HariHara Veeramallu: ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో ఎవరంటే

‘హరిహర వీరమల్లు’ మిగిలిన షూటింగ్‌ను క్రిష్ స్థానంలో మరొకరు వర్క్‌ చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు.

Published : 02 May 2024 11:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పవన్‌ కల్యాణ్‌ హీరోగా తెరకెక్కుతోన్న పీరియాడికల్‌ యాక్షన్‌ చిత్రం ‘హరిహర వీరమల్లు’. తాజాగా విడుదలైన దీని టీజర్‌ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులందరిలో జోష్‌ నింపింది. పేదల పక్షాన పోరాడే యోధుడిగా పవన్‌ కల్యాణ్‌ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. అయితే, ఈ టీజర్‌ విడుదల సందర్భంగా నిర్మాతలు ఓ కీలక ప్రకటన చేశారు. ఈ చిత్రం మిగిలిన షూటింగ్‌ను పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ను దర్శకుడు జ్యోతి కృష్ణ పూర్తిచేయనున్నట్లు తెలిపారు. ఇటీవల విడుదలైన కొన్ని పోస్టర్లపై క్రిష్‌ జాగర్లమూడి పేరు లేకపోవడంతో కొందరు నెటిజన్లు చిత్రబృందాన్ని ట్యాగ్‌ చేస్తూ పోస్ట్‌లు పెట్టారు. ఈ సినిమా నుంచి క్రిష్‌ వైదొలిగారా అనే కామెంట్స్‌ మొదలయ్యాయి. తాజాగా వారందరికీ నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు.

‘‘నీ మనసు నాకు తెలుసు’, ‘ఆక్సిజన్‌’ వంటి చిత్రాలకు రచయితగా, దర్శకుడిగా చేసిన జ్యోతి కృష్ణ ‘హరిహర వీరమల్లు’ మిగతా షూటింగ్‌ను పూర్తి చేయనున్నారు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను కూడా క్రిష్ జాగర్లమూడి పర్యవేక్షణలో నిర్వహించనున్నారు. సినిమా పూర్తి చేయడంలో ఊహించని ఆలస్యం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని తెలిపారు. 17వ శతాబ్దం నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తీసుకురానున్నారు. మొదటి పార్ట్‌ను ‘‘స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’’ పేరుతో విడుదల చేయనున్నారు. ‘ధర్మం కోసం యుద్ధం’ అనేది ఉపశీర్షిక. ఈ ఏడాది చివర్లో ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. నిధి అగర్వాల్‌ కథానాయిక. బాబీ దేవోల్‌, సునీల్, నోరా ఫతేహి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని