కేసీఆర్‌ పాలన..బీసీలకు స్వర్ణయుగం: తలసాని

బీసీల గురించి కాంగ్రెస్‌ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించడమేనని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఎద్దేవా చేశారు.

Published : 06 Nov 2020 00:42 IST

హైదరాబాద్‌: బీసీల గురించి కాంగ్రెస్‌ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించడమేనని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఎద్దేవా చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీసీలకు యాభైశాతం సీట్లంటూ కాంగ్రెస్‌ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. రిజర్వేషన్లపై కోర్టుకు వెళతామనడం.. ఎన్నికల నుంచి కాంగ్రెస్‌ పారిపోయిందనేందుకు నిదర్శనమని చెప్పారు. హైదరాబాద్‌ నిర్వహించిన మీడియా సమావేశంలో తలసాని మాట్లాడారు. కేసీఆర్ పాలన బీసీలకు స్వర్ణయుగమని.. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీసీలను నిలబెట్టిన ఘనత తెరాసదేనన్నారు. కుల వృత్తులను పరిరక్షిస్తూ బీసీల ఆత్మగౌరవాన్ని పెంచింది కేసీఆరేనని చెప్పారు.  కాంగ్రెస్‌కు ఎన్నికలప్పుడే బీసీలు గుర్తుకొస్తారని తలసాని ఆక్షేపించారు. 

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఆ పార్టీ ఎంపీ అర్వింద్ మాట్లాడేతీరు మార్చుకోవాలని.. సీఎంను ఏకవచనంతో సంబోధించడం మంచిది కాదని ఆయన హితవు పలికారు. భాజపా నేతలు మాటతీరు మార్చుకోకపోతే తాము కూడా ప్రధాని మోదీకి అదే తరహాలో జవాబిస్తామన్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రొటోకాల్ కోసం హైదరాబాద్ వస్తున్నారు తప్ప.. నిధులు తేలేదని విమర్శించారు. నగరానికి కేంద్ర బృందం వచ్చినా వరద సాయం మాత్రం రాలేదన్నారు. త్వరలోనే గొర్రెల పంపిణీ చేపడతామని మంత్రి చెప్పారు. దుబ్బాకలో తెరాస మంచి మెజారిటీతోనే గెలుస్తుందని.. ఒక్క ఓటుతో గెలిచినా గెలిచినట్లేనని తలసాని వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని