
AP News: ఇసుక అందుబాటులో లేకే కార్మికులు రోడ్డున పడ్డారు: నాదెండ్ల మనోహర్
విజయవాడ: ఏపీలో భవన నిర్మాణ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. విజయవాడలోని బెంజ్ సర్కిల్లో అడ్డా వద్ద కార్మికుల సమస్యలపై ఆయన ఆరా తీశారు. రోజు 400 మంది పనుల కోసం అడ్డా దగ్గరికి వస్తుంటే 40 మందికి మించి కూలి దొరకడం లేదని కార్మికులు ఆయన దగ్గర వాపోయారు. పనుల కోసం ఎదురు చూసి చివరకు ఇంటికి పోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక అందుబాటులో లేకే భవన నిర్మాణ కూలీలు రోడ్డున పడ్డారని నాదెండ్ల మండిపడ్డారు.
‘‘ రెక్కల కష్టం మీద ఆధారపడి బతికే భవన నిర్మాణ కార్మికులకు రెండేళ్ల నుంచి ఉపాధి దొరకడం లేదు. ప్రభుత్వం ఇసుక కొరత సృష్టించినప్పటి నుంచి ఇలా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. వారి బాధలు తీర్చే కనీస ఆలోచన కూడా ప్రభుత్వం చేయడం లేదు. భవన నిర్మాణ కార్మికుల హెల్త్ క్లైమ్స్కు సంబంధించి ఇప్పటికీ లక్షా పాతిక వేల అప్లికేషన్లు పెండింగ్లో పెట్టారు’’ అని మనోహర్ విమర్శించారు.