Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 06 Dec 2023 09:16 IST

1. నాడు బూర్గుల.. నేడు రేవంత్‌

కాంగ్రెస్‌ అధిష్ఠానం రేవంత్‌రెడ్డిని సీఎంగా ప్రకటించడంతో పాలమూరు బిడ్డకు రెండోసారి ముఖ్యమంత్రి పదవి దక్కింది. ఈ ప్రాంతానికి చెందిన రేవంత్‌ గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 1952లో అప్పటి హైదరాబాద్‌ రాష్ట్రానికి పూర్వ మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌ నియోజకవర్గం నుంచి గెలిచిన బూర్గుల రామకృష్ణారావు సీఎంగా పని చేశారు. రేవంత్‌రెడ్డి పూర్వ మహబూబ్‌నగర్‌లోని కొడంగల్‌ నియోకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. జగనన్న కాలనీళ్లు

ఆకివీడు మండలం కుప్పనపూడి పరిధి తాళ్లకోడు ప్రాంతంలో 74 ఎకరాల జగనన్న లేఅవుట్‌ ఇది. తుపాను ప్రభావంతో మంగళవారం కురిసిన భారీ వర్షానికి కాలనీ మొత్తం జలమయమైంది. నివాసాల చుట్టూ ముంపు నీరు చేరింది. ఇక్కడ సుమారు 3,273 మందికి స్థలాలు కేటాయించగా సుమారు 1,300 మంది నిర్మాణాలు ప్రారంభించారు. 350 ఇళ్ల నిర్మాణం పూర్తవగా ప్రస్తుతం సుమారు 200 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఇచ్చినవెన్ని.. ఇవ్వాల్సినవెన్ని?

గ్రేటర్‌ హైదరాబాద్‌లో నివసిస్తున్న పేదలకు మూడు నెలల క్రితం పంపిణీ చేసిన రెండు పడక గదుల ఇళ్ల వివరాలను రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ అధికారులు సేకరిస్తున్నారు. ఎన్నికల కోడ్‌ ముగియడంతో గ్రేటర్‌ పరిధిలోని 24 శాసనసభ నియోజకవర్గాల్లో మూడు విడతల్లో పంపిణీ చేసిన ఇళ్లకు సంబంధించిన అంశాలు, లబ్ధిదారుల వివరాలతో నివేదికలను సిద్ధం చేస్తున్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Rapido: క్యాబ్‌ సేవల విభాగంలోకి ర్యాపిడో

4. ఫోన్‌లో వో5జీ ఉందా?

3జీ, 4జీ దాటుకొని 5జీ యుగంలోకి ప్రవేశించాం. మరి ఇంటర్నెట్‌ వేగంతో పాటు కాల్స్‌ నాణ్యత కూడా పెరగొద్దూ. ఇందుకోసమే వచ్చింది వో5జీ(Vo5G) (వాయిస్‌ ఓవర్‌ 5జీ) పరిజ్ఞానం. దీన్నే వాయిస్‌ ఓవర్‌ న్యూ రేడియో (వోఎన్‌ఆర్‌) అనీ పిలుచుకుంటున్నారు. భవిష్యత్‌ వాయిస్‌ కాలింగ్‌ పరిజ్ఞానంగా భావిస్తున్న ఇది ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో అమలవుతోంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. మల్కాజిగిరి సెంటిమెంట్‌.. మూడు ఎన్నికల్లో సంచలనాలు

లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో ఏర్పాటైన మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం మూడు ఎన్నికల్లో సంచనాలు సృష్టించింది. ఇక్కడి నుంచి ఎన్నికైన లోక్‌సభ సభ్యులకు అదృష్టం కలిసివస్తుందన్న సెంటిమెంట్‌ రాజకీయ వర్గాలు బలంగా విశ్వసిస్తున్నాయి. దేశంలో అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గంలో 3 ఎన్నికలు జరిగింది మూడుసార్లయినా ఇక్కడి నుంచి గెలిచిన సర్వే సత్యనారాయణ, చామకూర మల్లారెడ్డి, రేవంత్‌రెడ్డిలు తమ రాజకీయ జీవితంలో కీలక మెట్టును అధిరోహించారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఏపీలో అయిదు దశాబ్దాల్లో 60 తుపాన్లు

వాతావరణ మార్పులు, ఇతర కారణాలతో బంగాళాఖాతంలో తుపాన్ల సంఖ్య తగ్గినా.. అప్పుడప్పుడు ఏర్పడినవే తీవ్ర రూపం దాల్చుతున్నాయి. గత అయిదు దశాబ్దాల్లో రాష్ట్రంపై దాదాపు 60 తుపాన్లు ప్రభావం చూపాయి. వాటిలో 36కు పైగా తీవ్ర, అతితీవ్రత తుపాన్లే. నవంబరు, డిసెంబరు నెలల్లో 25 తుపాన్లు ఏర్పడటం గమనార్హం. తాజాగా బాపట్ల సమీపంలో తీరం దాటిన ‘మిగ్‌జాం’ తుపాను నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు అన్ని జిల్లాలపైనా ప్రభావం చూపించింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. అబ్బో.. దొనకొండపై ప్రేమే!

వైకాపా ప్రభుత్వం కొలువుదీరాక దొనకొండ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామంటూ ప్రకటనలు గుప్పించారు. దీంతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయని స్థానికులు ఎంతో ఆశ పడ్డారు. భూముల ధరలకు తాత్కాలికంగా రెక్కలొచ్చాయే తప్ప అంతకుమించి అడుగు పడింది లేదు. దొనకొండ మండలంలో 21 గ్రామాల్లోని 25 వేల ఎకరాల భూమిని కారిడార్‌గా 2016లో కేటాయించారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. జల్లెడలా రహదారి!

కృష్ణా జిల్లాలో తుపాను కారణంగా మరింత అధ్వానంగా మారిన అవనిగడ్డ - కోడూరు మార్గం. వర్షాలకు గుంతల్లో చేరిన నీటితో  ఏ గొయ్యి ఎంత లోతుందో కూడా తెలుసుకోలేని పరిస్థితి. గతేడాది సీఎం జగన్‌ రోడ్డు నిర్మాణానికి రూ.35 కోట్లు ఇస్తామన్నారు. నేటికీ ఇవ్వకపోవడంతో ప్రజలు పడుతూలేస్తూ పయనిస్తున్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Vijayawada: నేడూ విజయవాడ డివిజన్‌లో రైళ్ల రద్దు

9. సర్కారు వారి బలవంతపు ఆట!

గన్‌ ఆడమని చెబితే ఆడాల్సిందే... పోకిరి సినిమాలో ప్రకాష్‌రాజ్‌ అన్నట్టు గిల్లితే గిల్లించుకోవాల్సిందే..! మాకు ఆడటం తెలియదు మహాప్రభో వదిలేయండని మొత్తుకున్నా ప్రభుత్వం వినదు! వచ్చినా రాకపోయినా.. ఆసక్తి, ఉత్సాహం ఉన్నా లేకపోయినా.. శరీరం సహకరించినా, సహకరించకపోయినా... జగన్‌ హుకుం జారీ చేశారు కాబట్టి ఆడి తీరాల్సిందే..! ఆడటం మీ వల్ల కానే కాదనుకుంటే పోటీలు చూడటానికైనా వెళ్లాల్సిందే..!  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ‘రైతుబిడ్డ..’ ఏడాదికి రూ.కోటి టర్నోవర్‌

ఆధునిక పద్ధతిలో సేద్యం చేస్తూ ఏడాదికి రూ.కోటికి పైగా టర్నోవరును సాధించిన రైతు రమేశ్‌ నాయక్‌ ‘బిలియనీర్‌ ఫార్మర్‌’ అవార్డును దక్కించుకున్నారు. దిల్లీలో గురువారం నిర్వహించే కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా ఆ పురస్కారాన్ని అందిస్తారు. కర్ణాటక రాష్ట్రం కుందాపుర సమీపంలోని తెక్కట్టెకు చెందిన రమేశ్‌నాయక్‌కు 13 ఎకరాల సాగుభూమి ఉంది. అందులో 11 జాతులకు చెందిన 1,634 పండ్ల చెట్లు పెంచుతున్నారు. వ్యవసాయం ద్వారా ఏటా రూ.కోటి సంపాదిస్తున్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని