Miss World Pageant: తొలుత ‘బికినీ కాంటెస్ట్‌’గా.. 28 ఏళ్ల తర్వాత భారత్‌ ఆతిథ్యం.. ‘మిస్‌ వరల్డ్‌’ పోటీల సంగతులివీ!

భారత్‌ ఆతిథ్యంలో 71వ ఎడిషన్‌ ‘మిస్‌ వరల్డ్‌’ పోటీలు జరుగుతున్నాయి. శనివారం విజేతను ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా ఈ అందాల పోటీల గురించి పలు ఆసక్తికర విశేషాలు..

Published : 08 Mar 2024 10:55 IST

ప్రపంచ సుందరి- 2024 (Miss World Competitions 2024) పోటీలు అట్టహాసంగా సాగుతున్నాయి. కిరీటాన్ని అందుకునే అందాల రాశి ఎవరా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శనివారం సాయంత్రం ఆ ప్రశ్నకు తెర పడనుంది. ఈ నేపథ్యంలో అసలు ఈ అందాల పోటీ ఎప్పుడు మొదలైంది? తొలి విజేత ఎవరు? ఇప్పటి వరకు భారత్‌ ఎన్ని కిరీటాలు దక్కించుకుంది? తదితర విశేషాలు తెలుసుకుందాం..

  • ఇదొక వేడుకలాంటిది. అన్ని దేశాల మహిళలను ఒకే వేదికపైకి తీసుకురావడం దీని ముఖ్య ఉద్దేశం. ఆయా దేశాల సంస్కృతి, సంప్రదాయాల గురించి అందరికీ తెలిసే అవకాశం ఉంటుంది. 1951లో తొలిసారి ఈ సెలబ్రేషన్స్‌ జరిగాయి. ఈ పోటీలు బాహ్య సౌందర్యానికి సంబంధించినవి మాత్రమే కాదు. అందమొక్కటే ఉంటే ఇక్కడ నెగ్గుకురావడం కష్టం. ఆత్మవిశ్వాసం మెండుగా ఉండాలి. సమయస్ఫూర్తితో మెలగాలి. అందుకే ఆ వేదికపై విజయకేతనం ఎగరేసిన వారిని ‘బ్యూటీ విత్‌ బ్రెయిన్స్‌’ అని ప్రశంసిస్తుంటారు.
  • బ్రిటన్‌ ఫెస్టివల్‌లో భాగంగా బ్రిటిష్‌ టెలివిజన్‌ ప్రెజెంటర్‌ ఎరిక్‌ మోర్లే ‘బికినీ కాంటెస్ట్‌’ (1951) నిర్వహించారు. దానికి మంచి ఆదరణ లభించింది. తర్వాత, బ్రిటిష్‌ ప్రెస్‌ ఆ ఈవెంట్‌కు ‘మిస్‌ వరల్డ్‌’ అని పేరు పెట్టింది. మరోవైపు, బికినీ ధరించి, ప్రదర్శనలివ్వడమేంటని చాలామంది విమర్శలు గుప్పించారు.
  • ఈ పోటీల్లో పాల్గొనేందుకు పలు దేశాలు నిరాకరించాయి. దీంతో, బికినీ స్థానంలో స్విమ్‌ సూట్‌ను ప్రవేశ పెట్టారు. తర్వాత మరికొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. మోర్లే మరణానంతరం (2000) ఆయన భార్య జూలియా, నేపాల్‌ సంతతికి చెందిన బ్రిటిష్‌ వ్యాపారవేత్త దీపేంద్ర గురంగ్‌ ఈ పోటీల నిర్వహణ బాధ్యత తీసుకున్నారు.
  • ఈ పోటీలను 1959 నుంచి బీబీసీ ప్రసారం చేయడం ప్రారంభించింది. 60, 70ల్లో అత్యధిక మంది వీక్షించిన ప్రోగ్రామ్‌గా రికార్డు నెలకొల్పింది.
  • స్వీడన్‌కు చెందిన కికీ హకాన్సన్‌ (First Miss World) మిస్‌ వరల్డ్‌ కిరీటం అందుకున్న తొలి మహిళగా నిలిచారు.
  • ఈ పోటీల్లో విజయం సాధించిన తొలి నల్లజాతి మహిళ జెన్నీఫర్‌ హోస్టన్‌ (గ్రెనడా). 1970 మిస్‌ వరల్డ్‌ ఆమె.

  • అవివాహిత మహిళలకు మాత్రమే ఈ పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంది. సాధారణంగా కనీస వయసు 17, గరిష్ఠ వయసు 27. కొన్ని దేశాల వారికి ఆ ప్రాతిపదిక మారుతుంది. ఏ దేశంలో పుడితే ఆ దేశం నుంచే ప్రాతినిధ్యం వహించే వీలుంది. ఎలాంటి క్రిమినల్‌ రికార్డ్స్‌ ఉండకూడదు.
  • గ్లోబల్‌ ఫైనల్‌, ఫాస్ట్‌ ట్రాక్‌ ఈవెంట్స్‌ పేరిట వడబోత జరుగుతుంది. వందలాది మహిళలు పోటీ పడగా సుమారు 20 మందిని న్యాయ నిర్ణేతలు ఎంపిక చేస్తారు. అనంతరం, ‘బీచ్‌ బ్యూటీ’, ‘మిస్‌ టాలెంట్‌’, ‘మిస్‌ స్పోర్ట్‌’, ‘బ్యూటీ విత్‌ ఏ పర్పస్‌’ వంటి యాక్టివిటీస్‌ నిర్వహించి, వారిలో ప్రతిభ కనబరిచిన వారిని ఫైనల్‌ రౌండ్‌కు తీసుకుంటారు. అన్ని రౌండ్లలో చూపిన ప్రతిభ ఆధారంగా విజేతను ప్రకటిస్తారు. 2003 నుంచి ఫాస్ట్‌ ట్రాక్‌ ఈవెంట్స్‌ ప్రారంభమయ్యాయి.
  • 2005లో ‘కాంటినెంటల్‌ క్వీన్స్‌ ఆఫ్‌ బ్యూటీ’ విభాగాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో ఒక్కో న్యాయ నిర్ణేత తన 40మంది కంటెస్టెంట్లను ఐదుగురు చొప్పున ఎనిమిది బృందాలుగా విభజిస్తారు. ఎక్కువ పాయింట్లు ఎవరైతే సాధిస్తారో వారిని ‘కాంటినెంటల్‌ క్వీన్‌ ఫర్‌ ది రీజియన్‌’ అంటారు. ఒకవేళ భారతీయ మహిళ గెలిస్తే ‘కాంటినెంటల్‌ క్వీన్‌ ఆఫ్‌ బ్యూటీ ఫర్‌ ఇండియా’ అని పేర్కొంటారు.
  • తొలినాళ్లలో ముత్యాలు పొదిగిన కిరీటాలను విజేతలకు అందించేవారు. కొన్నేళ్లుగా ముత్యాలు స్థానంలో వజ్రాలు చేర్చారు. 
  • ఈ పోటీలకు 1996లో భారత్‌ ఆతిథ్యమిచ్చింది. బెంగళూరు వేదికగా జరిగిన ఆ పోటీల్లో వెనిజులాకు చెందిన ఇరెన్‌ స్క్లివా ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకుంది. ఆ ఏడాది నుంచే ఇంటర్నెట్‌ కవరేజ్‌ను తీసుకొచ్చారు. మిస్‌ వరల్డ్‌ వివరాలు పొందుపరిచిన వెబ్‌సైట్‌ను స్క్లివా లాంచ్‌ చేశారు.
  • మళ్లీ ఇన్నాళ్లకు ఈ పోటీలు భారత్‌లో జరుగుతున్నాయి. ఫిబ్రవరి 9న మొదలై, మార్చి 9తో ముగియనున్నాయి. దిల్లీలోని భారత్‌ మండపం, ముంబయిలోని జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ వేదికలుగా మారాయి. ఇప్పుడు జరుగుతున్నది 71వ ఎడిషన్‌. 
  • భారత్‌ నుంచి ఆరుగురు అందాల భామలు కిరీటాన్ని అందుకున్నారు. రీటా ఫరియా (1966), ఐశ్వర్యా రాయ్‌ (1994), డయానా హెడెన్‌ (1997), యుక్తాముఖి (1999), ప్రియాంక చోప్రా (2000), మానుషి చిల్లర్‌ (2017) ప్రపంచ సుందరీమణులుగా నిలిచారు. అత్యధిక కిరీటాలు (6) గెలిచిన దేశాల జాబితాలో భారత్‌తోపాటు వెనిజులా ఉంది.
  • తాజా పోటీల్లో 112 మంది పాల్గొన్నారు. మిస్‌ ఇండియా వరల్డ్‌- 2022 సిని శెట్టి (Sini Shetty) భారత్‌ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పలు రౌండ్లలో సత్తా చాటిన ఆమె కిరీటం దక్కించుకోవాలని ఆకాంక్షిద్దాం.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని