Pushpa: ఇదేం రూమర్రా అయ్యా!

‘తగ్గేదే లే’ అంటూ మాస్‌ లుక్‌తో పుష్పరాజ్‌గా ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘పుష్ప’. ప్రముఖ దర్శకుడు సుకుమార్‌...

Published : 06 May 2021 13:48 IST

హైదరాబాద్‌: ‘తగ్గేదే లే’ అంటూ మాస్‌ లుక్‌తో పుష్పరాజ్‌గా ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘పుష్ప’. ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కాగా, తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. అదేమిటంటే.. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారట. ఎర్రచందనం స్మగ్లింగ్‌ అనేది చాలా పెద్ద అంశం కావడంతో ఈ కథను మొదట సిరీస్‌ల రూపంలో ప్రేక్షకులకు అందించాలని సుకుమార్‌ భావించారని.. అనంతరం అదే కథను బన్నీతో సినిమాగా మలుస్తున్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో తాజాగా ‘పుష్ప’ రిలీజ్‌ గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించాల్సిన అవసరం ఉందని సుకుమార్‌ భావించారట. అదే విషయాన్ని బన్నీతో చెప్పగా ఆయన కూడా ఓకే అన్నారట. దీంతో దేశంలో పరిస్థితులు కుదుటపడి, అన్ని అనుకున్నట్టే జరిగితే ఈ ఏడాదిలో ‘పుష్ప’ మొదటి భాగాన్ని విడుదల చేస్తారట. అలాగే వచ్చే ఏడాదిలో రెండో భాగాన్ని విడుదల చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ వార్తలు చూసిన నెటిజన్లు.. ‘ఇదేంటబ్బా కొత్తగా’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ప్రముఖ దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు. సుకుమార్‌-బన్నీ-దేవిశ్రీ ప్రసాద్‌ కాంబోలో రానున్న మూడో చిత్రమిది. రష్మిక కథానాయిక. మలయాళీ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ ఇందులో ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన ‘పుష్పరాజ్‌’ ఇంట్రో వీడియో అందర్నీ ఆకర్షించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని