G20 Summit: జీ20 విస్తరణ.. ఆఫ్రికన్‌ యూనియన్‌కు సభ్యత్వం ప్రకటించిన మోదీ

 భారత్‌ అధ్యక్ష స్థానంలో జీ20 గ్రూప్‌పై చెరగని ముద్ర వేసింది. తొలిసారి ఈ గ్రూప్‌ను విస్తరించింది.

Updated : 09 Sep 2023 11:34 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: జీ20 (G20 Summit)లో కీలక పరిణామం చోటు చేసుకొంది. ఆఫ్రికన్‌ యూనియన్‌(African Union)కు శాశ్వత సభ్యత్వం ఇచ్చారు. నేడు భారత్‌ మండపంలో జరిగిన వన్‌ ఎర్త్‌ సెషన్‌ ప్రారంభోపన్యాసంలో ప్రధాని నరేంద్ర మోదీ (PM modi) ఈ విషయాన్ని ప్రతిపాదించారు. అందరు సభ్యుల అంగీకారంతో ఆఫ్రికన్‌ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం ఇస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం ఆఫ్రికన్‌ యూనియన్‌ అధినేతను శాశ్వత సభ్యులకు కేటాయించిన కుర్చీలో కూర్చోబెట్టారు.

ఈ సదస్సులో ప్రధాని ప్రారంభోపన్యాసం చేస్తూ.. ‘‘మొరాకో భూకంప మృతులకు సంతాపం తెలియ జేస్తున్నాను. ప్రపంచం మొత్తం మొరాకోకు అండగా నిలవాలి. వారికి అవసరమైన సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. జీ20 అధ్యక్ష హోదాలో భారత్‌ మీకు స్వాగతం పలుకుతోంది. ప్రస్తుతం 21వ శతాబ్దంలో ప్రపంచానికి కొత్త దిశ, దశ సూచించడానికి ఇదే కీలక సమయం. పాత సవాళ్లు ఇప్పుడు కొత్త సమాధానాలు కోరుతున్నాయి. అందుకనే మనం హ్యూమన్‌ సెంట్రిక్‌ అప్రోచ్‌తో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. కొవిడ్‌ 19 సంక్షోభం తర్వాత ప్రపంచంలో విశ్వాస రాహిత్యం ఏర్పడింది. యుద్ధం ఈ అపనమ్మకాన్ని మరింత పెంచింది. కొవిడ్‌ను ఓడించిన మనం ఈ విశ్వాస రాహిత్యంపై కూడా విజయం సాధించవచ్చు. మనందరం కలిసి ప్రపంచంలో నెలకొన్న అపనమ్మకాన్ని పారదోలుదాము. ఈ క్రమంలో సబ్‌కా సాథ్‌, సబ్‌కా వికాస్‌, సబ్‌కా విశ్వాస్‌, సబ్‌కా ప్రయాస్‌ మంత్రం మనకు మార్గదర్శిగా ఉంటుంది. ప్రపంచంలో పేద, సంపన్న దేశాల మధ్య భేదాలు, ఆహారం, ఇంధనం నిర్వహణ, హెల్త్‌, ఎనర్జీ, నీటి భద్రత వంటి సమస్యలకు సమాధానం కోసం ముందుకు వెళ్లాల్సిందే. భారత్‌ జీ20 అధ్యక్షతన దేశం లోపల, బయట అందరిని కలుపుకొని పోవడానికి ప్రతీకగా నిలిచింది. ఇది ప్రజల జీ20 అనడానికి నిదర్శనంగా మారింది. దేశంలోని 70పైగా నగరాల్లో 200కుపైగా జీ20 సదస్సులు జరిగాయి’’ అని తెలిపారు.

‘‘సబ్‌కా సాథ్‌ భావనతోనే ఆఫ్రికన్‌ యూనియన్‌కు జీ20 సభ్యత్వం ఇవ్వాలని భారత్‌ ప్రతిపాదిస్తోంది. ఈ ప్రతిపాదనకు అందరూ అంగీకరిస్తారని నమ్ముతున్నాను. మీ అనుమతితో జీ20 సభ్యుడి హోదాలో ఆఫ్రికన్‌ యూనియన్‌ అధ్యక్షుడు గ్రూపులో స్థానాన్ని స్వీకరించాలని ఆహ్వానిస్తున్నాను’’ అని మోదీ ప్రకటించారు.

మోదీ ఎదుట ‘భారత్‌’..

ఈ సందర్భంగా ప్రధాని మోదీ కూర్చున్న స్థానంలో దేశం పేరును ‘ఇండియా’కు బదులు ‘భారత్‌’ అని పేర్కొనడం ప్రాధాన్యత సంతరించుకుంది.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని