Unlock: తెలంగాణలో లాక్‌డౌన్‌ ఎత్తివేత

తెలంగాణలో లాక్‌డౌన్‌ను సంపూర్ణంగా ఎత్తివేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ శాతం గణనీయంగా త

Updated : 23 Feb 2024 16:39 IST

హైదరాబాద్‌: తెలంగాణలో లాక్‌డౌన్‌ను సంపూర్ణంగా ఎత్తివేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం ఈమేరకు కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగానే కాకుండా, పక్క రాష్ట్రాల్లో కూడా కరోనా నియంత్రణలోకి వస్తున్న విషయాన్ని కేబినెట్‌ పరిశీలించింది. తెలంగాణ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలకంటే వేగంగా కరోనా నియంత్రణలోకి వచ్చిందని అధికారులు అందించిన నివేదికల ఆధారంగా మంత్రివర్గం నిర్ధారించింది. ఈమేరకు జూన్‌ 19 వరకు అమల్లో ఉన్న లాక్‌డౌన్‌ను రేపటి నుంచి సంపూర్ణంగా ఎత్తివేయాలని నిర్ణయించింది.

అన్ని కేటగిరీల విద్యాసంస్థలు పూర్తి స్థాయి సన్నద్ధతతో జులై 1 నుంచి ప్రారంభించాలని కేబినెట్‌ విద్యాశాఖను ఆదేశించింది. ప్రజా జీవనం, సామాన్యుల బతుకు దెరువు దెబ్బతినొద్దనే ముఖ్య ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయానికి ప్రజల సహకారం కావాలని రాష్ట్ర మంత్రివర్గం కోరింది. లాక్‌డౌన్ ఎత్తివేసినంత మాత్రాన కరోనా విషయంలో నిర్లక్ష్యం తగదని, తప్పనిసరిగా మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్‌ ఉపయోగించడం.. తదితర కరోనా స్వీయ నియంత్రణ విధానాలు విధిగా పాటించాలని స్పష్టం చేసింది. కరోనా పూర్తిస్థాయిలో నియంత్రణకు ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని రాష్ట్ర ప్రజలను కేబినెట్‌ కోరింది. గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. మరోవైపు ప్రభుత్వం కూడా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేసింది. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ప్రత్యేక డ్రైవ్‌లు పెట్టి పౌరులకు వ్యాక్సిన్‌ అందిస్తున్నారు. దీంతో చాలా వరకూ కేసులు తగ్గాయి. కేబినెట్‌ నిర్ణయం మేరకు రేపటి నుంచి ప్రభుత్వ కార్యాలయాలు, బస్సులు, మెట్రో సర్వీసులు అన్నీ ఎప్పటిలాగే నడుస్తాయి.

సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిగా టిమ్స్‌..

ప్రజా అవసరాలకు అనుగుణంగా గచ్చిబౌలి ‘టిమ్స్’ ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా అధునికీకరించడంతో పాటు మరో మూడు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎల్బీనగర్‌ పరిధిలోని కొత్తపేటలో ప్రస్తుతం ఉన్న కూరగాయల మార్కెట్‌ రూపురేఖలు మార్చి ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్‌గా మార్చాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించింది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని