Paper Leak: పేపర్ లీకేజీకి పాల్పడితే.. ఇక జీవితాంతం జైల్లోనే..!
ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రశ్నాపత్రాల లీకేజీకి పాల్పడిన వారికి ప్రస్తుతమున్న 10ఏళ్ల నుంచి జీవిత ఖైదు విధించేందుకు రాజస్థాన్ ప్రభుత్వం సిద్ధమైంది.
జైపూర్: ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రశ్నాపత్రాల లీకేజీని (Paper Leak) అడ్డుకునేందుకు రాజస్థాన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. లీకేజీకి పాల్పడిన వారికి ప్రస్తుతమున్న 10ఏళ్ల నుంచి జీవిత ఖైదు విధించేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన బిల్లును వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ విషయాన్ని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ (Ashok Gehlot) ట్విటర్ వేదికగా వెల్లడించారు.
‘రాష్ట్రంలో జరిగే పోటీ పరీక్షల్లో పారదర్శకతను పెంచేందుకు ఉత్తమ విధానం రూపొందించాలని రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, రాజస్థాన్ స్టాఫ్ సెలక్షన్ బోర్డు, ఇతర భాగస్వామ్య పక్షాలతో చర్చించాలని ఆదేశించాం. పేపర్ లీక్లపై నమోదయ్యే కేసుల్లో శిక్షను మరింత పెంచే బిల్లును వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తీసుకురావాలని నిర్ణయించాం. ప్రస్తుతం ఉన్న పదేళ్ల శిక్షను జీవిత ఖైదుకు పెంచుతున్నాం’ అని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ పేర్కొన్నారు.
సెప్టెంబర్ 2021లో నిర్వహించిన ఆర్ఈఈటీ లెవల్-2 ప్రశ్నాపత్రం లీకేజీ కారణంగా రద్దయ్యింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో పేపర్ లీకేజీలను అరికట్టేందుకు రాజస్థాన్ ప్రభుత్వం గతేడాది ఓ బిల్లును ఆమోదించింది. పేపర్ లీకేజీకి పాల్పడితే 10ఏళ్ల వరకు జైలు శిక్షతోపాటు రూ.10కోట్ల వరకు జరిమానా విధించే బిల్లుకు అక్కడి అసెంబ్లీ (మార్చి 2022లో) ఆమోదం తెలిపింది. తాజాగా ఆ శిక్షను మరింతగా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్రంలో పేపర్ లీకేజీ వ్యవహారంపై అధికార కాంగ్రెస్ను ప్రతిపక్ష భాజపా లక్ష్యంగా చేసుకొంటోంది. ముఖ్యంగా ఆర్ఈఈటీ పేపర్ లీకేజీ వ్యవహారాన్ని ప్రస్తుతం రాష్ట్ర పోలీసు విభాగం దర్యాప్తు చేపడుతుండగా.. దీన్ని సీబీఐతో దర్యాప్తు జరిపించాలని భాజపా డిమాండ్ చేస్తోంది. ఈ ఏడాది చివరలో రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇది ప్రచారాస్త్రంగా మారనున్న నేపథ్యంలో.. వీటికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.