ఆందోళన ఆపి.. చర్చలకు రండి

చర్చల ద్వారానే సాగు చట్టాలపై ప్రతిష్టంభన తొలగుతుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ అన్నారు. అన్నదాతలు తమ ఉద్యమాన్ని ఆపి.. ప్రభుత్వంతో చర్చలకు ముందుకు రావాలని కోరారు

Published : 25 Dec 2020 16:05 IST

పంజాబ్‌ రైతులను కోరిన తోమర్‌

దిల్లీ: చర్చల ద్వారానే సాగు చట్టాలపై ప్రతిష్టంభన తొలగుతుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ అన్నారు. అన్నదాతలు తమ ఉద్యమాన్ని ఆపి.. ప్రభుత్వంతో చర్చలకు ముందుకు రావాలని కోరారు. కొత్త చట్టాల ప్రాముఖ్యతను రైతులు తప్పకుండా అర్థం చేసుకుంటారని ఈ సందర్భంగా తోమర్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. కొత్త చట్టాలపై పంజాబ్‌ రైతుల్లో కొంత ప్రతికూల అభిప్రాయం ఏర్పడిందని, అయితే ఒకసారి చర్చలు జరిపిన తర్వాత అపోహలన్నీ తొలగిపోయి చట్టాలపై వారికి పూర్తి అవగాహన వస్తుందని అన్నారు.

నూతన చట్టాలకు వ్యతిరేకంగా గత నెల రోజులుగా దిల్లీ శివారుల్లో పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌ రైతులు నిర్విరామంగా నిరసన సాగిస్తున్న విషయం తెలిసిందే. కొత్త చట్టాలపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాల నాయకులతో ఐదు దఫాలుగా చర్చలు జరిపింది. కేంద్ర వ్యవసాయ మంత్రి తోమర్‌ సహా వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌ కూడా ఈ చర్చల్లో పాల్గొని రైతులకు వివరణ ఇచ్చారు. అయితే కేంద్రం చేసిన ప్రతిపాదనలను రైతులు తోసిపుచ్చారు. చట్టాలను పూర్తిగా రద్దు చేయాల్సిందేనని, అప్పటిదాకా ఉద్యమాన్ని ఆపబోమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో గురువారం కేంద్రం మరోసారి రైతులను చర్చలకు ఆహ్వానించింది. దీనిపై రైతు సంఘాలు నేడు సమావేశమై నిర్ణయం తీసుకోనున్నారు.

మరోవైపు కొత్త సాగు చట్టాల వల్ల రైతులకు నష్టం జరిగే ప్రసక్తే లేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పునరుద్ఘాటించారు. ప్రధాని కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద నేడు రూ. 18వేల కోట్ల నిధులను విడుదల చేసిన మోదీ.. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్‌లో జరిగిన కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొని రైతులతో మాట్లాడారు. ప్రతిపక్షాలు కావాలనే రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని దుయ్యబట్టారు.

ఇవీ చదవండి..

రైతుల జీవితాలతో ఆడుకోవద్దు: మోదీ

30వ రోజూ.. అదే ప్రతిష్టంభన

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని