రైతు సంక్షేమాన్ని విస్మరించి.. బంద్‌కు పిలుపా?

తెలంగాణలో రైతుల సంక్షేమాన్ని విస్మరించిన తెరాస ప్రభుత్వం.. రైతు సంఘాల బంద్‌ను ప్రభుత్వ బంద్‌గా పిలుపునివ్వడం దురదృష్టకరమని

Published : 08 Dec 2020 01:59 IST

దిల్లీ: తెలంగాణలో రైతుల సంక్షేమాన్ని విస్మరించిన తెరాస ప్రభుత్వం.. రైతు సంఘాల బంద్‌ను ప్రభుత్వ బంద్‌గా పిలుపునివ్వడం దురదృష్టకరమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. తెరాస తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ బంద్‌లో పాల్గొంటోందన్నారు. ఈ సర్కారీ బంద్‌ను ప్రతిఘటించాలని తెలంగాణ ప్రజలను కోరారు. రేపు రైతు సంఘాల బంద్‌ నేపథ్యంలో ఆ పార్టీ నేతలతో కలిసి దిల్లీలో మీడియాతో మాట్లాడారు. అనేక రైతు నాయకుల డిమాండ్‌ మేరకే వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చామని వివరించారు. ఇప్పుడు వాటిని రాజకీయ పార్టీలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. రైతుల ఆదాయం పెంచే చర్యలను నీరుగార్చేందుకు చూస్తున్నాయని ఆరోపించారు. మోదీ తీసుకొచ్చిన చట్టాలతో రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. ఎరువుల కొరత లేకుండా చేశామని, ఎప్పుడూలేని రీతిలో మద్దతు ధర అందిస్తున్నామని చెప్పారు. 

రైతుల కోసం కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పంటల బీమా పథకాన్ని కేసీఆర్‌ అమలు చేయడం లేదని దుయ్యబట్టారు. సన్నబియ్యం సాగు చేయాలంటూ రైతులను బెదిరించిన సీఎం కేసీఆర్‌.. పంట చేతికొచ్చాక కొనుగోలు విషయంలో చేతులెత్తేశారని కిషన్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వమే సన్నబియ్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. అన్నీ కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. తెరాస తన స్వార్థ రాజకీయాల కోసం ఈ వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తోందని కిషన్‌ రెడ్డి అన్నారు. ఈ రాజకీయ ఉచ్చులో రైతులు పడొద్దని సూచించారు. రైతులకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

రాష్ట్రాలకు కేంద్రం సూచనలు
భారత్ బంద్ నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్రం కొన్ని సూచనలు చేసింది. శాంతిభద్రతల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కొవిడ్‌ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని కేంద్రం హోంశాఖ స్పష్టంచేసింది.

ఇవీ చదవండి..
ఆ నాలుగు గంటలే బంద్‌‌: రైతు సంఘాలు
పోలీసుల అదుపులో అఖిలేశ్‌ యాదవ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని