నమ్మి ఓటేస్తే.. మా కొంపలు ముంచుతున్నారు: వైకాపా ఎమ్మెల్యేను నిలదీసిన దళిత మహిళ

‘మీరు మా కొంపలు ముంచుతున్నారు....మాట్లాడితే పోలీసు కేసులండి బాబూ... ప్రశ్నిస్తే ఎమ్మెల్యే ఉన్నాడంటూ బెదిరింపులు.. ఎన్నికల సమయంలో మీ కోసం పోరాడామండి..

Updated : 27 Sep 2022 07:58 IST

అంబాజీపేట, న్యూస్‌టుడే: ‘మీరు మా కొంపలు ముంచుతున్నారు....మాట్లాడితే పోలీసు కేసులండి బాబూ... ప్రశ్నిస్తే ఎమ్మెల్యే ఉన్నాడంటూ బెదిరింపులు.. ఎన్నికల సమయంలో మీ కోసం పోరాడామండి.. నాడు జగన్‌కే ఓటేశాను.. ఇప్పుడు సొంత పార్టీ వాళ్లే మమ్మల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు’ అంటూ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఎదుట దళిత మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. అంబాజీపేట మండలం కె.పెదపూడిలో సోమవారం ఎమ్మెల్యే నిర్వహించిన ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ఎవరంటూ ఎమ్మెల్యే చిట్టిబాబు ఆ మహిళను ప్రశ్నించగా... ‘వైకాపా గ్రామ కమిటీ సభ్యులే మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు.. ఎన్నో కేసులు పెడుతున్నారు.. మాట్లాడితే ఎస్సై వచ్చేస్తున్నారు.. మా అబ్బాయి ఏమీ చేయకపోయినా అత్యాచారం కేసు పెట్టారు. మీ వెనకాల ఉన్నవారే అక్రమ కేసులు పెట్టించారు. నా భర్త చనిపోయాడు.. నా అల్లుడు చనిపోయాడు.. చాలా ఇబ్బందుల్లో ఉన్నా.. దేవుడు ఉన్నాడండి అన్నీ చూస్తున్నాడు’ అంటూ ఆ మహిళ ఎమ్మెల్యే ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. సమస్యను మీ దృష్టికి తీసుకొచ్చినా ఎందుకు పట్టించుకోలేదని ఆమె నిలదీశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు