KTR: పేదల ఇళ్లపైకే హైడ్రా బుల్డోజర్లు

Eenadu icon
By Telangana News Desk Published : 03 Nov 2025 06:30 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

పెద్దల జోలికి ఎందుకు వెళ్లలేదో చెప్పాలి: కేటీఆర్‌

ఫిల్మ్‌నగర్, న్యూస్‌టుడే: హైడ్రా బుల్డోజర్లు పేదల ఇళ్లను కూల్చేశాయని, ఎన్నో కుటుంబాలను వీధిన పడేశాయని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఆరోపించారు. మరో 500 రోజుల్లో కేసీఆర్‌ ప్రభుత్వం మళ్లీ వస్తుందని, హైడ్రా కూల్చివేతలతో అన్యాయానికి గురైన బాధితులందరికీ అండగా నిలుస్తామని ఆయన పేర్కొన్నారు. ‘పెద్దవాళ్లకు ఒక న్యాయం.. పేదవాళ్లకు ఒక న్యాయం’ పేరిట హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆదివారం ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశారు. కేటీఆర్‌ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘హైడ్రా పేరుతో ప్రభుత్వం పాల్పడుతున్న అరాచకాలకు ఎంతోమంది బాధితులుగా మారారు. చాంద్రాయణగుట్టలో పాఠశాల భవనాన్ని కూడా కూలగొట్టారు. కేసీఆర్‌ హయాంలో ఎక్కడ చూసినా కట్టడాలే కనిపించేవి. హైదరాబాద్‌లోనే లక్ష డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు నిర్మించాం. వైట్‌హౌస్‌ను తలదన్నేలా సచివాలయం, దేశంలోనే అతిపెద్ద పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ కట్టుకున్నాం. హైదరాబాద్‌లో 42 ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించాం. ప్రతి జిల్లాలో కలెక్టరేట్లు కట్టాం. సాగునీటి ప్రాజెక్టులు నిర్మించాం.

రెండేళ్ల పాలనలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఒక్క కొత్త నిర్మాణం కూడా చేపట్టలేదు. రేవంత్‌రెడ్డి చేసిన పని కూలగొట్టడమే. పేదవాడికి ఒక న్యాయం.. ఉన్నవాడికి ఒక న్యాయం... ఇదే ఈ ప్రభుత్వం పనితీరు. హైడ్రాపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పెద్ద ప్రజంటేషన్‌ ఇచ్చారు. ఆ రోజు చాలా మంది బిల్డర్ల పేర్లు చెప్పారు. ఏ బిల్డర్‌నూ మేం ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. పేదల ఇంటికి వచ్చిన బుల్డోజర్‌... ఆ బిల్డర్ల జోలికి ఎందుకు వెళ్లలేదో ప్రభుత్వం చెప్పాలి. ఎఫ్‌టీఎల్‌ పరిధిలో కడితే ఎవర్నీ వదలబోమని చెప్పినా... పెద్దలను వదిలేశారు. చెరువును పూడ్చి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు కట్టారు. మరో మంత్రి వివేక్‌ వెంకటస్వామి కూడా హిమాయత్‌సాగర్‌ చెరువు వద్ద ఇల్లు కట్టుకున్నారు. రేవంత్‌రెడ్డి అన్న తిరుపతిరెడ్డి దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఇల్లు నిర్మించుకున్నారు. వీళ్లను ముట్టుకునే ధైర్యం హైడ్రా చేస్తుందా? అందుకే హైడ్రాను మేం వ్యతిరేకిస్తున్నాం’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని