Onion: ఉల్లి ఎగుమతులపై సుంకం.. రైతుల నిరసనలు
ఉల్లి ఎగుమతులపై 40శాతం సుంకం విధించడాన్ని నిరసిస్తూ మధ్యప్రదేశ్లో ఉల్లి రైతులు ఆందోళనకు దిగారు.
దిల్లీ: ఉల్లి ఎగుమతులపై కేంద్రం 40శాతం సుంకం విధించిన నేపథ్యంలో రైతులు నిరసనకు దిగారు. మహారాష్ట్రలోని (Maharashtra) అహ్మద్నగర్ హోల్సేల్ మార్కెట్లో ఉల్లి వేలంపాటను తాత్కాలికంగా నిలిపివేశారు. రైతుల శ్రేయస్సుపై కేంద్రం వైఖరి మరోసారి బయటపడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘కేంద్రం రైతు వ్యతిరేక విధానాలు మరోసారి బయటపడ్డాయి. ఉల్లిని అధికమొత్తంలో ఎగుమతి చేయడం ద్వారా కొద్దోగొప్పో లాభాలు పొందొచ్చని భావించాం. కానీ, మా ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది. ఎగుమతులపై 40శాతం సుంకం విధించింది. దీంతో దేశీయ విపణిలో ఉల్లి ధరలు పడిపోయి, మాకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది.’’ అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మహరాష్ట్రలో తగినంత వర్షపాతం లేనందున మార్కెట్లోకి కొత్త ఉల్లి రావడం ఇప్పటికే ఆలస్యం కాగా, తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో మరింత నష్టం వాటిల్లుతుందని రైతులు వాపోతున్నారు. వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని కేంద్రం రైతులకు అన్యాయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ హోల్సేల్ మార్కెట్లలో ధర్నాలు నిర్వహిస్తామని స్వాభిమాని షేట్కారీ సంఘటన రాష్ట్ర అధ్యక్షుడు జగ్పత్ తెలిపారు.
కొత్తగా విధించిన 40శాతం సుంకం 2023 డిసెంబరు 31 వరకు అమల్లో ఉంటుందని శనివారం కేంద్ర ఆర్థికశాఖ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఉల్లి ధరలు సెప్టెంబరులో పెరిగే అవకాశం ఉందని నివేదికలు వస్తున్న నేపథ్యంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 4 వరకు 9.75 లక్షల టన్నుల ఉల్లి మన దేశం నుంచి ఎగుమతి అయ్యింది. రాబోయే పండుగల సీజన్లో గిరాకీ పెరుగుతుంది కాబట్టి దేశీయంగా లభ్యత పెంచేందుకే ప్రభుత్వం ఉల్లి ఎగుమతులపై సుంకం విధించినట్లు వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ వెల్లడించారు. మరోవైపు ప్రభుత్వం 3 లక్షల టన్నుల ఉల్లిని ఈ ఏడాది కోసం బఫర్గా ఉంచింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.