Lok Sabha polls: లోక్సభ ఎన్నికలు.. జనవరి 13 నుంచి ప్రచారానికి మోదీ శ్రీకారం!
జనవరి 13 నుంచి ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఎన్నికల ప్రచారం మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది.
దిల్లీ: ఈ ఏడాది ఏప్రిల్-మేలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల (Lok Sabha Elections) నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం (Election Election) కసరత్తు ఇప్పటికే ప్రారంభించింది. రాజకీయ పార్టీలు కూడా ముమ్మర ప్రచారానికి సిద్ధమవుతున్నాయి. జనవరి 13 నుంచి ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఎన్నికల ప్రచారం మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. బిహార్లో జరగనున్న బహిరంగ సభతో దేశవ్యాప్త ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.
వచ్చే లోక్సభ ఎన్నికల్లో బిహార్లోని 40 స్థానాల్లో గెలుపు కోసం భాజపా విస్తృత ప్రణాళికలు రచించింది. బహిరంగ సభలతో ముమ్మర ప్రచారం చేపట్టనుంది. జనవరి 13న రాష్ట్ర పర్యటనతోనే ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోదీ శ్రీకారం చుట్టనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలోని బేగూసరాయ్, బెతియా, ఔరంగాబాద్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టనున్నట్లు తెలిపాయి.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాలు కూడా వచ్చే రెండు నెలల్లో బిహార్లో అనేక సభల్లో పాల్గొననున్నారు. జనవరి 15 తర్వాత ముమ్మర ప్రచారం ఉంటుందని సమాచారం. సీతామఢి, మధేపురా, నలందాల్లో అమిత్షా పాల్గొననుండగా సీమాంచల్లో జేపీ నడ్డా పర్యటించనున్నారు. ఇదిలాఉంటే, కేంద్రంలో భాజపాను ఎదుర్కొనేందుకు విపక్ష పార్టీ కూటమి ఇండియాలో బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. విపక్షాల తరఫున ప్రధానమంత్రి అభ్యర్థి రేసులోనూ నీతీశ్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తోన్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.