WhatsApp: మెసేజ్‌ చూడకుండానే కాంటాక్ట్‌ బ్లాక్‌.. వాట్సాప్‌ కొత్త ఫీచర్‌!

వాట్సాప్‌లో అభ్యంతరకర మెసేజ్‌లు పంపేవారిని సులువుగా బ్లాక్‌ చేసేందుకు వీలుగా వాట్సాప్ కొత్త ఫీచర్‌ను తీసుకొస్తుంది. ప్రస్తుతం బీటా యూజర్లకు ఈ ఆప్షన్‌ అందుబాటులో ఉంది. 

Updated : 12 Jan 2023 19:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇన్‌స్టా మెసేజింగ్ యాప్ వాట్సాప్ ( WhatsApp) మరో కొత్త ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేయనుంది. దీంతో యూజర్లు తమకు నచ్చని వ్యక్తుల కాంటాక్ట్‌ను సులువుగా బ్లాక్‌ (Block) చేయొచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ బీటా యూజర్లకు అందుబాటులో ఉంది. పరీక్షల అనంతరం సాధారణ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. ఇంతకీ ఈ ఫీచర్‌ ఎలా పనిచేస్తుందంటే..

వాట్సాప్‌లో మనకు నచ్చని వ్యక్తులు లేదా అభ్యంతరకరమైన సందేశాలతో వేధింపులకు పాల్పడేవారి కాంటాక్ట్‌ను బ్లాక్‌ చేస్తుంటాం. మీ కాంటాక్ట్‌ లిస్ట్‌లో లేని వ్యక్తుల నుంచి సందేశాలు వస్తే చాట్‌ పేజీ కింది భాగంలోనే బ్లాక్‌/రిపోర్ట్‌ (Block/Report) అని ఆప్షన్లు కనిపిస్తాయి. ఒకవేళ మీ కాంటాక్ట్‌ లిస్ట్‌లో ఉన్న వ్యక్తులనే బ్లాక్‌ చేయాలంటే.. చాట్‌ విండోలో సదరు వ్యక్తి చాట్‌ పేజీ ఓపెన్‌ చేయాలి. తర్వాత కుడివైపు పై భాగంలో ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేస్తే మెనూ ఓపెన్‌ అవుతుంది. అందులో మోర్‌పై క్లిక్ చేస్తే బ్లాక్‌ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేస్తే సదరు వ్యక్తి నుంచి ఎలాంటి మెసేజ్‌లు, కాల్స్‌ రావు. 

వాట్సాప్‌ కొత్తగా తీసుకొస్తున్న ఫీచర్‌తో మరింత సులువుగా చాట్‌ పేజీ ఓపెన్‌ చేయకుండా అవతలి వారిని బ్లాక్ చేయొచ్చు. చాట్‌ విండోలో సదరు వ్యక్తి కాంటాక్ట్‌పై లాంగ్‌ప్రెస్‌ చేస్తే సెలెక్ట్‌ అయినట్లు చూపిస్తుంది. తర్వాత కుడివైపు పైభాగంలో ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేస్తే ఆప్షన్స్‌ మెనూ ఓపెన్‌ అవుతుంది. అందులో బ్లాక్‌ ఆప్షన్‌ సెలెక్ట్‌ చేస్తే యూజర్‌ బ్లాక్‌ లిస్ట్‌లోకి వెళ్లిపోతాడు. దీనివల్ల అవతలి వారు పంపిన మెసేజ్‌లను చూడాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం సింగిల్‌ యూజర్‌ను బ్లాక్ చేసేలా ఈ ఫీచర్‌ను పరీక్షిస్తున్నారు. భవిష్యత్తులో ఒకేసారి ఒకరి కంటే ఎక్కువ మంది యూజర్లను బ్లాక్‌ చేసేలా ఈ ఫీచర్‌ను అభివృద్ధి చేయనున్నట్లు సమాచారం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని