
మైక్, కమలా హారిస్ మధ్య వాడీవేడి చర్చ
సాల్ట్ లేక్ సిటీ: అమెరికాలో కొవిడ్ వ్యాప్తిని నిరోధించడంలో ట్రంప్ పరిపాలనా విభాగాలు పూర్తిగా విఫలమయ్యాయని డెమోక్రాటిక్ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ ఆరోపించారు. అమెరికా అధ్యక్షుల పాలనలోనే ట్రంప్ పాలన అత్యంత విఫలమైందన్నారు. ఉపాధ్యక్ష అభ్యర్థుల ముఖాముఖిలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి మైక్ పెన్స్తో కమలా హారిస్ సంవాదించారు.ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ట్రంప్ అసమర్థ పాలనతో 2లక్షల మంది అమెరికన్లు కరోనా సోకి మృత్యువాత పడ్డారని, దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని విమర్శించారు. కరోనా వైరస్పై జనవరిలోనే ముందస్తు సమాచారం ఉన్నా ట్రంప్ ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టలేదని హారిస్ అన్నారు. ట్రంప్ ఆమోదించిన కరోనా వ్యాక్సిన్ తాను వేసుకోనని స్పష్టం చేశారు. ట్రంప్ కేవలం 750 డాలర్ల ఆదాయ పన్నే చెల్లించారని, పన్ను విషయం దాచాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. 2 కోట్ల మందికి ప్రయోజనం చేకూర్చే ఒబామా కేర్ను ట్రంప్ రద్దు చేశారని మండిపడ్డారు.
ట్రంప్ సమర్థంగా పనిచేశారు: మైక్ పెన్స్
ఈ ఏడాది దేశం పెను సవాళ్లను ఎదుర్కొంటోందన్న మైక్ పెన్స్.. అమెరికన్ల ఆరోగ్యానికి ట్రంప్ మొదటి స్థానం ఇస్తున్నారని పేర్కొన్నారు. కొవిడ్ వ్యాప్తికి చైనానే కారణమని తెలిపారు. ట్రంప్ చర్యల వల్లే వేలాది అమెరికన్లకు ప్రాణాపాయం తప్పిందన్నారు. చైనా ప్రయాణాలపై నిషేధం విధించి ట్రంప్ గొప్ప నిర్ణయం తీసుకున్నారని కితాబిచ్చారు. చైనా నుంచి ప్రయాణ ఆంక్షల్ని బైడెన్ వ్యతిరేకించిన విషయాన్ని పెన్స్ ప్రస్తావించారు. జో బైడెన్ చైనాకు దశాబ్దాలుగా చీర్ లీడర్గా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఒబామా హెల్త్ కేర్ దారుణంగా విఫలమైందని, అందుకే రద్దు చేశామని వివరించారు. ఈ ఏడాది చివరికల్లా కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని, 5 కంపెనీల వ్యాక్సిన్ ప్రయోగాలు మూడో దశలో ఉన్నాయని వివరించారు. వ్యాపారవేత్త అయిన ట్రంప్ ఆదాయపన్నుగా మిలియన్ డాలర్లు చెల్లించారని మైక్ పెన్స్ పేర్కొన్నారు. ఉగ్రవాద అంశంలో ట్రంప్ ప్రభుత్వం పనితీరు గొప్పగా ఉందన్నారు. ఐసిస్ ముఖ్య నేతలను అంతమొందించాం, ఇరాన్కు చెందిన ఖాసీం సులేమానీని తమ ప్రభుత్వమే మట్టుబెట్టిందని వెల్లడించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.