తెలంగాణలోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం

రానున్న శాసనసభ ఎన్నికల్లో తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో తాము పోటీ చేస్తామని రిపబ్లిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా(ఆర్పీఐ) జాతీయ అధ్యక్షుడు, అంబేడ్కర్‌ మనవడు ప్రకాశ్‌ అంబేడ్కర్‌ ప్రకటించారు.

Updated : 07 Jun 2023 05:58 IST

ఆర్పీఐ అధ్యక్షుడు ప్రకాశ్‌ అంబేడ్కర్‌

శాంతినగర్‌, న్యూస్‌టుడే: రానున్న శాసనసభ ఎన్నికల్లో తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో తాము పోటీ చేస్తామని రిపబ్లిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా(ఆర్పీఐ) జాతీయ అధ్యక్షుడు, అంబేడ్కర్‌ మనవడు ప్రకాశ్‌ అంబేడ్కర్‌ ప్రకటించారు. కేంద్రంలోని భాజపాను ఓడించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. ఆదిలాబాద్‌లోని రాంలీలా మైదానంలో మంగళవారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ... ‘‘ప్రజలను విడదీసేలా కుట్రలు చేస్తున్న భాజపాను వచ్చే ఎన్నికల్లో ఓడించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ఈ పోరాటంలో ఆర్పీఐ అగ్రభాగాన నిలుస్తుంది. ప్రజలే దేశానికి యజమానులు.... ప్రధానమంత్రి కాదు. కానీ.. మోదీ హయాంలో దానికి భిన్నంగా నడుస్తోంది. ఈడీ సోదాలతో ప్రతిపక్షాలను భయపెట్టడమే లక్ష్యంగా పాలన సాగుతోంది. మరోవైపు అధికారంలోకి వస్తున్న రాజకీయ శక్తులు బహుజనుల హక్కులను కాలరాస్తున్నాయి. ఈ హక్కులను మనం పొందాలంటే రాజ్యాధికారం ఒక్కటే మార్గం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఏకమైతే రాజ్యాధికారం సాధించడం కష్టమేమీ కాదు’’ అని స్పష్టంచేశారు. సమావేశానికి ఆర్పీఐ జిల్లా అధ్యక్షుడు సందీప్‌ దాండిగే అధ్యక్షత వహించారు. అంతకుముందు ప్రకాశ్‌ అంబేడ్కర్‌కు గుస్సాడీ నృత్యాలతో స్వాగతం పలికారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని