Samajwadi Party: ‘లాల్‌ టోపీ’ అంటే.. అదో డేంజర్‌ సిగ్నల్‌ : మోదీ

సమాజ్‌వాదీ పార్టీ నేతలు ధరించే ఎర్ర టోపీలను అధికారుల కార్లపై ఉండే ఎర్రబుగ్గ (Red Beacons)తో పోల్చిన ఆయన.. అధికార దర్పం ప్రదర్శించేందుకే సమాజ్‌వాదీ ఆరాటపడుతున్న విషయాన్ని తెలియజేస్తోందంటూ విమర్శలు గుప్పించారు.

Published : 08 Dec 2021 01:46 IST

సమాజ్‌వాదీ పార్టీపై విరుచుకుపడిన ప్రధానమంత్రి

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇదే సమయంలో యూపీ ఎన్నికలను కీలకంగా భావిస్తోన్న కేంద్రప్రభుత్వం కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తోంది. ఇందులో భాగంగా యూపీలో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమాజ్‌వాదీ పార్టీ నేతలను టార్గెట్‌ చేసుకున్నారు. ఆ పార్టీ నేతలు ధరించే ఎర్ర టోపీలను అధికారుల కార్లపై ఉండే ఎర్రబుగ్గ (Red Beacons)తో పోల్చిన ఆయన.. అధికార దర్పం ప్రదర్శించేందుకే సమాజ్‌వాదీ ఆరాటపడుతున్న విషయాన్ని తెలియజేస్తోందంటూ విమర్శలు గుప్పించారు. అందుకే ఆ ఎర్ర టోపీని రెడ్‌ అలెర్ట్‌గా భావించాలని యూపీ ప్రజలకు ప్రధాని మోదీ సూచించారు.

‘రాష్ట్రంలో ఎర్రటోపీ ధరించి తిరిగే వారు ఎర్రబుగ్గ గురించే ఎక్కువ ఆందోళన చెందుతున్నారు. మీ సమస్యలు, బాధలు వారికి పట్టవు’ అంటూ వీఐపీ కార్లపై ఉండే ఎర్రబుగ్గతో సమాజ్‌వాదీ పార్టీ నేతల టోపీలను పోల్చారు. కుంభకోణాలు, అక్రమంగా వనరులను దోచుకోవడం, మాఫియా ఖజానా నింపేందుకే ఆ ఎర్రటోపీ వారు అధికారం కోసం ఆరాటపడుతున్నారని విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా ఉగ్రవాదులకు సహకారం అందించడంతో పాటు వారిని జైలు నుంచి విడిపించేందుకే ఎర్రటోపీ వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నట్లు ఆరోపించారు. అందుకే ఎర్ర టోపీ అంటేనే ఉత్తర్‌ప్రదేశ్‌కు ‘రెడ్‌ అలర్ట్‌’గా గుర్తుపెట్టుకోవాలని ప్రధాని మోదీ యూపీ ప్రజలను హెచ్చరించekాi.

ఇక ఉత్తర్‌ప్రదేశ్‌ అభివృద్ధిపై మాట్లాడిన మోదీ.. 2014కు ముందు యూరియాను విదేశాల నుంచి దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ప్రస్తుతం పూర్తిగా బయటపడ్డామని అన్నారు. యూపీలోని గోరఖ్‌పూర్‌లో ఎరువుల కర్మాగారం, ఐసీఎంఆర్‌ పరిశోధనా కేంద్రంతోపాటు ఎయిమ్స్‌ను ప్రారంభించిన ఆయన.. 2014కు ముందు రైతులు లాఠీ దెబ్బలు, తూటాలను ఎదుర్కోవాల్సి వచ్చేదని గుర్తుచేశారు. కానీ, రాష్ట్రంలో, దేశంలో భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చిందన్నారు. అందుకే డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వం ఉంటే అభివృద్ధి వేగం రెట్టింపు అవుతుందనడానికి ఈ అభివృద్ధి కార్యక్రమాలే నిదర్శనమని ప్రధాని మోదీ స్పష్టంచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని