Sam Pitroda: ‘దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్లలా కన్పిస్తారు..’: మరో వివాదంలో శామ్‌ పిట్రోడా

Sam Pitroda: భారత్‌లో భిన్నత్వంపై కాంగ్రెస్‌ నేత శామ్‌ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి తెరలేపాయి. దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్లలా, తూర్పు భారతీయులు చైనీయుల మాదిరిగా కన్పిస్తారని ఆయన అన్నారు.

Updated : 08 May 2024 14:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శామ్‌ పిట్రోడా (Sam Pitroda) వ్యాఖ్యలు హస్తం పార్టీకి తలనొప్పిగా మారుతున్నాయి. ఇటీవల ‘వారసత్వ పన్ను’పై మాట్లాడి వివాదంలో చిక్కుకున్న ఆయన.. అది సద్దుమణగక ముందే కొత్త దుమారానికి తెరలేపారు. భారత్‌(India)ను విభిన్న దేశంగా అభివర్ణించే క్రమంలో ఆయన చెప్పిన పోలికలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై భాజపా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆయన జాతి వివక్షకు పాల్పడుతున్నారని దుయ్యబట్టింది.

శామ్‌ పిట్రోడా ఏమన్నారంటే..?

‘ది స్టేట్స్‌మన్’ పత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో భారత ప్రజాస్వామ్యం, భిన్నత్వం గురించి ఆయన మాట్లాడారు. ‘‘లౌకిక దేశాన్ని సాధించడం కోసం మన స్వాతంత్ర్య సమరయోధులు బ్రిటిషర్లతో పోరాడారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యానికి మన దేశమే ఉత్తమ నిదర్శనం. మనది వైవిధ్యమైన దేశం. తూర్పున ఉన్న ప్రజలు చైనీయుల్లా.. పశ్చిమ వాసులు అరబ్బులుగా కన్పిస్తారు. ఇక ఉత్తరాది వాళ్లు శ్వేతజాతీయులుగా.. దక్షిణాది (South Indians) వాళ్లు ఆఫ్రికన్ల మాదిరిగా ఉంటారు. ఇవన్నీ ఎలా ఉన్నా.. మనమంతా సోదరసోదరీమణులమే. భాషలు, మతాలు, సంప్రదాయాలు, ఆహార అలవాట్లను పరస్పరం గౌరవించుకుంటాం. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం మన మూలాల్లో పాతుకుపోయాయి’’ అని అన్నారు.

యూపీలో ఆఖరి దశ ఆసక్తికరం.. భాజపా, మిత్రపక్షాలకు కీలకం..

ఇది జాతి వివక్షే..: భాజపా

అయితే, భారతీయుల రూపురేఖలపై శామ్‌ పిట్రోడా (Sam Pitroda) చేసిన వ్యాఖ్యలు తాజా వివాదానికి తెరలేపాయి. దీనిపై అస్సాం సీఎం (Assam CM) హిమంత బిశ్వ శర్మ స్పందిస్తూ.. ‘‘నేను ఈశాన్య భారతానికి చెందిన వ్యక్తిని. కానీ భారతీయుడిలా కన్పిస్తా. వైవిధ్య భారతావనిలో మనం విభిన్నంగా కన్పించినా మనమంతా ఒక్కటే. కాస్త మన దేశం గురించి కనీస జ్ఞానం తెలుసుకోండి’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. భాజపా (BJP) లోక్‌సభ అభ్యర్థి, నటి కంగనా రనౌత్‌ మాట్లాడుతూ.. ‘‘శామ్‌ పిట్రోడా.. రాహుల్‌ గాంధీ మెంటార్‌. భారతీయులపై ఆయన ఎలాంటి వివక్షపూరిత వ్యాఖ్యలు చేశారో చూడండి. ‘విభజించు-పాలించు’ అనేదే కాంగ్రెస్‌ (Congress) సిద్ధాంతం. ఇది సిగ్గుచేటు’’ అని మండిపడ్డారు.

ఈ వివాదంపై కాంగ్రెస్‌ స్పందించింది. ‘‘పిట్రోడా వ్యాఖ్యలు దురదృష్టకరం. ఆమోదయోగ్యం కాదు. ఆయన వ్యాఖ్యల నుంచి కాంగ్రెస్‌ పూర్తిగా దూరంగా ఉంటుంది’’ అని పార్టీ అధికార ప్రతినిధి జైరాం రమేశ్‌ స్పష్టం చేశారు.

ఇటీవల పిట్రోడా (Sam Pitroda) వారసత్వ పన్ను గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ‘‘అమెరికాలో వారసత్వ పన్ను ఉంది. దాని ప్రకారం.. ఒక వ్యక్తి దగ్గర 100 మిలియన్ల డాలర్ల విలువైన సొత్తు ఉందనుకుంటే.. ఆ వ్యక్తి మరణం తర్వాత అందులో సుమారు 45 శాతం మాత్రమే వారసులకు బదిలీ అవుతుంది. మిగిలిన 55 శాతాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. అదొక ఆసక్తికరమైన అంశం. ఇది న్యాయంగానే ఉంది’’ అని అన్నారు. దీనిపై విమర్శలు వ్యక్తం కావడంతో కాంగ్రెస్‌ (Congress) స్పందించింది. అదంతా ఆయన వ్యక్తిగత అభిప్రాయమని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని