Asia Cup 2023: ఆసియా కప్‌.. వినోదమేకాదు.. వివాదాల్లోనూ తగ్గేదేలే!

ఉపఖండంలోని టాప్‌ జట్లు తలపడే ఆసియా కప్‌ (Asia Cup) అభిమానులకు అద్భుతమైన క్రికెట్ మజాను అందించడమే కాకుండా.. పలు సందర్భాలూ వివాదాలూ చోటుచేసుకుని వార్తల్లో నిలిచింది.

Updated : 02 Sep 2023 10:15 IST

ఆడేది ఆరు దేశాలే.. అయితే అభిమానులకు క్రికెట్‌ వినోదం ఫుల్‌. అదేవిధంగా వివాదాలకూ లోటులేని టోర్నీ ఆసియా కప్. భారత్, పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక వంటి పటిష్ఠమైన జట్లు ఉన్న సమయంలో ఆమాత్రం హడావుడి ఉంటుంది. ఇక చిరకాల ప్రత్యర్థులైన భారత్‌, పాక్‌ మధ్య జరిగే మ్యాచ్‌ల్లోనూ వివాదాలు చోటుచేసుకున్నాయి. మరి ఇలాంటి ‘మినీ టోర్నీ’లో చోటు చేసుకున్న ముఖ్యమైన వివాదాస్పద సంఘటనల గురించి తెలుసుకుందాం.. 

గంభీర్ X కమ్రాన్ అక్మల్..

భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌ అంటేనే ప్రేక్షకులతోపాటు మైదానంలో దిగే ఆటగాళ్లలోనూ టెన్షన్‌ వాతావరణం ఉంటుంది. మ్యాచ్‌లు కాస్త రసవత్తరంగా మారే కొద్దీ ఆటగాళ్ల మధ్య వాదోపవాదాలు చోటు చేసుకోవడం సహజంగా జరుగుతుంటుంది. కానీ, అది ఒక్కోసారి రణరంగం తలపించేలా మారితేనే చిక్కులు వచ్చి పడతాయి. ఇలాంటిదే 2010 ఆసియా కప్‌ సందర్భంగా దాయాదుల పోరు సందర్భంగా చోటు చేసుకుంది. పాక్‌ స్పిన్నర్ సయీద్ అజ్మల్ బౌలింగ్‌ను ఆడే క్రమంలో గొడవకు నాంది పడింది. అతడి బౌలింగ్‌లో బంతి బ్యాట్‌ను తాకినట్లు గంభీర్‌ ఔట్ కోసం అప్పీలు చేశారు. అయితే, అంపైర్‌ బిల్లీ బౌడెన్ నాటౌట్‌గా ప్రకటించాడు. పాకిస్థాన్‌ రివ్యూకి వెళ్లింది. ఈ సమయంలోనే గంభీర్‌, వికెట్ కీపర్‌ మధ్య స్వల్ప వాగ్వాదం మొదలైంది. కాసేటికే తీవ్రం కావడంతో ఇరు జట్ల ఆటగాళ్లు వారిని అడ్డుకొన్నారు. గంభీర్‌ను ధోనీ పక్కకు తీసుకెళ్లగా.. కమ్రాన్‌ అక్మల్‌ను పాక్‌ ఆటగాళ్లు సముదాయించారు.

హర్భజన్ X అక్తర్

ఆసియా కప్ 2010 ఎడిషన్‌లోనే దాయాదుల పోరు సందర్భంగా గంభీర్ - కమ్రాన్ అక్మల్‌ వాగ్వాదం మరువకముందే.. ఇదే మ్యాచ్‌లో కాసేటికే హర్భజన్‌ సింగ్‌ - షోయబ్ అక్తర్ మధ్య వివాదం రాజుకుంది. దీనికి కారణం అక్తర్‌ బౌలింగ్‌లో హర్భజన్‌ భారీ సిక్సర్‌ కొట్టడం. ఆ తర్వాత అక్తర్‌ బౌన్సర్ విసిరాడు. దీంతో వారిద్దరి మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. ఇక చివరిగా హర్భజన్‌ సింగ్‌ మహమ్మద్ అమిర్ బౌలింగ్‌లో సిక్స్‌తో భారత్‌ను గెలిపించాడు. దీంతో అక్తర్‌ వైపు కాస్త ఆగ్రహంతో చూశాడు. ఇటీవల ఆ సంఘటనపై అక్తర్ ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు. ‘‘మ్యాచ్‌ ముగిసిన తర్వాత హర్భజన్‌ సింగ్‌ ఉన్న రూమ్‌ను వెతుక్కుంటూ వెళ్లా. అతడితో పోట్లాడదామనే అక్కడి వరకు వెళ్లా. మాతో కలిసి తిన్నాడు. లాహోర్‌లో మాతోనే కలిసి తిరిగాడు. ఇలాంటి వ్యక్తి మనతో తప్పుగా ప్రవర్తిస్తాడా? అని ఆలోచించా. ఇక మరుసటి రోజు నేను శాంతించా. అతడు కూడా క్షమాపణలు చెప్పాడు’’ అని తెలిపాడు. 

గతేడాది అఫ్గాన్‌ X పాక్ ఆటగాళ్ల మధ్య.. 

భారత్ X పాకిస్థాన్‌ జట్ల మధ్య ఎలాంటి పరిస్థితి ఉంటుందో.. పాక్‌ X అఫ్గానిస్థాన్‌ టీమ్‌ల మధ్య కూడా ఉద్విగ్న పరిస్థితులు ఉంటాయి. గతేడాది జరిగిన ఆసియా కప్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ చివరి ఓవర్‌ సందర్భంగా నాటకీయ పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పాక్ యువ బౌలర్ నసీమ్ షా చివరి ఓవర్‌లో రెండు సిక్స్‌లు కొట్టి తన జట్టు గెలిపించాడు. ఈ సందర్భంగా సంబరాలు కాస్త శృతి మించాయి. ఇరు జట్ల ఆటగాళ్లూ కొట్టుకొనే స్థాయికి వెళ్లాయి. అంతకుముందు ఇదే మ్యాచ్‌లో అఫ్గాన్‌ బౌలర్ ఫరీద్‌ అహ్మద్, పాక్‌ బ్యాటర్ అసిఫ్‌ అలీ మధ్య కూడా వాతావరణం వేడెక్కింది. ఒకానొక సందర్భంలో అసిఫ్ అలీ తన బ్యాట్‌ను ఎత్తి ఫరీద్‌ను కొట్టేందుకు ప్రయత్నించాడు. ఈ మ్యాచ్‌లో పాక్‌ ఒక్క వికెట్‌ తేడాతో విజయం సాధించింది.

షకిబ్‌ అత్యుత్సాహం

బంగ్లాదేశ్‌ కెప్టెన్ షకిబ్ అల్ హసన్ అత్యుత్సాహం ఆసియా కప్‌లోనూ కొనసాగింది. దీంతో అతడిని ఐసీసీ కూడా మందలిస్తూ హెచ్చరికలు జారీ చేసింది. 2016 ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో మహమ్మద్‌ అమిర్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ కావడంతో షకిబ్‌ తీవ్ర నిరుత్సాహానికి గురయ్యాడు. ఆ వెంటనే స్టంప్స్‌ను తన బ్యాట్‌తో కొట్టాడు. దీనిపై ఐసీసీ అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. మరోసారి ఇలాంటివి పునరావృతం చేయొద్దని హెచ్చరించింది. 


నెట్టింట తీవ్ర వివాదాస్పదమయం

ఆసియా కప్ 2016 ఫైనల్‌లో భారత్ - బంగ్లాదేశ్‌ జట్లు తలపడ్డాయి. టీమ్‌ఇండియా ఛాంపియన్‌గా నిలిచింది. అయితే, బంగ్లా అభిమానులు కొందరు అత్యుత్సాహంతో సోషల్‌ మీడియా వేదికగా అప్పటి భారత కెప్టెన్ ఎంఎస్ ధోనీని అవమానించేలా ఫొటోలను రూపొందించడం వివాదాస్పదం కావడం గమనార్హం. దానిపై భారత ప్రధాన కోచ్ రవిశాస్త్రి కాస్త కటువుగానే స్పందించాడు. ‘‘ మా ఆటగాళ్లు ఎవరూ పేపర్లు చదవరు. సోషల్ మీడియాను ఫాలో కారు. తొలి ప్రాధాన్యం మాత్రం జట్టు తరఫున ఆడటం మాత్రమే’’ అని సోషల్ మీడియా వార్తలను కొట్టిపడేశాడు. 


అర్ష్‌దీప్‌పై అనుచిత వ్యాఖ్యలు

గతేడాది (2022) ఆసియా కప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత యువ బౌలర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ ఓ క్యాచ్‌ను విడిచిపెట్టాడు. కీలకమైన సమయంలో అసిఫ్‌ అలీ క్యాచ్‌ను డ్రాప్‌ చేయడంతో మ్యాచ్‌ను భారత్‌ కోల్పోయింది. దీంతో కొందరు నెట్టింట ‘ఖలిస్థానీ’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలూ రేగాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని