Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 13 Apr 2024 20:59 IST

1. అధికారంలోకి వస్తాం.. రాష్ట్రానికి పూర్వ వైభవం తెస్తాం: చంద్రబాబు

 ‘కూటమి అభ్యర్థులను గెలిపించండి.. మీ భవిష్యత్తుకు మాది భరోసా’ అని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. గుంటూరులో జిల్లా ప్రత్తిపాడులో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన ప్రసంగించారు. ‘‘అమరావతి చుట్టూ ఔటర్‌ రింగ్‌రోడ్డు వేద్దామని అనుకున్నా. తెనాలి, హనుమాన్‌ జంక్షన్‌, సత్తెనపల్లి మీదుగా ఓఆర్‌ఆర్‌ వచ్చేది.యువతకు లక్షల ఉద్యోగాలు వచ్చేవి. అమరావతే మన రాజధాని.. దీనికి తిరుగులేదు’’ అని చంద్రబాబు అన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. ఆ రెండు రాష్ట్రాల్లో ‘ఇండియా’ కూటమిదే హవా.. : చిదంబరం

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) మెరుగైన ఫలితాలే లక్ష్యంగా కాంగ్రెస్‌ (Congress) తన ప్రచారాన్ని ముమ్మరం చేసింది. 2019తో పోలిస్తే ఈసారి తమకు మరిన్ని సీట్లు వస్తాయని పార్టీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం (Chidambaram) ధీమా వ్యక్తంచేశారు. పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తమిళనాడు, కేరళల్లో ‘ఇండియా’ కూటమి ఘన విజయం సాధిస్తుందని, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌, ఝార్ఖండ్‌, దిల్లీల్లోనూ పరిస్థితులు సానుకూలంగా ఉన్నట్లు తెలిపారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. ఐదేళ్ల చిన్నారిపై హత్యాచారం.. పోలీసుల అదుపులో 20మంది అనుమానితులు

 ఓ ఐదేళ్ల చిన్నారిపై పలువురు అత్యాచారానికి పాల్పడి, అనంతరం హత్య చేసిన ఘటన గోవాలోని వాస్కో ప్రాంతంలో చోటుచేసుకుంది. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (సౌత్) సునీతా సావంత్ తెలిపిన వివరాల ప్రకారం... గోవాలోని వాస్కోలో గురువారం సాయంత్రం నుంచి కనబడకుండా పోయిన ఐదేళ్ల బాలిక శుక్రవారం ఉదయం వడెమ్ ప్రాంతంలోని ఓ నిర్మాణస్థలంలో అపస్మారక స్థితిలో కనిపించింది. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, మార్గమధ్యలోనే ఆ చిన్నారి మరణించినట్లు వైద్యులు పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. ప్రజలు మౌనంగా ఉండొద్దు.. పోరాడి సాధించుకోవాలి: కేసీఆర్‌

ప్రజలు మౌనంగా ఉంటే సమస్యలు పరిష్కారం కావని, పోరాడి సాధించుకోవాలని భారాస అధినేత కేసీఆర్‌ పిలుపునిచ్చారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేవెళ్లలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ ప్రసంగించారు. ‘‘ ప్రభుత్వం ఆదుకుంటందనే విశ్వాసం ప్రజల్లో ఉండాలి. కానీ, ప్రజలకు మేలు చేయాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కనిపించడం లేదు. కొన్ని ప్రలోభాలతో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది’’ అని కేసీఆర్‌ అన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. నిర్మాతపై డ్రగ్‌ కేసు.. రూ.40 కోట్లు ఏం చేశాడంటే?

 మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో అరెస్టయిన తమిళ సినీ నిర్మాత, డీఎంకే మాజీ సభ్యుడు జాఫర్‌ సాదిక్‌ (Jaffer Sadiq) రూ.కోట్లను చిత్ర పరిశ్రమ, ఇతర వ్యాపారాలకు వినియోగించినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) ఆరోపించింది. ఏప్రిల్‌ 9న చెన్నై, మదురై, తిరుచురాపల్లిలో ఫెడరల్‌ ఏజెన్సీ జరిపిన దాడుల ఆధారంగా ఈడీ శనివారం ఈ ప్రకటనను విడుదల చేసింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. నిజం అంటే చంద్రబాబు.. అబద్ధం అంటే జగన్‌: భువనేశ్వరి

‘నిజం అంటే చంద్రబాబు.. అబద్ధం అంటే జగన్‌’ అని నారా భువనేశ్వరి అన్నారు. ‘నిజం గెలవాలి’ యాత్ర ముగింపు సందర్భంగా ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగలో పాల్గొని ఆమె ప్రసంగించారు. ‘నిజం గెలవాలి’ పేరుతో రాష్ట్రంలోని 94 నియోజకవర్గాల్లో  9070 కిలోమీటర్లు తిరిగి 203 కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందించానన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. చక్కెర నాడు తీపి.. కుమారకా? చంద్రుడికా..?

మండ్య (Mandya).. కర్ణాటకలోని కావేరీ తీరంలో గల ఈ లోక్‌సభ (Lok sabha elections) నియోజకవర్గంలో ఈసారి రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. వక్కలిగల అడ్డాగా పేరున్న ఈ ప్రాంతంలో తిరిగి తమ ఆధిపత్యాన్ని దక్కించుకునేందుకు స్వయంగా జేడీఎస్‌ (JDS) నేత కుమారస్వామి (Kumaraswamy)యే ఇక్కడ రంగంలోకి దిగారు. ఆయనను అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ (Congress) ‘స్టార్‌ చంద్రు’గా పేరున్న ప్రముఖ కాంట్రాక్టర్‌ వెంకటరమణ గౌడను నిలబెట్టింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. 400 కాదు.. 200 సీట్లు దాటి చూపించండి: భాజపాపై మమత వ్యాఖ్యలు

లోక్‌సభ ఎన్నికల్లో భాజపాకు 200 సీట్లు కూడా రావని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. మోదీవన్నీ అబద్ధపు గ్యారెంటీలేనంటూ దుయ్యబట్టారు. రాజ్యాంగాన్ని భాజపా కాలరాస్తోందని విమర్శించారు. జల్పాయ్‌ గురిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో శనివారం పాల్గొన్న సందర్భంగా కేంద్రంపై ఆమె తనదైన శైలిలో నిప్పులు చెరిగారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. గ్యాస్‌ ఆధారిత విద్యుత్‌ ప్లాంట్లకు కేంద్రం ఆదేశాలు

ఈ వేసవిలో విద్యుత్‌ డిమాండ్‌ పెరగడంతో గ్యాస్‌ ఆధారిత విద్యుత్‌ ఉత్పాదక ప్లాంట్లను మే 1 నుంచి జూన్‌ 30 వరకు ఉత్పత్తి జరుపుతూ ఉండాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ వేసవిలో గరిష్ఠంగా 260 గిగావాట్ల విద్యుత్‌ డిమాండ్‌ ఉంటుందని విద్యుత్‌ మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. గత ఏడాది సెప్టెంబర్‌లో గరిష్ఠ విద్యుత్‌ డిమాండ్‌ 243 గిగావాట్ల ఆల్‌టైం గరిష్ఠ స్థాయికి చేరుకుంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. పిల్లలు సూపర్‌ మార్కెట్ ఉత్పత్తులు కాదు: సరోగసీపై ఇటలీ ప్రధాని వ్యాఖ్యలు

సరోగసీ (surrogacy) ద్వారా మాతృత్వాన్ని పొందడం అమానవీయమని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ (Giorgia Meloni) వ్యాఖ్యలు చేశారు. ఈ పద్ధతిలో జన్మించిన పిల్లల్ని సూపర్ మార్కెట్ ఉత్పత్తులుగా పరిగణిస్తారని ఘాటుగా స్పందించారు. ‘‘ఒకరి గర్భాన్ని అద్దెకు తీసుకోవడం స్వేచ్ఛాచర్య అని మీరు నన్ను ఒప్పించలేరు. పిల్లల్ని సూపర్‌ మార్కెట్‌లో ఉత్పత్తిగా పరిగణించడాన్ని ప్రేమ అని మీరు నాకు సర్దిచెప్పలేరు’’ అని అన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని