Amaravati: తుళ్లూరు దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్తత.. మహిళలు, వృద్ధులను లాగి పడేసిన పోలీసులు!

 గుంటూరు జిల్లా తుళ్లూరులో అధికార, ప్రతిపక్ష పార్టీలు ర్యాలీలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. దీక్షా శిబిరం వద్ద పోలీసులు వందల సంఖ్యలో మోహరించారు. ర్యాలీలు, నిరసనలకు అనుమతి లేదంటూ.. రైతులను పోలీసులు అరెస్టు చేశారు.

Updated : 24 May 2023 12:31 IST
తుళ్లూరు గ్రామీణం: గుంటూరు జిల్లా తుళ్లూరులో అధికార, ప్రతిపక్ష పార్టీలు ర్యాలీలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఆర్-5 జోన్‌కు వ్యతిరేకంగా గుంటూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్ నిరసన దీక్షకు పిలుపునిచ్చారు. అదే సమయంలో ఆర్-5 జోన్‌కి మద్దతుగా వైకాపా నాయకులు ద్విచక్ర వాహన ర్యాలీ చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందనే అనుమానంతో పోలీసులు తుళ్లూరులో ముందస్తుగానే 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 అమలు చేశారు. అక్కడ అమరావతి రైతుల తుళ్లూరు దీక్షా శిబిరాన్ని పోలీసులు పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు.

అయినప్పటికీ ఆర్-5 జోన్‌కు వ్యతిరేకంగా తుళ్లూరులో తెదేపా ఆధ్వర్యంలో రైతులు నిరసన దీక్ష చేపట్టారు. అప్పటికే దీక్షా శిబిరం వద్ద పోలీసులు వందల సంఖ్యలో మోహరించారు. ర్యాలీలు, నిరసనలకు అనుమతి లేదంటూ.. రైతులను పోలీసులు అరెస్టు చేశారు. మహిళలు, వృద్ధులు అని కూడా చూడకుండా పోలీసులు వారిని లాగి పడేశారు. అక్కడికి వచ్చిన హైకోర్టు సీనియర్ న్యాయవాది, జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్‌నూ పోలీసులు అరెస్టు చేశారు. దీంతో దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శాంతియుతంగా దీక్ష చేపడుతుంటే ఈ అడ్డంకులేంటని అమరావతి రైతులు ప్రశ్నిస్తున్నారు. అరెస్టు చేసిన రైతులు, మహిళలను బలవంతంగా వాహనాలు ఎక్కించి తుళ్లూరు పీఎస్‌కు తరలించారు.

దీక్షా శిబిరంలోకి ఎవరినీ వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. రోజువారీ నిరసనలకు కూడా అనుమతి లేదని పోలీసులు అంటున్నారు. అక్కడికి ఎవరొచ్చినా బలవంతంగా అరెస్టు చేస్తామని తేల్చి చెబుతున్నారు. మరోవైపు తుళ్లూరు మండలంలో తెదేపా నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని