Abhishek Banerjee: నన్ను, నా భార్యాపిల్లల్ని అరెస్టు చేసినా.. తలవంచను..: అభిషేక్ బెనర్జీ

టీఎంసీ(TMC) నేత అభిషేక్ బెనర్జీ(Abhishek Banerjee) భార్యను కోల్‌కతా విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. దీనిపై ఆ పార్టీ తీవ్రంగా స్పందించింది.

Published : 06 Jun 2023 11:17 IST

కోల్‌కతా: టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీ భార్య రుజిరా బెనర్జీని కోల్‌కతా విమానాశ్రయంలో అధికారులు అడ్డుకోవడాన్ని ఆ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌(West Bengal) ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) తప్పుపట్టారు. దర్యాప్తు సంస్థలు ప్రవర్తిస్తోన్న తీరు దురదృష్టకరమని మండిపడ్డారు.

‘కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ వ్యవహరిస్తోన్న తీరు దురదృష్టకరం. ఆ సంస్థలు వేధింపులకు పాల్పడుతున్నాయి. అభిషేక్ బెనర్జీ భార్య రుజిరా తల్లికి ఆరోగ్యం సరిగా లేదు. అందుకే ఆమెను చూసేందుకు రుజిరా బయలుదేరారు. ఆమె కోల్‌కతాను విడిచివెళ్లాలంటే ఆ విషయాన్ని ముందుగా ఈడీకి వెల్లడించాలని సుప్రీంకోర్టు చెప్పింది. దాని ప్రకారమే ఆ ప్రయాణ వివరాలను రుజిరా(Rujira) సమర్పించారు. కానీ ఆమెను విమానాశ్రయంలో అడ్డుకున్నారు. ఇది వేధించడం గాక ఇంకేంటి..?’అని మమత ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఈ అడ్డగింతపై అభిషేక్ బెనర్జీ(Abhishek Banerjee) స్పందించారు. 

‘నా భార్య ప్రయాణ వివరాలు మొత్తం నేను ఈడీకి సమర్పించాను. నాకు ఏదైనా దురుద్దేశం ఉంటే.. వాటిని ఎందుకు ఇస్తాను..?’ అని ప్రశ్నించారు. ‘నన్ను, నా భార్య, పిల్లల్ని ఈడీ అరెస్టు చేసినా సరే.. నేను తలవంచను. ప్రధానిజీ.. మీరు రాజకీయంగా ఎంతో అనుభవజ్ఞులు. కానీ ప్రజాకోర్టులో మీరు నాతో పోటీ పడలేరు’అని వ్యాఖ్యానించారు. అభిషేక్ బెనర్జీ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తోన్న యాత్రకు వస్తోన్న స్పందన చూసి, భాజపా ఆందోళన చెందుతోందని, అందుకే ఈ తరహా వేధింపులకు పాల్పడుతోందని టీఎంసీ పార్టీ విమర్శించింది. ‘ఈడీ ఒక స్వతంత్ర సంస్థ. ఈడీ, సీబీఐతో భాజపాకు ఏ సంబంధం లేదు. ఇవన్నీ నిరాధార ఆరోపణలు. వారికేవైనా ఫిర్యాదులు ఉంటే.. కోర్టును ఆశ్రయించవచ్చు’ అని భాజపా ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. 

రుజిరా తన ఇద్దరు పిల్లలతో కలిసి యూఏఈ వెళ్లడానికి సోమవారం ఉదయం సుభాష్‌ చంద్రబోస్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగా.. ఇమ్మిగ్రేషన్‌ అధికారులు ఆమెను నిలువరించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. బొగ్గు కుంభకోణానికి సంబంధించి ఈడీ జారీ చేసిన లుకౌట్‌ నోటీసే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఆ నోటీసు ప్రకారం రుజిరా ఈ నెల 8న విచారణకు హాజరు కావాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు