Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం..

Updated : 23 Apr 2024 21:07 IST

1.ఏపీలో ఇద్దరు సీనియర్‌ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

రాష్ట్రంలో మరో ఇద్దరు సీనియర్‌ ఐపీఎస్‌లపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. ఇంటెలిజెన్స్‌ డీజీ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, విజయవాడ సీపీ కాంతిరాణాను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఇద్దరు అధికారులకు ఎన్నికలతో సంబంధంలేని విధులు అప్పగించాలని ఈసీ ఉత్తర్వుల్లో పేర్కొంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. ‘90 సెకన్ల ప్రసంగంతో కాంగ్రెస్‌కు వణుకు’.. ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) చేసిన ‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు భాజపా, కాంగ్రెస్‌ (Congress)ల మధ్య మాటల యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేశాయి. ప్రధాని తాజాగా హస్తం పార్టీపై మరోసారి విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. కాంగ్రెస్‌ కుట్ర పన్నుతోందనే సత్యాన్ని తాను బయటపెట్టడంతో ఆ పార్టీలో ఆందోళన మొదలైందని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజస్థాన్‌లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొన్న మోదీ కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్‌ షా

కాంగ్రెస్‌కు కానీ, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కానీ.. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(CAA)లో జోక్యం చేసుకునే ధైర్యం లేదని భాజపా అగ్ర నాయకుడు అమిత్‌ షా (Amit shah) అన్నారు. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్‌ కొనాల్సిందే!

: ప్రపంచంలోని అత్యంత అందమైన నగరాల్లో ఇటలీలోని వెనిస్‌ (Venice) ఒకటి. 100కు పైగా దీవులుగా విస్తరించిన ఈ నగరంలోని కాలువలపై పడవ విహారం సందర్శకులకు మరిచిపోలేని అనుభూతి ఇస్తుంది. దీంతో ఏటా పెద్దఎత్తున పర్యటకులు ఇక్కడికి పోటెత్తుతుంటారు. అయితే.. విపరీతమైన రద్దీ కాస్త ఈ ప్రాంతానికి తలకుమించిన భారంగా మారింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. బ్రిటన్‌కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?

పెద్దఎత్తున అక్రమ వలసలతో సతమతమవుతోన్న బ్రిటన్‌.. వీటికి అడ్డుకట్ట వేసేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన వివాదాస్పద ‘రువాండా బిల్లు’కు (Safety of Rwanda Bill) పార్లమెంటు ఆమోదం తెలిపింది. దీనిని సమర్థించుకున్న ప్రధానమంత్రి రిషి సునాక్‌ (Rishi Sunak).. అక్రమ వలసదారులను ఆఫ్రికా దేశానికి తరలించేందుకు ఏదీ అడ్డు కాదన్నారు. అంతర్జాతీయ వలసల నిర్వహణలో ఇదో మైలురాయని తెలిపారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. అధికారంలోకి రాగానే చెత్తపన్ను రద్దు చేస్తాం: చంద్రబాబు

 ఉత్తరాంధ్రకు జగన్‌ ఏం చేశాడో చెప్పాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్‌ చేశారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన ప్రసంగించారు. ‘‘స్థానిక ఎమ్మెల్యే అవినీతిపరుడు.. ఆమదాలవలసను పూర్తిగా ఊడ్చేశాడు. నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా ఆ ఇంట్లో వారికి కానుకలు సమర్పించాలి. నాగావళి, వంశధార ఇసుక విశాఖపట్నం వెళ్తోంది. ఇలాంటి వ్యక్తిని ఎప్పుడూ చూడలేదు. నా దృష్టిలో పడ్డవారిని నేనంత ఈజీగా వదిలిపెట్టను. రూ.10 ఇచ్చి వందరూపాయలు దోచుకునే వ్యక్తి జగన్‌’’ అని విమర్శించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. మామా అల్లుళ్లు.. నా సవాల్‌కు సిద్ధమా?: రేవంత్‌రెడ్డి

భారాస హయాంలో పాలమూరు నేలకు అన్యాయం జరిగిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. దేశానికే ఆదర్శవంతమైన నాయకులను ఇచ్చిన గడ్డ పాలమూరు అని కొనియాడారు. 70 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రి పదవి ఇక్కడి బిడ్డకు దక్కిందన్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినపల్లిలో నిర్వహించిన కాంగ్రెస్‌ జనజాతర సభలో రేవంత్‌ మాట్లాడారు. గతంలో కరీంనగర్‌లో ఓటమి భయంతోనే.. కేసీఆర్‌ పాలమూరు ఎంపీగా పోటీ చేశారని ఎద్దేవా చేశారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8.జగన్‌.. దేనికి సిద్ధం? మళ్లీ రూ.7లక్షల కోట్లు అప్పు చేయడానికా: షర్మిల

ఐదేళ్లలో ఒక్క జాబ్‌ క్యాలెండర్‌ కూడా ఇవ్వలేని జగన్‌.. మళ్లీ ప్రజల్ని మోసం చేయడానికి సిద్ధం అంటున్నారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఎద్దేవా చేశారు. ప్రజల అవసరాలు పట్టించుకోని వైకాపా ఎమ్మెల్యేలకు జనం ఎందుకు ఓట్లు వేయాలని ప్రశ్నించారు. బాపట్ల జిల్లా కర్లపాలెంలో జరిగిన బహిరంగసభలో ఆమె ప్రసంగించారు. బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి ఇసుక మాఫియాగా మారారని,  ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. పేదల ఇళ్ల స్థలాలకు భూముల కొనుగోలు పేరిట భారీ దోపిడీ చేశారని విమర్శించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. ‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త: UGC హెచ్చరిక

ఆన్‌లైన్‌లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (UGC) విద్యార్థులకు కీలక హెచ్చరిక చేసింది. విద్యార్థుల్ని ఆకట్టుకొనేందుకు ‘పది రోజుల్లోనే ఎంబీఏ’ వంటి కోర్సుల పేర్లతో ప్రచారం చేస్తున్న వారిపై అప్రమత్తంగా ఉండాలని సూచించింది. దేశంలోని ఉన్నత విద్యాసంస్థల్లో గుర్తింపుపొందిన డిగ్రీ ప్రోగ్రామ్‌ల మాదిరిగానే సంక్షిప్త పదాలతో ఆన్‌లైన్‌ ప్రోగ్రామ్‌లు, కోర్సులను అందిస్తామంటూ కొందరు వ్యక్తులు, సంస్థలు విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆందోళన వ్యక్తంచేసింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. గుంపులో స్మార్ట్‌ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్‌తో పట్టేశాడు..!

స్మార్ట్‌ఫోన్‌ లేనిదే రోజు గడవని పరిస్థితి. కేవలం ఫోన్‌ నంబర్లే కాదు.. మన వ్యక్తిగత, ఆర్థిక సమాచారమూ అందులోనే ఉంటోంది. మన అశ్రద్ధ వల్ల స్మార్ట్‌ఫోన్‌ పోతే.. దానికి ఎవర్నీ నిందించక్కర్లేదు. ఒకవేళ ఎవరైనా ఉద్దేశపూర్వకంగా మన స్మార్ట్‌ఫోన్లు కొట్టేస్తే.. బాధపడాల్సి వస్తుంది. పైగా వందల మంది గుమిగూడినచోట అలాంటిదేమైనా జరిగితే ఇక వాటిపై ఆశలు వదులుకోవాల్సిందే. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని