Vande Bharat: ప్రయాణికుల సూచనలతో.. వందే భారత్‌ కోచ్‌లలో సరికొత్త ఫీచర్లు

దేశవ్యాప్తంగా తొమ్మిది కొత్త వందే భారత్‌ రైళ్లను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. వీటిలో కొన్ని ఫీచర్లను గతంలో కంటే మరింత మెరుగుపరిచినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

Updated : 24 Sep 2023 18:17 IST

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన వందే భారత్‌ రైళ్ల  (Vande Bharat Trains) సర్వీసులను క్రమంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 25 వందే భారత్‌ రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉండగా, కొత్తగా మరో తొమ్మిది రైళ్లను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. దీంతో మొత్తం వందే భారత్‌ల సంఖ్య 34కి చేరింది. కొత్తగా తీసుకొచ్చిన వాటిలో ఒక రైలు కాషాయ రంగులో (కాసర్‌గోడ్‌-తిరువనంతపురం రూట్‌లో ఒకటి), మిగిలిన రైళ్లు నీలం రంగులో నడుపుతున్నారు. రాబోయే రెండు నెలల్లో మరో 9 కాషాయ రంగు వందే భారత్‌ రైళ్లను అందుబాటులోకి రానున్నాయి. ఈ క్రమంలోనే కొత్తగా ప్రారంభించిన 9 రైళ్లలో కొన్ని ఫీచర్లను గతంలో కంటే మరింత మెరుగుపరిచినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికుల నుంచి వచ్చిన సలహాలు, సూచనల మేరకు ఈ మార్పులు చేసినట్లు వెల్లడించారు. మరి, అవేంటో చూద్దాం.

  • కొత్తగా ప్రారంభించిన వందే భారత్‌ కోచ్‌లలో సీటు రిక్లైనింగ్ యాంగిల్‌ను 17.31 డిగ్రీల నుంచి 19.37 డిగ్రీలను పెంచారు. దానివల్ల ప్యాసింజర్లు తమ సీట్లను మరింత వెనక్కి జరిపి సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. 
  • ప్రయాణికులు కూర్చునే సీట్ల కుషన్‌ గట్టిగా ఉందనే విమర్శల నేపథ్యంలో కొత్త కోచ్‌లలో మెత్తటి కుషన్‌లను ఏర్పాటు చేశారు. దాంతోపాటు, ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌ కార్‌ సీట్ల రంగును రెడ్‌ నుంచి బ్లూకు మార్చడంతోపాటు, ఫుట్‌రెస్ట్‌ను మరింత పొడిగించారు.
  • కొత్తగా సీట్ల వెనుక మ్యాగజైన్‌ బ్యాగ్స్‌ను ఏర్పాటు చేశారు. మొబైల్‌ ఛార్జింగ్‌ కోసం సీట్ల కింద ఏర్పాటు చేసిన ఛార్జింగ్‌  పాయింట్లను సులువుగా యాక్సెస్‌ చేసేలా వాటిలో మార్పులు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

9 వందే భారత్‌ రైళ్లు ప్రారంభం.. కాచిగూడ-యశ్వంత్‌పుర్‌, విజయవాడ-చెన్నై మధ్య పరుగులు

  • ఇవే కాకుండా టాయిలెట్‌లో మెరుగైన లైటింగ్ కోసం 1.5 వాట్‌ బల్బుల స్థానంలో 2.5 వాట్‌ బల్బులను అమర్చారు. వాష్‌ బేషిన్‌లో చేతుల కడిగే సమయంలో నీళ్లు బేసిన్‌ నుంచి బయటికి రాకుండా వాటి సైజ్‌ను పెంచారు. ప్రయాణికుల సౌకర్యంగా ఉండేలా వాటర్‌ ట్యాప్‌లు, టాయిలెట్ హ్యాండిల్స్‌ను కొత్తగా డిజైన్ చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
  • దివ్యాంగుల వీల్‌ఛైర్‌లను భద్రపరిచేందుకు ప్రత్యేక పాయింట్‌లను ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు మెరుగైన ఎయిర్‌ కండిషనింగ్ కోసం ఎయిర్‌టైట్‌ ప్యానల్స్‌లో మార్పులు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
  • దాంతోపాటు లగేజ్‌ ర్యాక్‌ లైట్లకు గతంలో కంటే మరింత మృదువైన టచ్‌ కంట్రోల్స్‌ను ఏర్పాటు చేశారు. కోచ్‌లో అగ్ని ప్రమాదాలను గుర్తించే ఏరోసోల్‌ ఫైర్‌ డిటెక్షన్‌ వ్యవస్థను మరింత మెరుగుపరిచినట్లు తెలిపారు. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని