WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్‌.. ఓవల్‌ మైదానంలో టీమ్‌ఇండియా రికార్డులు ఇలా..

జూన్‌ 7 నుంచి లండన్‌లోని ఓవల్‌ మైదానంలో భారత్‌, ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ (WTC Final) ప్రారంభంకానుంది. మరి ఓవల్‌ మైదానంలో టీమ్‌ఇండియా ఎన్ని మ్యాచ్‌లు ఆడింది? చివరి ఐదు మ్యాచ్‌ల్లో మన జట్టు ప్రదర్శన ఎలా ఉందో ఓ లుక్కేద్దాం.

Updated : 05 Jun 2023 12:39 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌కు గత కొంతకాలంగా ఐసీసీ (ICC) టోర్నీల్లో అదృష్టం కలిసిరావట్లేదు. ద్వైపాక్షిక సిరీస్‌ల్లో అదరగొడుతున్నా.. కీలక ఐసీసీ టోర్నీలకు వచ్చేసరికి భారత్‌ చేతులేత్తేస్తోంది. ఐసీసీ టోర్నీల్లో టీమ్‌ఇండియా (Team India) ట్రోఫీ అందుకుని దాదాపు పదేళ్లవుతోంది. భారత్‌ చివరిసారిగా ధోనీ కెప్టెన్సీలో జూన్‌ 23, 2013న ఛాంపియన్స్‌ ట్రోఫీని అందుకుంది. పదేళ్ల ఐసీసీ ట్రోఫీ కరవును తీర్చుకునేందుకు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ రూపంలో భారత్‌కు మంచి అవకాశం దొరికింది. జూన్‌ 7 నుంచే లండన్‌లోని ఓవల్‌ మైదానంలో డబ్ల్యూటీసీ ఫైనల్ (WTC Final) ప్రారంభంకానుంది. మరి ఓవల్‌ మైదానంలో టీమ్‌ఇండియా ఎన్ని మ్యాచ్‌లు ఆడింది? చివరి ఐదు మ్యాచ్‌ల్లో మన జట్టు ప్రదర్శన ఎలా ఉందో ఓ లుక్కేద్దాం.

భారత్‌, ఆసీస్‌ తొలిసారి 

ఓవల్ మైదానంలో భారత్‌, ఆసీస్‌ తొలిసారి తలపడనున్నాయి. ఇక్కడ భారత్‌ ఇప్పటివరకు 14 టెస్టు మ్యాచ్‌లు ఆడింది. ఈ మ్యాచ్‌లన్నీ ఇంగ్లాండ్‌తో ఆడినవే. ఐదింటిలో ఇంగ్లిష్‌ జట్టు విజయం సాధించగా.. రెండు మ్యాచ్‌ల్లో టీమ్‌ఇండియా గెలుపొందింది. మిగిలిన ఏడు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. ఈ మైదానంలో ఇరుజట్ల మధ్య మొదటి మ్యాచ్‌ 1936 ఆగస్టులో జరగ్గా.. అందులో ఇంగ్లాండ్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 2021 సెప్టెంబరులో జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్‌ 157 పరుగుల తేడాతో విక్టరీ సాధించింది. ఈ మైదానంలో ఆసీస్‌కు కూడా మంచి రికార్డు లేదు. ఇప్పటివరకు ఓవల్‌లో కంగారూలు 38 టెస్టు మ్యాచ్‌లు ఆడగా.. ఏడు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించారు. 17 టెస్టుల్లో ఓడిపోగా.. 14 మ్యాచ్‌లను డ్రా చేసుకున్నారు. ఇక్కడ ఆస్ట్రేలియా గత 50 ఏళ్లలో రెండుసార్లు (2001, 2015) మాత్రమే గెలుపొందింది. ఓవల్‌ మైదానంలో భారత్‌ ఆడిన ఆఖరి ఐదు మ్యాచ్‌ల ఫలితాలను పరిశీలిస్తే.. 

బ్యాటర్ అవతారమెత్తిన అనిల్ కుంబ్లే  

అనిల్‌ కుంబ్లే (Anil Kumble) అనగానే మనకు ఠక్కున గుర్తుకొచ్చేది అతని స్పిన్‌ మయాజాలం. గింగరాలు తిరిగే బంతులతో బ్యాటర్లకు చుక్కలు చూపించే కుంబ్లే.. 2007 ఆగస్టులో ఓవల్‌ మైదానంలో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటర్‌ అవతారమెత్తాడు. 193 బంతుల్లోనే  16 ఫోర్లు, 1 సిక్స్‌  బాదేసి అనుహ్యంగా సెంచరీ సాధించాడు. అతడి కెరీర్‌లో ఇదే ఏకైక సెంచరీ కావడం విశేషం. అనిల్‌ కుంబ్లే శతకానికితోడు దినేశ్‌ కార్తిక్ (91), ధోనీ (92), సచిన్ (82), రాహుల్ ద్రవిడ్ (55) రాణించడంతో మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 664 పరుగులకు ఆలౌటైంది. జహీర్‌ఖాన్‌, అనిల్ కుంబ్లే మూడేసి వికెట్లతో మెరవడంతో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 345 పరుగులకు కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 180/6 వద్ద డిక్లేర్డ్ చేయగా.. 500 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య జట్టు.. 6 వికెట్ల నష్టానికి 369 పరుగులు చేయడంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. అనిల్‌ కుంబ్లే ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. 

ఇయాన్‌ బెల్ ‘డబుల్’తో ఇండియా ట్రబుల్ 

ఓవల్‌ మైదానం వేదికగా 2011 ఆగస్టులో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్‌ 8 పరుగుల తేడాతో ఘోర ఓటమిపాలైంది. ఇయాన్ బెల్ (235) డబుల్ సెంచరీకితోడు కెవిన్ పీటర్సన్ (175) శతక్కొట్టడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 591/6 వద్ద డిక్లేర్డ్ చేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో భారత్.. 300 పరుగులకే ఆలౌటైంది. రాహుల్ ద్రవిడ్ (146), అమిత్ మిశ్రా (43) మినహా మిగతా అందరూ చేతులెత్తేయడంతో భారత్‌తో ఇంగ్లాండ్‌ ఫాలోఆన్‌ ఆడించింది. రెండో ఇన్నింగ్స్‌ (ఫాలోఆన్‌)లోనూ భారత్ ఆటతీరు మారలేదు. ఈ సారి 283 పరుగులకే కుప్పకూలింది. సచిన్ (91), అమిత్‌ మిశ్రా (84) మాత్రమే రాణించడంతో భారత్‌కు ఘోర ఓటమి తప్పలేదు. 

150లోపు రెండుసార్లు ఆలౌట్.. 

2014 ఆగస్టులోనూ ఓవల్‌ మైదానంలో ఇంగ్లాండ్‌ చేతిలో భారత్‌కు ఘోర పరాభావం ఎదురైంది. ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఏకంగా ఇన్నింగ్స్‌ 244 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. భారత్ రెండు సార్లు 150 లోపే ఆలౌట్ కావడంతో మ్యాచ్‌ మూడ్రోజుల్లోనే ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ పేసర్లు క్రిస్‌ వోక్స్‌ (3/30), జోర్డాన్ (3/32), అండర్సన్ (2/51), స్టువర్ట్ బ్రాడ్ (2/27) చెలరేగడంతో భారత్ 148 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ ధోనీ (82) పోరాడకుంటే పరిస్థితి మరింత ఘోరంగా ఉండేంది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో జో రూట్ (149), అలిస్టర్ కుక్ (79) రాణించడంతో ఇంగ్లాండ్ 486 పరుగులు చేసి 10 వికెట్లు కోల్పోయింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లిష్‌ పేసర్ల ధాటికి భారత్.. 94 పరుగులకే చేతులెత్తేసింది.  

పంత్, రాహుల్ పోరాడినా.. 

2018 సెప్టెంబరులో ఓవల్‌ మైదానంలో మ్యాచ్‌ జరిగింది. ఇందులో ఆతిథ్య జట్టు 118 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 332 పరుగులకు ఆలౌటైంది. అనంతరం జడేజా (86), హనుమ విహారి (56), కోహ్లీ (49) రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 292 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో అలిస్టర్ కుక్ (147) భారీ శతకంతో విరుచుకుపడటంతో ఇంగ్లాండ్ 423/8 వద్ద డిక్లేర్డ్ చేసింది. 464 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా.. 345 పరుగులకు ఆలౌటైంది. కేఎల్ రాహుల్ (149), రిషభ్‌ పంత్ (114) శతకాలతో మెరిసినా భారత్‌ను విజయతీరాలకు చేర్చలేకపోయారు. 

రో‘హిట్‌’ చెలరేగిన వేళ..

ఓవల్‌ మైదానంలో వరుసగా మూడు ఓటములు ఎదుర్కొన్న టీమ్‌ఇండియా.. 2021లో జరిగిన మ్యాచ్‌తో గెలుపుబాట పట్టింది. తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకే ఆలౌటైన భారత్.. రోహిత్ శర్మ (127) శతకానికితోడు కేఎల్ రాహుల్ (46), పుజారా (61), కోహ్లీ (44) కూడా రాణిండంతో రెండో ఇన్నింగ్స్‌లో 466 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 99 పరుగుల ఆధిక్యం సంపాదించిన ఇంగ్లాండ్.. ఉమేశ్‌ యాదవ్ (3/60), బుమ్రా (2/27), జడేజా (2/50), శార్దూల్ ఠాకూర్ (2/22) బంతితో మెరవడంతో రెండో ఇన్నింగ్స్‌లో 210 పరుగులకే ఆలౌటైంది. దీంతో టీమ్‌ఇండియా 157 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక ఆస్ట్రేలియాతో జరిగే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో భారత ఆటగాళ్లు ఎలా ఆడతారో చూడాలి మరి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని