వర్మ ‘దిశ’ చిత్రాన్ని నిలిపివేయండి

‘దిశ’ అత్యాచార ఘటన నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రాన్ని నిలిపి వేయాలని కోరుతూ

Published : 03 Nov 2020 01:18 IST

న్యాయకమిషన్‌ను ఆశ్రయించిన దోషుల కుటుంబసభ్యులు

హైదరాబాద్‌: ‘దిశ’ అత్యాచార ఘటన నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రాన్ని నిలిపి వేయాలని కోరుతూ ఆ కేసులోని దోషుల కుటుంబ సభ్యులు న్యాయ కమిషన్‌ను ఆశ్రయించారు. ఇప్పటికే ఈ చిత్రాన్ని ఆపాలని ‘దిశ’ తండ్రి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం కల్పించుకుని ఈ సినిమాను వెంటనే నిషేధించాలని కోరారు. తమను సంప్రదించకుండా రాంగోపాల్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించడం సరికాదన్నారు. కుమార్తెను కోల్పోయి, ఇప్పటికీ ఎంతో బాధపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా ఈ చిత్రాన్ని నిలిపివేయాలంటూ దిశ కేసులో ఎన్‌కౌంటర్‌కు గురైన శివ, నవీన్‌, చెన్నకేశవులు, ఆరీఫ్‌ కుటుంబ సభ్యులు న్యాయ కమిషన్‌కు విన్నవించారు.

ఈ చిత్రంలో తమ వాళ్లను విలన్‌లుగా పెట్టి చెడుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. చనిపోయిన వారి ఆత్మ క్షోభించేలా ఈ చిత్రం తీసి తమను ఇంకా చంపుతున్నారని కమిషన్‌ ముందు వాపోయారు. ఓ పక్క న్యాయ కమిషన్‌లో విచారణ కొనసాగుతుంటే ‘దిశ’ కథను ఎలా తెరకెక్కిస్తారని ప్రశ్నించారు. వెంటనే రాంగోపాల్‌ వర్మ తీస్తున్న చిత్రాన్ని నిలిపి వేయాలని కమిషన్‌కు దోషుల కుటుంబసభ్యులు విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని