
ఏపీలో ఇంటర్ పరీక్షలు వాయిదా
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఇంటర్ పరీక్షల నిర్వహణపై పునరాలోచన చేయాలని హైకోర్టు సూచించిన నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలను సైతం పరిగణనలోకి తీసుకున్నామన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు చక్కబడ్డాక ఇంటర్ పరీక్షల తేదీలను ప్రకటించనున్నట్లు మంత్రి వెల్లడించారు. పిల్లల ప్రాణాల మీద, వారి భవిష్యత్తు మీద మమకారం, బాధ్యత ఉన్న ప్రభుత్వంగా సురక్షిత వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలని అనుకున్నామని.. ఇందుకోసం కనీవినీ ఎరుగని విధంగా ఏర్పాట్లు కూడా చేసినట్లు చెప్పారు. దేశంలో, రాష్ట్రంలో పెరుగుతున్న కొవిడ్ కేసులు, ఇందుకు సంబంధించిన వార్తలు చూస్తున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారన్నారు. ఈ విషయాన్ని ప్రజా ప్రభుత్వంగా పరిగణనలోకి తీసుకుని పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నామని మంత్రి వెల్లడించారు.