటికప్పుడు పాక్‌(Pak) భూభాగంలోని కొందరు హిందువులు భారత్‌(India) వైపు, ఇక్కడి ముస్లింలు పాక్‌ వైపు మూటాముల్లె సర్దుకుని పయనమయ్యారు. ఇరుదేశాల్లో వివిధ చోట్ల వారు స్థిరపడిపోయారు. ఇప్పటికి 75 ఏళ్లు గడిచిపోయాయి. ఆ సంఘటన జరిగిన సమయంలో చిన్న పిల్లలుగా ఉన్న వారంతా ఇప్పుడు దాదాపుగా భూమిపై లేరు. ఉన్న కొద్ది మందీ ఎప్పుడైనా అవకాశం వస్తే తమ సొంతింటిని, ఊరిని, పొలాలను చూడాలని పరితపిస్తున్నారు. కానీ పాక్‌ వెళ్లే సాహసం చేయలేక తమ కొడుకులకు, మనవళ్లకు ఆ బాల్య స్మృతులను చెబుతూ తృప్తి పడుతున్నారు.

1.5లక్షల మంది సభ్యులు

పాక్‌ నుంచి వలస వచ్చిన చాలా కుటుంబాలు ఉత్తర భారతంలో స్థిరపడ్డాయి. వారి పుట్టు పూర్వోత్తరాల గురించి తెలుసుకొనేందుకు వారధిలా నిలుస్తోంది ‘ఇండియా పాకిస్థాన్‌ హెరిటేజ్‌ క్లబ్‌’ ఫేస్‌బుక్‌(Facebook) గ్రూపు. 1.5లక్షల మంది సభ్యులున్న ఈ గ్రూపులో ఎక్కడా విద్వేషం కనపడదు. ఇరు దేశాల్లోని చారిత్రక కట్టడాలు, అందమైన ప్రదేశాలు, ప్రముఖులు, పురాతన నివాసాలు తదితర అంశాలపై మాత్రమే పోస్టులుంటాయి. వాటి ద్వారా అనేక చారిత్రక విషయాలు వెలుగులోకి వస్తుంటాయి. ఎక్కువగా 1947లో విభజన సందర్భంగా విడిపోయిన అనేక కుటుంబాలను ఈ గ్రూపు దగ్గర చేస్తోంది.

వలస కథలు పంచుకుంటూ..

ఈ గ్రూప్‌ అడ్మిన్లలో ఒకరైన ఇమ్రాన్‌ విలియం భారతీయులు ఎవరైనా తమ పూర్వీకులు నివాసం ఉన్న స్థలం చూపించమని అడిగితే వారికి సహాయం చేస్తున్నారు. ఆ ప్రదేశాన్ని వీడియో కాల్స్‌లో చూపిస్తున్నారు. ఇక్కడి వారు ఆ ప్రాంతాన్ని చూసి తమ తాతలు, తండ్రులు చెప్పిన జ్ఞాపకాలను గుర్తుతెచ్చుకుంటున్నారు. ఈ గ్రూపులో వలస వెళ్లిన వ్యక్తుల కథలు, వారి అనుభవాలను తరచూ పంచుకుంటారు. తమ తాతలు, తండ్రులు కోల్పోయిన పూర్వ స్నేహితులను వెతికి పట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. తొలుత ఈ గ్రూప్‌నకు ‘పంజాబ్‌ ఖోజ్‌’(డిస్కవరీ ఆఫ్ పంజాబ్‌) పేరు పెట్టారు. ఎక్కువ మందికి చేరువ కావాలనే ఉద్దేశంతో తరువాత పేరు మార్చారు.

ఎలా పని చేస్తుందంటే..

సామాజిక మాధ్యమాలపై అవగాహన ఉన్న చాలా మంది వ్యక్తులు ఈ గ్రూప్‌లో చురుగ్గా ఉంటారు. ఉదాహరణకు ఎవరైనా ‘మా పూర్వీకుల పేరు X.. పాక్‌లో ఆయన Y అనే ప్రదేశంలో ఉండేవారు. ఆయన స్నేహితుడి పేరు Z. తెలిస్తే చెప్పండి’ అంటూ పోస్టు పెడతారు. ఇదే గ్రూప్‌లో ఉన్న అవతలి వారిలో ఎవరికైనా ఆ వివరాలపై అవగాహన ఉంటే వెంటనే స్పందిస్తారు. ఆయన మాకు బంధువనో, ఒకే ఊరి వాడనో.. ఇలా తెలిసిన సమాచారం పంచుకుంటారు.

అడ్మిన్ల సహాయం

ఈ గ్రూప్‌లో చాలా మంది చురుగ్గా వ్యవహరిస్తుంటారు. అందులోని అడ్మిన్లు పాక్‌కు చెందిన నోషబా, ఇమ్రాన్‌ విలియమ్స్‌, జహీద్‌ కర్మన్‌వాలాలు భారత్‌ నుంచి పాక్‌ వెళ్లే వారికి తమ వంతు సహాయం చేస్తున్నారు. అక్కడి పూర్వీకుల ఇళ్లు, ఊర్లు, పొలాలు, ఇతర ప్రదేశాలను చూపిస్తూ సహాయపడుతున్నారు. నోషబా ఒక్కరే ఇప్పటి దాకా 200 మంది భారతీయులకు ఈ వెతుకులాటలో సహాయం అందించారు. భారత్‌ నుంచి కర్తార్‌పూర్‌ కారిడార్‌కు వెళ్లిన చాలా మంది ఆమెను పాక్‌లో కలుస్తుంటారు. ఆమె సహాయం చేసేందుకు ముందుకొచ్చినా కొన్నిసార్లు వీసా లేకపోవడంతో భారతీయులు ఇతర ప్రాంతాల్లోకి వెళ్లడానికి అడ్డంకులు ఎదురవుతున్నాయి.

శిథిల దృశ్యాలు

దేశ విభజన సమయంలో ఖాళీ చేసిన చాలా నివాసాలు ఇప్పుడు శిథిలమైపోయాయి. నివాసానికి అనువుగా ఉన్నవాటిలో అక్కడి స్థానికులు ఉంటున్నారు. కొన్నిచోట్ల పెద్ద భవంతులను కళాశాలలు, కార్యాలయాలుగా వినియోగిస్తున్నారు. లాహోర్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో సిక్కులు ఎక్కువగా నివాసం ఉండేవారు. దాంతో అప్పట్లో కొన్ని గురుద్వారాలు ఉండేవి.

-ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని