Uttarakhand: కళ్ల ముందే బ్రిడ్జి కూలిపోయింది!

రాణి పోఖారి గ్రామం వద్ద డెహ్రడూన్-రిషికేష్‌ బ్రిడ్జి కూలిపోయింది. దీనిపై ప్రయాణిస్తున్న ట్రక్‌ ఒకటి నీటిలో పడిపోయింది

Published : 27 Aug 2021 23:05 IST

డెహ్రడూన్‌: దేవభూమి ఉత్తరాఖండ్‌లో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పోటెత్తిన వరదల కారణంగా రహదారులు కొట్టుకుపోతున్నాయి. కొండ చరియలు విరిగిపడుతున్నాయి. తాజాగా రాణి పోఖారి గ్రామం వద్ద డెహ్రడూన్-రిషికేష్‌ బ్రిడ్జి కూలిపోయింది. దీనిపై ప్రయాణిస్తున్న ట్రక్‌ ఒకటి నీటిలో పడిపోయింది. మరికొన్ని వాహనాలు వరద నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. బ్రిడ్జి కూలిపోతున్న దృశ్యాన్ని అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియోలో చిత్రీకరించారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

భారీ వర్షాల నేపథ్యంలో ఉత్తరాఖండ్‌లోని రిషికేష్- దేవప్రయాగ, రిషికేష్-తెహ్రీ, డెహ్రడూన్-ముస్సోరీ రహదారులను మూసివేసినట్లు పోలీసులు తెలిపారు. సాధారణ వాతావరణ పరిస్థితులు వచ్చే వరకూ ఆ మార్గంలో ప్రయాణాలు చేయవద్దని సూచించారు. తపోవన్ నుంచి మలేత వెళ్లే జాతీయ రహదారి 58ను కూడా పూర్తిగా మూసివేశారు.

ఇదిలా ఉండగా.. ఉత్తరాఖండ్‌లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. ఈ సందర్భంగా హెచ్చరికలు సైతం జారీ చేసింది. నైనిటాల్‌, ఉద్ధమ్‌సింగ్‌ నగర్‌, బాగేశ్వర్‌, పితోరాఘర్‌ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని