AP High Court: రాజధానిలో స్థానికేతరులకు ఇళ్ల స్థలాలు.. పిటిషన్లపై హైకోర్టు విచారణ

ఆర్‌-5 జోన్‌లో స్థానికేతరులకు ఇళ్ల స్థలాల కేటాయింపునకు రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవోను సవాల్‌ చేస్తూ రైతులు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది.

Updated : 01 May 2023 13:41 IST

అమరావతి: ఆర్‌-5 జోన్‌లో స్థానికేతరులకు ఇళ్ల స్థలాల కేటాయింపునకు రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవోను సవాల్‌ చేస్తూ రైతులు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. రాజధాని పరిధిలో టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేయకుండా ఇళ్ల పట్టాల పంపిణీపై ప్రభుత్వానికి తొందర ఎందుకని పిటిషనర్లు ప్రశ్నించారు.  దీనిపై హైకోర్టు స్పందిస్తూ టిడ్కో ఇళ్లపై ప్రభుత్వం, పిటిషనర్లు ఎలాంటి వివరాలు ఇవ్వలేదని పేర్కొంది. రాజధాని ప్రాంతంలో నిర్మించిన 5వేల టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల వివరాలు, ఇళ్ల మంజూరుకు అనుసరించిన విధివిధానాలను పూర్తి వివరాలతో అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను ఉన్నత న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది.

రాష్ట్రంలో ఏ ప్రాంతానికి చెందిన పేదలకైనా రాజధాని అమరావతిలో 1134 ఎకరాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గుంటూరు(550.65ఎకరాలు), ఎన్టీఆర్‌(583.93 ఎకరాలు) జిల్లా కలెక్టర్లకు భూబదలాయిపు నిమిత్తం సీఆర్‌డీఏ కమిషనర్‌కు అనుమతిస్తూ పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మి ఈఏడాది మార్చి 31న జీవో 45 జారీచేశారు. ఆ జీవోను సవాలు చేస్తూ రాజధాని ప్రాంత రైతులు యు.శివయ్య, కె.రాజేశ్‌, బెజవాడ రమేశ్‌బాబు, ఆలూరి రాజేశ్‌, కుర్రా బ్రహ్మ, కట్టా రాజేంద్రవరప్రసాద్‌ హైకోర్టులో వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఆయా పిటిషన్లపై ఉన్నత న్యాయస్థానం నేడు విచారణ చేపట్టింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని