‘గాంధీ’లే కాంగ్రెస్‌ అధ్యక్షులు కావాలి!

ఓ వైపు కాంగ్రెస్‌ పార్టీని ప్రక్షాళన చేయాలని కోరుతూ పార్టీ సీనియర్‌ నాయకులు కొందరు అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాసిన అంశంపై తీవ్ర చర్చ జరుగుతుండగా.. మరోవైపు గాంధీ కుటుంబం నుంచే ఎవరైనా అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలనే వాదనలు కూడా మిన్నంటుతున్నాయి. సీడబ్ల్యూసీ సమావేశం జరుగుతుండగానే ఏఐసీసీ కేంద్ర కార్యాలయం ఎదుట పెద్ద సంఖ్యలో..

Published : 24 Aug 2020 23:17 IST

ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఎదుట కార్యకర్తల ధర్నా

దిల్లీ: ఓ వైపు కాంగ్రెస్‌ పార్టీని ప్రక్షాళన చేయాలని కోరుతూ పార్టీ సీనియర్‌ నాయకులు కొందరు అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాసిన అంశంపై తీవ్ర చర్చ జరుగుతుండగా.. మరోవైపు గాంధీ కుటుంబం నుంచే ఎవరైనా అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలనే వాదనలు కూడా మిన్నంటుతున్నాయి. సీడబ్ల్యూసీ సమావేశం జరుగుతుండగానే ఏఐసీసీ కేంద్ర కార్యాలయం ఎదుట పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు గుమిగూడారు. గాంధీ కుటుంబం నుంచే అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని ప్లకార్డులు ప్రదర్శించారు. రాహుల్‌ గాంధీకి అనుకూలంగా నినాదాలు  చేశారు. ‘‘మాకు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు గాంధీ కుటుంబం నుంచే కావాలి. లేదంటే పార్టీ నాశనమవుతుంది. ఇతర వ్యక్తులకు ఆ బాధ్యతలు అప్పగిస్తే పరిస్థితి చిన్నాభిన్నమవుతుంది’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉన్న సోనియాగాంధీ ఆ బాధ్యతల నుంచి తనను తప్పించి, వేరే వాళ్లకు  అవకాశం ఇవ్వాలని సీడబ్ల్యూసీ సమావేశంలో వెల్లడించిన విషయం తెలిసిందే. మరోవైపు పార్టీని ప్రక్షాళన చేయాలంటూ పార్టీ సీనియర్‌ నేతలు రాసిన లేఖపై రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. భాజపాతో కుమ్మక్కై ఈ లేఖ రాశారా? అని విమర్శించారు. రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలపై తీవ్ర దుమారమే రేగింది. తాము భాజపాతో కుమ్మక్కైనట్లు రుజువు చేస్తే పార్టీకి తక్షణమే రాజీనామా చేస్తానని కాంగ్రెస్‌ నీనియర్‌ నేత గులామ్ నబీ ఆజాద్‌ ఆవేదన వ్యక్తం చేశారు. గత 30 ఏళ్లలో భాజపాకు అనుకూలంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదని మరో సీనియర్‌ నేత కపిల్‌ సిబల్‌ వివరణ ఇచ్చారు. అయితే రాహుల్‌ అలాంటి వ్యాఖ్యలేవీ చేయలేదని పార్టీ అధికార ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా ట్విటర్‌లో తెలిపారు. అంతర్గత విభేదాలకు తావివ్వకుండా ప్రధాని నరేంద్ర మోదీ పాలనపై పోరాడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని