
Ap News: మహిళలకు సుస్థిర ఆదాయ కల్పనే లక్ష్యం: సీఎం జగన్
ఒంగోలు: వైఎస్సార్ ఆసరా రెండో విడత కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఒంగోలులో ప్రారంభించారు. ఆసరా సాయాన్ని ఈ నెల 18 వరకు డ్వాక్రా మహిళల పొదుపు ఖాతాలో నగదు జమ చేయనున్నట్లు సీఎం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పొదుపు సంఘాలకు ఇచ్చిన రుణాల వాగ్దానాన్ని నిలబెట్టుకున్నామన్నారు. దేవీ నవరాత్రుల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం శుభపరిణామమని తెలిపారు. ఈ నెల 13, 14న పండగ కారణంగా అర్హుల ఖాతాలో నగదు జమ అవ్వదన్నారు. అలాగే కడప జిల్లాలో ఎన్నికల కోడ్ ఉన్నందున ఆ జిల్లాకు చెందిన వారికీ నగదు ఖాతాలో జమ అవ్వదని తెలిపారు.
‘‘మహిళలకు సుస్థిర ఆదాయం కల్పించాలనే లక్ష్యంగా పనిచేస్తున్నాం. గతంలో 18.36 శాతం నిరర్ధక సంఘాలు ఉండేవి. ఆసరా కార్యక్రమంతో అవి 0.7 శాతానికి తగ్గాయి. సీ, డీ గ్రేడ్ సంఘాలు ఇప్పుడు ఏ, బీ గ్రేడ్గా ఎదిగాయి. రుణాల రికవరీ శాతం గణనీయంగా పెరిగింది. ఐటీసీ, అమూల్ వంటి సంస్థలతో ఒప్పందం చేసుకుని కార్యక్రమాలు చేపడుతున్నాం. 21 వ శతాబ్దపు ఆధునిక మహిళ ఆంద్రప్రదేశ్లోనే ఉద్భవించాలని కోరుకుంటున్నా. ఒప్పందాలతో మహిళలకు స్వయం ఉపాధి కార్యక్రమాలు చేస్తున్నాం.
రాష్ట్రంలో 61 లక్షల మందికి పింఛను ఇస్తున్నాం. 7.97 లక్షల సంఘాల్లోని 78.76 లక్షల మంది మహిళల పొదుపు ఖాతాల్లో రూ.6,439 కోట్లను జమ చేయనున్నాం. ఒంగోలు పట్టణంలో తాగునీటి కోసం రూ. 400 కోట్ల ప్రాజెక్టు మంజూరు చేస్తున్నాం. వెలిగొండ ప్రాజెక్ట్ పనులను ప్రభుత్వం పరుగులు పెట్టిస్తోంది. రెండో టన్నెల్ పనులు శరవేగంగా చేస్తున్నాం. 2022 ఆగస్టు నాటికి మొదటి టన్నెల్ నుంచి నీటిని విడుదల చేస్తాం’’ అని సీఎం తెలిపారు.