Year Ender 2021: ఈ ఏడాది అదరగొట్టిన ‘భూమ్‌ బద్దలు.. ఊ..ఊ’లు ఇవే!

ఈ ఏడాది ప్రేక్షకులను అలరించిన ఐటమ్‌ సాంగ్స్‌ ఏంటో తెలుసా?

Updated : 08 Dec 2022 14:09 IST

Telugu Movie item songs: టికెట్‌ కొనుక్కొని తెర ముందు కూర్చొన్న ప్రేక్షకుడికి ప్రేమ, శృంగారం, హాస్యం ఇలా నవరసాలతో విందు భోజనం వడ్డిస్తే అంతకు మించింది ఏముంటుంది. అయితే, ఆ విందు భోజనంతో పాటు, కిళ్లీలాంటి ఐటమ్‌ సాంగ్‌ పడితే వచ్చే మజానే వేరు. అలాంటి అదిరిపోయే కిళ్లీలెన్నో ఈ ఏడాది ప్రేక్షకుడిని ఓ ఊపు ఊపాయి.. అవేంటో ఓ లుక్కేసేద్దామా!

జరదా పాన్‌.. భూమ్‌ బద్దలు..

రవితేజ కథానాయకుడిగా గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో వచ్చిన మాస్‌, యాక్షన్‌ మూవీ ‘క్రాక్‌’. ఇందులో అప్సరాఖాన్‌ నర్తించిన ‘భూమ్‌ బద్దలు’ సాంగ్‌ యువతను విశేషంగా అలరించింది. తమన్‌ అందించిన స్వరాలకు రామజోగయ్యశాస్త్రి సాహిత్యం సమకూర్చారు. మంగ్లీ, సింహా, శ్రీకృష్ణ ఆలపించారు.


మీఠా పాన్‌.. డించక్‌ డించక్‌ డింకా..

రామ్‌ ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ‘రెడ్‌’. కిషోర్‌ తిరుమల దర్శకుడు. ఇందులో ‘డించక్‌ డించక్‌’ పాట మెప్పించింది. హెబ్బా పటల్‌ తనదైన డ్యాన్స్‌తో అదరగొట్టింది. మణిశర్మ సంగీతం అందించగా, కాసర్ల శ్యామ్‌ సాహిత్యం ఇచ్చారు. సాకేత్‌, కీర్తన శర్మ ఆలపించారు.


నవరత్న పాన్‌.. రంభ ఊర్వశి మేనక..

సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో బెల్లకొండ సాయి శ్రీనివాస్‌ నటించిన చిత్రం ‘అల్లుడు అదుర్స్‌’. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలందించిన ఈ సినిమాలోని ‘రంభ ఊర్వశి మేనక’ పాటు యువతను కట్టిపడేసింది. శ్రీమణి సాహిత్యం అందించగా, మంగ్లీ, హేమచంద్ర ఆలపించారు.


గులాబ్‌ పాన్‌.. పైన పటారం..

‘చావు కబురు చల్లగా’ అంటూ ప్రేక్షకులను పలకరించారు కార్తికేయ. కౌశిక్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో అనసూయ గులాబ్‌ పాన్‌లాంటి ‘పైన పటారం’ పాటతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గీత రచయిత ‘సా న రె’ సాహిత్య అందించిన పాటకు జేక్స్‌ బిజోయ్‌ స్వరాలు సమకూర్చారు. మంగ్లీ, రామ్‌, సాకేత్‌ పాట పాడి అలరించారు.


పక్కా లోకల్‌ కిళ్లీ.. మందులోడా..

సుధీర్‌బాబు కథానాయకుడిగా కరుణ కుమార్‌ దర్శకత్వం వచ్చిన చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్‌’. విభిన్న కథా చిత్రంగా పేరు తెచ్చుకున్న ఈ సినిమాలో ‘మందులోడా’ పాట ఆకట్టుకుంది. మణిశర్మ స్వరాలకు కాసర్ల శ్యామ్‌ సాహిత్యం ఇచ్చారు. సాహితీ, ధనుంజయ ఆలపించారు.


లఖ్‌నవూ పాన్‌.. పెప్సీ ఆంటీ..

‘కబడ్డీ కబడ్డీ’ అంటూ వెండితెరపై ఆటాడుకున్న గోపీచంద్‌. సంపత్‌ నంది దర్శకత్వంలో ఆయన నటించిన స్పోర్ట్స్‌ డ్రామా ‘సిటీమార్‌’. ఇందులో ‘పెప్సీ ఆంటీ’ అంటూ సాగే పాటకు తనదైన డ్యాన్స్‌తో అప్సరారాణి అదరగొట్టింది. మణిశర్మ సంగీతం అందించగా, విపంచి ఈ పాట రాశారు. కీర్తన శర్మ ఆలపించారు.


అన్ని పాన్‌ల రుచుల్ని అందించిన ‘ఊ అంటావా మావ’

సుకుమార్‌-దేవిశ్రీ ప్రసాద్‌-అల్లు అర్జున్‌ ఈ కాంబినేషన్‌లో సినిమా అంటే ఐటమ్‌ సాంగ్ అదిరిపోతుంది. అందుకు తగినట్లుగానే ఈ ఏడాది అందరితోనూ ‘ఊ అంటావా మావ’ అనిపిస్తున్నారు. చంద్రబోస్‌ సాహిత్యం అందించిన ఈ పాటను ఇంద్రావతి చౌహన్‌ ఆలపించిన తీరు ప్రేక్షకుల్ని మెస్మరైజ్‌ చేస్తోంది.





Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని