TS News: పీయూష్ గోయల్ తక్షణమే క్షమాపణ చెప్పాలి: హరీశ్రావు
దిల్లీ వెళ్లిన రాష్ట్ర మంత్రులను ఉద్దేశించి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని మంత్రి హరీశ్రావు ...
హైదరాబాద్: దిల్లీ వెళ్లిన రాష్ట్ర మంత్రులను ఉద్దేశించి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని మంత్రి హరీశ్రావు అన్నారు. ఆయన కేంద్రమంత్రిగా కాకుండా రాజకీయ నేతలా మాట్లాడారని ఆక్షేపించారు. 70లక్షల మంది రైతుల తరఫున రాష్ట్ర మంత్రులు దిల్లీ వెళ్లారని హరీశ్ చెప్పారు. నిన్న దిల్లీలో పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ హరీశ్రావు మీడియాతో మాట్లాడారు.
‘‘పీయూష్ గోయల్ మంత్రులను ‘మీకేం పని లేదా’ అని చేసిన వ్యాఖ్యలు చాలా చాలా అభ్యంతరకరం. ఇది యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని అవమానపరచడమే. 70లక్షల రైతు కుటుంబాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం. పీయూష్ గోయల్ తక్షణమే ఆయన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని.. బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నా. తెరాస పార్టీ పుట్టుకనే తెలంగాణ కోసం. మా పుట్టుక తెలంగాణ జాతి ప్రయోజనాల కోసం. అనేక త్యాగాల పునాదుల మీద తెలంగాణను సాధించాం. మాకు మా రాష్ట్రం.. 70లక్షల మంది రైతు ప్రయోజనాల కంటే ఏదీ ముఖ్యం కాదు.
భాజపా నేతలను కలిసేందుకు సమయముందా?
రైతుల ప్రయోజనాల కోసమే దిల్లీకి వచ్చాం. రాష్ట్ర ప్రభుత్వ బృందాన్ని అవమానించే హక్కు పీయూష్ గోయల్కి ఎక్కడిది? మూడు రోజుల పాటు మంత్రులు కలిసేందుకు ప్రయత్నిస్తే సమయం లేదన్నారు. స్థానిక భాజపా నేతలను కలిసేందుకు సమయం ఉందా? మా ప్రాధాన్యత రైతులు, మీ ప్రాధాన్యత రాజకీయం. ఇంత అవహేళనగా మాట్లాడటం సరికాదు. రాష్ట్ర భాజపా నాయకులు దీనిపై ఏమంటారు? భాజపాకు రైతుల ఓట్లు కావాలి కాని వడ్లు అక్కర్లేదు. భాజపా కుటిల నీతికి ఇదే నిదర్శనం.
అనవసరంగా బురదజల్లే ప్రయత్నాలు సహించం
పంజాబ్ మాదిరిగా తెలంగాణాలోనూ పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతున్నాం. యాసంగిలో ధాన్యంలో కొంటారా లేదా?రైతు బంధు కింద రూ.14,500కోట్లు సహాయం చేశాం. రైతులు ఉచిత విద్యుత్ కూడా అందిస్తున్నాం. రాష్ట్ర పరిధిలో ఉన్న అంశాల్లో రైతులకు మేలు చేస్తున్నాం. ధాన్యం కొనుగోలు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమే. గతంలో కరవు వస్తే మెడ మీద కత్తి పెట్టి ధాన్యం సేకరించలేదా? కేంద్రానికి చేతకాకపోతే ధాన్యం ఎగుమతి, దిగుమతి అంశాన్ని రాష్ట్రాలకు ఇవ్వండి. అనవసరంగా బురదజల్లే ప్రయత్నాలను సహించం.
తెరాస ఓటమిపై మాట్లాడటం ఏంటి?
తెరాస ఓటమిపై మాట్లాడం ఏంటి? ఉప ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా భాజపా ఓడిపోలేదా? తెలంగాణపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. గోదాముల సామర్థ్యంపై లేఖ రాయలేదని పచ్చి అబద్ధాలు చెప్పారు. గోదాముల సామర్థ్యం పెంచాలని పదిసార్లు లేఖలు రాశాం. బియ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం.. గోదాములు ఇవ్వాలని లేఖల్లో పేర్కొన్నాం. పార్లమెంట్ సాక్షిగా కూడా అబద్ధాలు మాట్లాడితే ఏం చేస్తాం. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న పీయూష్ గోయల్కు తగదు’’ అని హరీశ్రావు అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.