Ball Tampering ఉదంతం వాళ్లకూ తెలుసు

2018లో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ సందర్భంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు కామెరూన్‌ బాన్‌క్రాఫ్ట్‌, స్టీవ్‌స్మిత్‌, డేవిడ్‌ వార్నర్ బాల్‌ టాంపరింగ్‌కు పాల్పడిన సంగతి అందరికీ తెలిసిందే...

Updated : 15 May 2021 16:43 IST

నాటి ప్రధాన సూత్రధారి కామెరూన్‌ బాన్‌క్రాఫ్ట్‌..

ఇంటర్నెట్‌డెస్క్‌: 2018లో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ సందర్భంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు కామెరూన్‌ బాన్‌క్రాఫ్ట్‌, స్టీవ్‌స్మిత్‌, డేవిడ్‌ వార్నర్ బాల్‌ టాంపరింగ్‌కు పాల్పడిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ ఉదంతం క్రికెట్‌ ప్రపంచంలో పెను దుమారం లేపింది. దాంతో బాన్‌క్రాఫ్ట్‌ తొమ్మిది నెలలు ఆటకు దూరమవ్వగా.. స్మిత్‌, వార్నర్‌ ఏడాది పాటు నిషేధానికి గురయ్యారు. కాగా, నాటి వివాదాస్పద సంఘటనపై ప్రధాన సూత్రధారి బాన్‌క్రాఫ్ట్‌ తాజాగా నోరు విప్పాడు. అది జరిగినప్పుడు తమ కెప్టెన్‌ స్టీవ్‌స్మిత్‌, వైస్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌తో పాటు ఇతర బౌలర్లకు కూడా తెలుసని అన్నాడు. ఇటీవల ఓ అంతర్జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడీ విషయాన్ని అంగీకరించాడు. అయితే, ఆ వివాదంలో తానొక్కడే బాధ్యత తీసుకోవాలనుకున్నట్లు చెప్పాడు.

బాన్‌క్రాఫ్ట్‌ బంతికి ఉప్పుకాగితం రాయడం ప్రత్యక్షప్రసారంలో స్పష్టంగా కనిపించింది. దాంతో ఆ వివాదాస్పద సంఘటన క్రికెట్‌ ఆస్ట్రేలియాలో తీవ్ర దుమారం లేపింది. అయితే, ఆ సంఘటన జరగకముందే తన సహచర బౌలర్లకు ఆ విషయం గురించి తెలుసని ఆ అంతర్జాతీయ పత్రిక అడిగిన ప్రశ్నకు బాన్‌క్రాఫ్ట్‌ సమాధానమిచ్చాడు. ‘కచ్చితంగా తెలుసు. ఎందుకంటే నేను చేసిన పని బౌలర్లకు ఉపకరిస్తుంది. దాని గురించి వాళ్లకంతా అవగాహన ఉంది. వివరంగా చెప్పాల్సిన పనిలేదు. బాల్‌ టాంపరింగ్‌ విషయంలో నేను చాలా లోతుల్లోకి వెళ్లాను. నా విలువలను కూడా మర్చిపోయాను. మా జట్టులో అందరిచేతా ప్రశంసలు పొందాలనే ఉద్దేశం నన్ను బలంగా ఎగదోసింది. జట్టులో నేనొక ముఖ్యమైన ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకోవాలనే తాపత్రయం నాలో కలిగింది. ఉప్పుకాగితాన్ని బంతికి పూసి జట్టుకు ఉపయోగంగా మారాలని అనుకున్నా. అది జరిగాక కానీ నేను చేసింది తప్పని తెలుసుకోలేకపోయా. క్రికెటర్‌గా నా ప్రయాణంలో అది కూడా ఒక భాగమని చెప్పొచ్చు. అది నేను నేర్చుకోవాల్సిన కఠినమైన పాఠం. అది తప్పని తెలిస్తే ముందే వేరే నిర్ణయం తీసుకునేవాడిని’ అని బాన్‌క్రాఫ్ట్‌ చెప్పుకొచ్చాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని