TDP-Janasena: తెదేపా- జనసేన కలిసి ‘భవిష్యత్తుకు గ్యారంటీ’ కార్యక్రమాలు: అచ్చెన్నాయుడు

ఆంధ్రప్రదేశ్‌లో నియోజకవర్గాల వారీగా ప్రణాళికల తయారీకి నిర్ణయం తీసుకున్నామని తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు.

Updated : 09 Nov 2023 15:51 IST

విజయవాడ: రాష్ట్రంలో నియోజకవర్గాల వారీగా ప్రణాళికల తయారీకి నిర్ణయం తీసుకున్నామని తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. ఉమ్మడిగా పూర్తిస్థాయి మేనిఫెస్టో రూపకల్పనే ప్రధాన ఎజెండాగా విజయవాడలో తెదేపా-జనసేన సమన్వయ కమిటీ రెండోసారి సమావేశమైంది. మేనిఫెస్టో ప్రకటన లోపు ఉమ్మడి కార్యాచరణ దిశగా ప్రజల్లోకి ఐక్యంగా వెళ్లేందుకు ఓ కరపత్రం రూపొందించే అంశంపైనా సమావేశంలో నేతలు చర్చించారు. సమావేశం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో అచ్చెన్నాయుడు మాట్లాడారు.

‘‘రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో మూడు రోజుల చొప్పున తెదేపా - జనసేన ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తాం. నియోజకవర్గాల వారీగా ప్రణాళికల తయారీకి నిర్ణయం తీసుకున్నాం. ఏ నియోజకవర్గంలో ఎప్పుడనేది ఒకట్రెండు రోజుల్లో వెల్లడిస్తాం. ఇప్పటికే భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో ఇంటింటికీ వెళ్తున్నాం. పవన్‌ కల్యాణ్‌, నాదెండ్ల మనోహర్‌ ఇచ్చిన ఐదారు పాయింట్లను కూడా పరిగణనలోకి తీసుకుంటాం. వాటిని ‘భవిష్యత్తుకు గ్యారంటీ’లో కలుపుతాం. రెండు పార్టీలు కలిసి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని చేయాలనుకున్నాం. పార్టీకి ముగ్గురు చొప్పున మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు చేస్తాం. తెదేపా నుంచి యనమల నాయకత్వంలో ముగ్గురు సభ్యులు ఉంటారు. త్వరలోనే నాదెండ్ల మనోహర్‌ కూడా ముగ్గురి పేర్లను ప్రకటిస్తారు. నవంబరు 13న మొదటి సమావేశం ఏర్పాటు చేసి చర్చించుకుంటాం. 17 నుంచి తెదేపా-జనసేన కలిసి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాల్లో పాల్గొంటాయి’’ అని అచ్చెన్నాయుడు వివరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని