బ్రీత్‌ ఎనలైజర్‌ ప్రాథమిక ఆధారం మాత్రమే..

Eenadu icon
By Telangana News Desk Published : 30 Oct 2025 04:08 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

వైద్య పరీక్షలు నిర్వహించకుండా తొలగింపు సరికాదు
డ్రైవర్‌ను విధుల్లోకి తీసుకోవాలంటూ ఆర్టీసీకి హైకోర్టు ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: మద్యం తాగారన్న అభియోగానికి బ్రీత్‌ ఎనలైజర్‌ పరీక్ష కేవలం ప్రాథమిక ఆధారమేనని.. తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించకుండా డ్రైవర్‌ను ఉద్యోగం నుంచి తొలగించడం సరికాదని హైకోర్టు ఆర్టీసీకి తేల్చిచెప్పింది. ఈ మేరకు డ్రైవర్‌ ఎ.వెంకటిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది. మద్యం తాగడంతోపాటు ధర్నాలో పాల్గొన్నారన్న అభియోగాలపై తనను ఉద్యోగం నుంచి తొలగిస్తూ మధిర డిపో మేనేజర్‌ గత ఏడాది ఏప్రిల్‌ 25న జారీచేసిన ఉత్తర్వులు.. వాటిని సమర్థిస్తూ రీజనల్‌ మేనేజర్, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ జారీచేసిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ డ్రైవర్‌ ఎ.వెంకటి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ నామవరపు రాజేశ్వరరావు విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ మద్యం అలవాటు పిటిషనర్‌కు లేదని, తాను మద్యం తాగి విధులు నిర్వహించలేదన్న పిటిషనర్‌ వాదనను అధికారులు పట్టించుకోలేదన్నారు. వైద్య పరీక్షలు నిర్వహించాలని అభ్యర్థించినా పట్టించుకోలేదన్నారు. ధర్నా ఉదయం 5.30 నుంచి మొదలైనప్పటికీ పిటిషనర్‌ 11.30కు పాల్గొన్నారని, పోలీసులు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ధర్నాలో పాల్గొన్న 13 మందిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేవలం పిటిషనర్‌పైనే చర్యలు తీసుకోవడం ఏకపక్షమన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి తీర్పు వెలువరిస్తూ.. బ్రీత్‌ ఎనలైజర్‌ అన్నది మద్యం తాగారా, లేదా అన్నదానికి ప్రాథమిక ఆధారం మాత్రమేనని, తర్వాత రక్త, మూత్ర పరీక్షలు నిర్వహించాల్సి ఉందన్నారు. ఆర్టీసీ అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించకుండా కేవలం బ్రీత్‌ ఎనలైజర్‌ పరీక్ష ద్వారా ఉద్యోగం నుంచి తొలగించడం చట్టవిరుద్ధమన్నారు. ధర్నాలో పాల్గొన్న 13 మందిని వదిలేసి కేవలం పిటిషనర్‌పై చర్య తీసుకోవడం సరికాదన్నారు. పిటిషనర్‌ను ఉద్యోగం నుంచి తొలగిస్తూ జారీచేసిన ఉత్తర్వులను రద్దుచేస్తూ, ఆయనను విధుల్లోకి తీసుకోవాలంటూ ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు జారీచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు