Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 22 Aug 2023 09:13 IST

1. ఏపీలో కమ్ముకున్న చిమ్మచీకట్లు

ఏపీలో విద్యుత్‌ సరఫరా గాడి తప్పింది. డిమాండ్‌లో భారీ పెరుగుదల లేకున్నా, ప్రభుత్వం సరఫరా చేయలేని స్థితికి వచ్చింది. అత్యవసర లోడ్‌ రిలీఫ్‌ (ఈఎల్‌ఆర్‌) పేరుతో సుమారు 3 మిలియన్‌ యూనిట్లు (ఎంయూ) కోత విధించినట్లు సమాచారం. సోమవారం రాత్రి 7-10 గంటల వరకు కొన్ని ఫీడర్‌ల పరిధిలో విద్యుత్‌ కోతలు విధించినట్లు అధికారులు చెబుతున్నా.. గ్రామాల్లో ఐదారు గంటల పాటు కరెంటు లేదు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. సీఎం జగన్‌ పాలనపై విరుచుకుపడ్డ బండి సంజయ్‌

‘రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 10 వేలకు పైగా నకిలీ ఓటర్ల పేర్లను చేర్చేందుకు వైకాపా ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. కేంద్ర ఎలక్షన్‌ కమిషన్‌ ఈ విషయంపై చాలా సీరియస్‌గా ఉంది. అందులో భాగంగానే అనంతపురం జడ్పీ సీఈవోను సస్పెండ్‌ చేసింది’ అని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ విమర్శించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. వామపక్షాలతో పొత్తు లేనట్లే!

వామపక్షాలు కోరుతున్న స్థానాలకు కూడా భారాస అభ్యర్థులను ప్రకటించడంతో వాటితో ఎన్నికల అవగాహనకు అవకాశం లేనట్లేనని స్పష్టమవుతోంది. మునుగోడు ఉప ఎన్నికలో సీపీఐ, సీపీఎంలు భారాసకు మద్దతు ఇచ్చి ఆ పార్టీ విజయానికి కృషి చేశాయి. అప్పటి నుంచి భారాస, వామపక్షాల మధ్య మైత్రి ప్రారంభమైంది. కానీ కేసీఆర్‌ భారాస అభ్యర్థుల జాబితాను ప్రకటించేయడంతో వామపక్షాలు కంగుతిన్నాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. తెదేపా సమరోత్సాహం

యువగళం పాదయాత్ర సందర్భంగా మంగళవారం గన్నవరంలో నిర్వహించే బహిరంగ సభ తెలుగుదేశం శ్రేణులకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఈ సభ నిర్వహణను పార్టీ నేతలు సవాల్‌గా తీసుకుని ఏర్పాట్లు చేస్తున్నారు. లోకేశ్‌ పాదయాత్ర సోమవారం రాత్రి గన్నవరం చేరుకోగా ఆయనకు విడిది ఏర్పాటు చేశారు. మంగళవారం భారీ బహిరంగ సభ మాత్రమే ప్రణాళికలో ఉంది. సభకు కనీసం లక్ష మందిని సమీకరించాలనే లక్ష్యంతో పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభావేదిక నుంచి ప్రత్యర్థులకు సవాల్‌ విసిరేందుకు సిద్ధమవుతున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. వరి విస్తీర్ణం పెరుగుదలలో దేశంలోనే తెలంగాణ ప్రథమం

ప్రస్తుత వానాకాలం(ఖరీఫ్‌) సీజన్‌లో తెలంగాణలో రెండు పంటల సాగు విస్తీర్ణం 4.65 లక్షల హెక్టార్ల మేర పెరిగింది. నాలుగు పంటల సాగు 1.92 లక్షల హెక్టార్ల మేర తగ్గింది. కేంద్ర వ్యవసాయశాఖ సోమవారం విడుదల చేసిన గణాంకాల ద్వారా ఈ విషయం వెల్లడైంది. ఈ నెల 18వ తేదీ వరకు సేకరించిన గణాంకాలను తాజాగా వెల్లడించారు. రాష్ట్రంలో వరి, నూనెగింజల సాగు రెండేళ్ల కంటే పెరిగింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. బియ్యం కొనేట్టు లేదు

విదేశాలకు ఎగుమతులపై నిషేధం విధించడంతో.. రైతుల నుంచి కొనుగోలు చేసే ధాన్యం ధరలైతే కాస్త తగ్గించారు. బియ్యం ధరలు మాత్రం తగ్గడం లేదు సరికదా.. రెండు నెలల క్రితంతో పోలిస్తే పెరిగాయి. సన్న బియ్యం ధర కిలో రూ.60 నుంచి రూ.63 మధ్యకు చేరింది. మధ్యరకం బియ్యం ధర కూడా కిలో రూ.50 పైనే ఉంది. బియ్యంతోపాటు పప్పుధాన్యాల ధరలు కూడా ఆకాశం వైపు చూస్తున్నాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. అమావాస్య సమయంలో నేరాలు ఎక్కువ..

ఉత్తర్‌ప్రదేశ్‌లో నేరాలను అరికట్టేందుకు ఆ రాష్ట్ర పోలీసులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. తాజాగా డీజీపీ విజయ్‌కుమార్‌.. పోలీస్‌ ఉన్నతాధికారులకు సుదీర్ఘ లేఖను పంపారు. లేఖతోపాటు హిందూ పంచాంగాన్నీ పంపారు. దాని సహాయంతో.. అమావాస్యకు ఒక వారం ముందు.. ఒక వారం తర్వాత ఎక్కువగా జరిగే నేరాలను అరికట్టడానికి గస్తీ కాయాలని ఆదేశించారు. సెప్టెంబరులో 14వ తేదీ, అక్టోబరులో 14వ తేదీల్లో అమావాస్య తిథి.. కాబట్టి ఈ తేదీల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. పేదలకు గ్యాస్‌ ‘బండే’!

దేశంలో పేదలకు వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరే గుదిబండగా మారిందని తేలింది. దరఖాస్తు ప్రక్రియలోని సంక్లిష్టత, డెలివరీలోని లోపాలు, ఫిర్యాదులు చేస్తే పరిష్కరించే యంత్రాంగం లేకపోవడం వంటివీ వారు వంట గ్యాస్‌ (ఎల్‌పీజీ) వాడటానికి విముఖత చూపడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని వెల్లడైంది. పేదలు వంట గ్యాస్‌ వాడకపోవడానికి గల కారణాలపై స్వచ్ఛ గాలి, మెరుగైన ఆరోగ్యం (క్యాభ్‌) ప్రాజెక్టు జరిపిన అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఇస్రో నియామక రాతపరీక్ష రద్దు

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు చెందిన ‘విక్రమ్‌ సారాభాయ్‌ అంతరిక్ష కేంద్రం’ (వీఎస్‌ఎస్‌సీ)లో సాంకేతిక పోస్టుల భర్తీకి ఆదివారం నిర్వహించిన రాతపరీక్షను రద్దుచేశారు. వేరొకరికి బదులుగా పరీక్షలు రాస్తూ మోసగించారనే ఆరోపణలపై హరియాణాకు చెందిన ఇద్దరిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. దీనిపై కేరళ పోలీసులు పూర్తిస్థాయి విచారణ ప్రారంభించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. హానర్‌ బ్రాండ్‌ ఫోన్లు మళ్లీ వస్తున్నాయ్‌

హానర్‌టెక్‌ తన హానర్‌ బ్రాండ్‌ స్మార్ట్‌ఫోన్లను తిరిగి ప్రవేశపెట్టనుంది. రూ.1,000 కోట్ల మేర ప్రాథమిక పెట్టుబడులతో, సెప్టెంబరులో ఫోన్లను దేశీయ మార్కెట్లను తీసుకురావాలని భావిస్తున్నట్లు కంపెనీ సీఈఓ మాధవ్‌ సేథ్‌ వివరించారు. వచ్చే ఏడాది చివరకు మార్కెట్‌ వాటా పరిమాణంలో 4-5% సాధించాలనే లక్ష్యంతో కంపెనీ ఉందని.. అంటే రూ.10,000 కోట్ల ఆదాయాన్ని పొందాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని