Danger insect : చిన్న కీటకం.. అంటార్కిటికాను వణికిస్తోంది!

ప్రపంచంలోని ఏడు ఖండాల్లో అంటార్కిటికాది (Antarctica) చాలా ప్రత్యేకమైన శైలి. ఎల్లప్పుడూ మంచుతో (Snow) కప్పేసి ఉండే ఈ ఖండాన్ని ఓ చిన్న కీటకం (Small insect) ఇప్పుడు వణికిస్తోంది. ఆ సంగతేంటో తెలుసుకోండి.

Updated : 15 May 2023 19:25 IST

(Image : British Antarctic Survey)

అంటార్కిటికాలోని (Antarctica) సిగ్నీ ద్వీపం  (Signy Island) సగం మంచుతో నిండి ఉంటుంది. కొన్నేళ్ల కిందట ఆ ద్వీపానికి పిలవని అతిథిలా ఓ కీటకం వచ్చింది. అది ఏళ్ల తరబడి తిష్ఠ వేయడంతో దాని సంతతి బాగా అభివృద్ధి చెందింది. ఆ కీటకమే ఇప్పుడు ఓ సమస్యలా మారింది.

ఏంటీ కీటకం?

ఆ కీటకం పేరు ఎరెట్‌మప్టేరా మర్ఫీఐ. ఇది ద్వీపంలోని నేల స్వభావాన్ని మారుస్తోందని తాజాగా బ్రిటిష్‌ అంటార్కిటిక్‌ సర్వే తేల్చింది. ఎరెట్‌మప్టేరా మర్ఫీఐ మృత సేంద్రియ పదార్థాలను విందుగా ఆరగిస్తుంది. అలా చేయడం వల్ల మొక్కలు వేగంగా కుళ్లిపోతున్నాయి. తద్వారా నేలలో నైట్రేట్‌ స్థాయులు మూడు నుంచి ఐదు రెట్లు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇలా జరగడం వల్ల కొన్ని మొక్క జాతులు ప్రమాదంలో పడుతున్నాయి. భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయి. నీటిలో నైట్రేట్ అధికంగా కలవడం వల్ల ఆల్గే కూడా పెరుగుతోంది. దాంతో ఆక్సిజన్‌ శాతం తగ్గి జలచరాలకు హాని కలుగుతోంది. వేగంగా పర్యావరణ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ కీటక సంచారం లేని మిగతా ప్రాంతాల్లో ఇలాంటి అసాధారణ మార్పులు లేవని  పరిశోధనలో వెల్లడైంది.

నైట్రేట్ శాతం పెరుగుదల

మర్ఫీఐ ఈ ద్వీపంలోకి ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు. ఈ కీటకం దక్షిణ జార్జియాకు చెందినది. 1960 ప్రాంతంలో జరిపిన ఓ వృక్షశాస్త్ర పరిశోధన కారణంగా ఈ కీటకం అంటార్కిటికా ద్వీపంలో అడుగుపెట్టింది. దాని జాతి విస్తరణ 1980 నాటికి స్పష్టంగా కనిపించింది. అదే ఇవాళ ఐలాండ్‌లో నైట్రేట్‌ పెరుగుదలకు కారణమైంది. గతంలో పెద్ద జంతువులైన పెంగ్విన్‌లు, సీల్స్‌ సంచరించే ప్రాంతాల్లో మాత్రమే నైట్రేట్ పెరుగుదల నమోదయ్యేదట. కానీ, మర్ఫీఐ సంతతి గణనీయంగా పెరగడం వల్ల నైట్రేట్‌ శాతం కూడా అధికమవుతున్నట్లు సమాచారం. బ్రిటిష్‌ అంటార్కిటిక్‌ సర్వే ప్రకారం కొన్ని చోట్ల ఒక చదరపు మీటరు విస్తీర్ణంలో కీటక లార్వా సాంద్రత 20వేల కంటే ఎక్కువున్నట్లు తేలింది.

ఎలా వచ్చిందంటే..!

ఇంత ప్రమాదకరమైన కీటకం ఈ ద్వీపంలోకి ఎలా ప్రవేశించి ఉంటుందనే విషయంపై నిపుణులు కొన్ని అభిప్రాయాలను వెల్లడించారు. అయితే వారు చెప్పిన దాని ప్రకారం ఈ కీటకాల రాకకు కారణం మానవులేనట. పరిశోధకులు, పర్యాటకులు ఈ జాతి కీటకాలపై నడిచి ఉంటారని అనుమానిస్తున్నారు. అవి వారి అరికాళ్లకు లేదా షూలకు అతుక్కొని ఇంత దూరం వచ్చి ఉంటాయని చెబుతున్నారు. మరో కొత్త భయం ఏమిటంటే ఈ కీటకాలు నీటిలోనూ మనుగడ సాగించగలవు. దాంతో అవి ఇతర ద్వీపాలకు ప్రయాణిస్తే పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. అంటార్కిటికాలో చాలా తక్కువ జాతులు నివసిస్తున్నాయి. ప్రపంచ పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో ఈ ఖండానికి ప్రత్యేక స్థానం ఉంది. ఎరెట్‌మప్టేరా మర్ఫీఐ తరహాలో మరిన్ని జీవజాతులు ప్రవేశిస్తే పరిస్థితి ఆందోళనకరంగా మారుతుందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

-ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని