Himachal Pradesh Election Results: హిమాచల్‌లో హస్తవాసి

భాజపా పాలనలో ఉన్న హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ జయకేతనం ఎగురవేసింది. 68 స్థానాలకుగానూ 40 చోట్ల ఆ పార్టీ గెలిచింది.

Updated : 09 Dec 2022 07:27 IST

భాజపా పాలనలో ఉన్న హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ జయకేతనం ఎగురవేసింది. 68 స్థానాలకుగానూ 40 చోట్ల ఆ పార్టీ గెలిచింది. భాజపా 25 స్థానాలకు పరిమితమైంది. మూడు చోట్ల స్వతంత్రులు నెగ్గారు. దేశంలో తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల సంఖ్య బాగా తగ్గిపోయిన పరిస్థితుల్లో హస్తం పార్టీకి ఇక్కడి గెలుపు.. కాస్త బలాన్నిచ్చినట్లయింది. ఒకసారి అధికారంలో ఉన్న పార్టీని తదుపరి ఎన్నికల్లో ఇంటికి సాగనంపే ఆనవాయితీ 1985 నుంచి హిమాచల్‌లో కొనసాగుతూ వస్తోంది. ఆ కోవలో ఇప్పుడు ఓటర్లు తమకు అవకాశాన్ని కట్టబెట్టడంతో కాంగ్రెస్‌ శ్రేణులు ఆనందంతో ఉన్నాయి. ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ముందుజాగ్రత్త చర్యల్ని కాంగ్రెస్‌ చేపట్టింది. హిమాచల్‌ప్రదేశ్‌ ఇన్‌ఛార్జ్‌ రాజీవ్‌ శుక్లా, ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌, సీనియర్‌ నేత భూపీందర్‌ సింగ్‌ హుడాను శిమ్లాకు పంపించింది. హిమాచల్‌ పరిస్థితులను ఐఏసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పర్యవేక్షిస్తున్నారు.

జైరాం ఠాకుర్‌.. ఆరోసారి విజయం

మండీ జిల్లాలోని సిరాజ్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన హిమాచల్‌ప్రదేశ్‌ సీఎం జైరాం ఠాకుర్‌ వరుసగా ఆరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెస్‌ అభ్యర్థిపై 38,183 ఓట్ల ఆధిక్యంతో ఆయన విజయం సాధించారు. ఈసారి ఎన్నికల్లో ఎనిమిది మంది మంత్రులు ఓటమి చవిచూశారు. పలు స్థానాల్లో పోరు హోరాహోరీగా సాగింది. భొరాంజ్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి సురేశ్‌కుమార్‌ కేవలం 60 ఓట్ల తేడాతో నెగ్గారు. అతి తక్కువ మెజార్టీ అదే. ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) 67 చోట్ల తమ అభ్యర్థుల్ని నిలబెట్టినా ఒక్కచోట కూడా గెలవలేకపోయింది. మొత్తం ఓట్లలో 1.10 శాతాన్నే ఆ పార్టీ పొందగలిగింది.

శిబిరానికి తరలించే యోచన విరమణ

హిమాచల్‌ప్రదేశ్‌లో సీఎం అభ్యర్థిని నిర్ణయించే పనిలో కాంగ్రెస్‌ హైకమాండ్‌ నిమగ్నమైంది. ఎమ్మెల్యేలు భాజపా వలలో పడకుండా చండీగఢ్‌కు తరలించాలని ఒకదశలో సిద్ధమైనా స్పష్టమైన ఆధిక్యం లభించడంతో విరమించుకుంది. శాసనసభాపక్ష నేత ఎన్నిక అధికారాన్ని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి అప్పగిస్తూ శుక్రవారం వారంతా శిమ్లాలోనే ఏకవాక్య తీర్మానం చేస్తారు. ముఖ్యమంత్రి పదవిని అనేకమంది నేతలు ఆశిస్తున్నారు. పీసీసీ అధ్యక్షురాలు ప్రతిభా సింగ్‌ (దివంగత మాజీ సీఎం వీరభద్రసింగ్‌ భార్య, మండీ ఎంపీ), కాంగ్రెస్‌ ప్రచార కమిటీ అధిపతి సుఖ్వీందర్‌ సింగ్‌ సుఖు, మాజీ విపక్షనేత ముఖేశ్‌ అగ్నిహోత్రి, ఠాకుర్‌ కౌల్‌సింగ్‌, ఆశాకుమారి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వీరిలో ఆశాకుమారి, కౌల్‌సింగ్‌  ఓటమి చవిచూశారు. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారంతా మాట్లాడుకుని సీఎం అభ్యర్థిపై అధిష్ఠానానికి నివేదిస్తారని ప్రతిభాసింగ్‌ చెప్పారు.

ఓటమిని అంగీకరిస్తూ భాజపా ముఖ్యమంత్రి జైరాం ఠాకుర్‌ తన రాజీనామా లేఖను గవర్నర్‌ రాజేంద్రవిశ్వనాథ్‌ ఆర్లేకర్‌కు సమర్పించారు. దానిని గవర్నర్‌ ఆమోదించారు. 11-12 స్థానాల్లో వెయ్యి కంటే తక్కువ ఓట్ల తేడాతో తమ అభ్యర్థులు ఓడిపోయారని, రెండు పార్టీల మధ్య ఓట్ల తేడా ఒక్క శాతం కంటే తక్కువేనని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని