TS High Court: పోలీసు స్టేషన్‌కు ఎవరూ సరదాగా రారు: హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ప్రజల పట్ల పోలీసుల తీరు మారాల్సిన అవసరం ఉందని తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించింది.

Updated : 16 Feb 2024 21:41 IST

హైదరాబాద్‌: ప్రజల పట్ల పోలీసుల తీరు మారాల్సిన అవసరం ఉందని తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించింది. పోలీసులు ఉన్నది ప్రజల కోసం.. వారిని భయాందోళనలకు గురిచేయడానికి కాదని సీజే ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. పోలీసుల ప్రవర్తన  మార్చుకునేలా, వారి విధులను గుర్తుచేసేలా అవగాహన తరగతులు నిర్వహించాలని డీజీపీకి చెప్పాలని అదనపు ఏజీకి సూచించింది. పోలీసు స్టేషన్‌కు పౌరులు సరదాగా రారని, న్యాయవాదులు, డాక్టర్లతో పాటు పోలీసుల వద్దకు ఎవరూ వెళ్లాలని కోరుకోరని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించడం ప్రజలకు కష్టంగా మారిందని, ఇకపై కేసు నమోదు చేయలేదంటూ ఎవరూ కోర్టుకు రాకుండా డీజీపీ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. తనపట్ల అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తిపై ఫిర్యాదు చేసినా.. కరీంనగర్‌ రెండో పట్టణ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ ఓ మహిళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం విచారణ చేపట్టింది. కోర్టు ఆదేశంతో ఎస్‌హెచ్‌వో ఓదెల వేంకటేశ్‌ వ్యక్తిగతంగా హాజరయ్యారు. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ మహమ్మద్ ఇమ్రాన్‌ వాదనలు వినిపిస్తూ.. 14న ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు తెలిపారు. ఎఫ్ఐఆర్ నమోదులో జాప్యాన్ని ప్రభుత్వ న్యాయవాది సమర్థించినందుకు వారి తరఫున ఏఏజీ క్షమాపణ కోరారు. 

దీంతో ఎస్‌హెచ్‌వోను వదిలిపెట్టలేమని ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంపై వివరణ ఇచ్చుకోవాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ‘‘ఉద్యోగం నుంచి తొలగించినందుకు మహిళ ఫిర్యాదు చేయడానికి వచ్చారని చెబుతున్నారు. ఒకవేళ అది తప్పుడు ఫిర్యాదు అయినా తీవ్రమైన ఆరోపణలున్నప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందే’’ అని తెలిపింది. దర్యాప్తులో అసలు విషయాలు తెలుస్తాయని పేర్కొంది. ఎఫ్ఐఆర్ నమోదు చేసినందున పిటిషన్‌పై అభ్యర్థనలను మూసి వేస్తున్నామని, ఎస్‌హెచ్‌వో వివరణ నిమిత్తం విచారణను మార్చి 4వ తేదీకి వాయిదా వేస్తున్నామని తెలిపింది. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోవడానికి కారణాలేమిటో వివరణ ఇస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని