AP News: అంబులెన్స్‌ను అడ్డుకున్న పోలీసులు... లోకేశ్‌, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం

తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది

Updated : 20 Oct 2021 17:27 IST

అమరావతి: తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. గాయపడిన కార్యకర్తలు పార్టీ కార్యాలయానికి అంబులెన్స్‌లో వస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. గాయాలు చూపించేందుకు పార్టీ కార్యాలయానికి వస్తున్న వీరి వాహనాన్ని పోలీసులు రోడ్డుపైనే చాలాసేపు నిలిపివేశారు. పార్టీ నేతలు ఎన్ని సార్లు కోరినా పోలీసులు అంబులెన్స్‌ను వదలకపోవడంతో పార్టీ కార్యాలయంలో ఉన్న జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్‌ ఒక్కసారిగా రోడ్డెక్కడం ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసుల తీరుకు నిరసనగా లోకేశ్‌, తెదేపా నేతలు రోడ్డుపైకి ర్యాలీగా వెళ్లారు. ఈక్రమంలో తెదేపా నేతలు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరగడంతో  పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కార్యాలయం వద్ద రోడ్డుపై తెదేపా నేతలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. తెదేపా నేతలు అంబులెన్స్‌ను పోలీసుల దిగ్బంధం నుంచి విడిపించారు. పార్టీ కార్యాలయానికి వచ్చిన క్షతగాత్రులను పరామర్శించిన లోకేశ్‌  అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

గంజి చిరంజీవిపై కేసు నమోదు
తెదేపా అధికార ప్రతినిధి గంజి చిరంజీవిపై మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. తెదేపా కార్యాలయంపై దాడికి నిరసనగా రాస్తారోకో చేశారని పేర్కొంటూ ఆయనతో పాటు మరికొందరిపై కేసులు నమోదు చేశారు. ఆత్మకూరు వీఆర్‌వో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని