MEA: రష్యాపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాం : భారత విదేశాంగశాఖ
రష్యాలో చిక్కుకుపోయిన భారతీయులను విడుదల చేయించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామని భారత విదేశాంగశాఖ వెల్లడించింది.
దిల్లీ: రష్యా సైన్యానికి (Russia) సహాయకులుగా పనిచేస్తున్న పలువురు భారతీయులను విడుదల చేయించే విషయంపై భారత్ మరోసారి స్పందించింది. ఈ అంశంపై రష్యాపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నామని తెలిపింది. ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి (Russia Ukraine conflict) భారతీయులు దూరంగా ఉండాలని ఇదివరకు కోరిన సంగతి తెలిసిందే.
‘అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను త్వరగా విడిపించే విషయంలో రష్యా అధికారులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాం. దీంతోపాటు ఇద్దరు భారతీయుల మృతదేహాలను తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నాం. ఇందుకు సంబంధించిన పేపర్ వర్క్ కూడా పూర్తయ్యింది. ఈ వారం చివరలో మృతదేహాలు ఇక్కడికి చేరుకోవచ్చు. బాధితుల కుటుంబసభ్యులతోపాటు రష్యా అధికారులతోనూ నిత్యం సంప్రదింపులు జరుపుతున్నాం’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు.
ఉక్రెయిన్ యుద్ధంపై భారత్ వైఖరిపై మీడియా అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ఇందులో తమ నిర్ణయం స్పష్టంగా ఉందన్నారు. సంప్రదింపులు, దౌత్య మార్గాల ద్వారానే శాంతియుత పరిష్కారం సాధ్యమవుతుందన్నారు. ఇందుకు అవసరమైన సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.