అంతర్జాతీయ ప్రయాణికుల క్వారంటైన్‌కు స్వస్తి

విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు సంస్థాగత (పెయిడ్‌) క్వారంటైన్‌ నుంచి మినహాయింపు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలను సడలించింది

Updated : 10 Jun 2021 09:47 IST

విమానాశ్రయంలో కొవిడ్‌ పరీక్ష తప్పనిసరి

ఈనాడు, హైదరాబాద్‌: విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు సంస్థాగత (పెయిడ్‌) క్వారంటైన్‌ నుంచి మినహాయింపు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలను సడలించింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ఏడు రోజులపాటు హోటల్‌ లేదా ప్రభుత్వం సూచించిన ప్రాంతాల్లో క్వారంటైన్‌లో ఉండేవారు. ఇకపై వారు నేరుగా ఇళ్లకు వెళ్లిపోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కొత్త నిబంధనలను ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఏఏఐ) అధికారికంగా ప్రకటించింది. హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నిత్యం సగటున 32-34 వేల మంది ప్రయాణిస్తున్నారు. కరోనా రెండో దశ కారణంగా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులతోపాటు ప్రయాణికుల సంఖ్య తగ్గిపోయింది. ప్రస్తుతం కొన్ని దేశాల నుంచి మాత్రమే సర్వీసులు హైదరాబాద్‌కు వస్తున్నాయి. వాటిలో వచ్చేవారు ప్రయాణానికి 72 గంటల ముందు కొవిడ్‌ పరీక్ష చేయించుకుని రావాలి. హైదరాబాద్‌ చేరుకున్నాక విమానాశ్రయంలోనూ పరీక్ష చేయించుకోవాలి. ఎవరికైనా కరోనా అనుమానిత లక్షణాలు కనిపిస్తే వైద్యాధికారుల సలహా మేరకు ఇంట్లో ఉండాలి లేదా ఆసుపత్రిలో చేరాలి. చాలా మంది ప్రయాణికులు హైదరాబాద్‌కు చేరుకుని.. మరో విమానంలో తమ రాష్ట్రానికి వెళ్తుంటారు. వీరు విమానాశ్రయంలో పరీక్ష చేయించుకుని స్వస్థలాలకు వెళ్లవచ్చు. నేరుగా తెలంగాణకు చేరుకునే ప్రయాణికులు 14 రోజులపాటు తమ ఆరోగ్యంపై స్వీయ పరిశీలన చేసుకోవాలి. దేశీయ ప్రయాణికులకు సైతం క్వారంటైన్‌ నిబంధనలను ప్రభుత్వం సడలించింది. వీరు ఎయిర్‌పోర్టులో నిర్వహించే థర్మల్‌ స్క్రీనింగ్‌ తర్వాత నేరుగా ఇళ్లకు వెళ్లిపోవచ్చు. మహారాష్ట్ర, కేరళలో అత్యధికంగా కేసులు ఉన్నందున ఆయా రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వీరు 7 రోజులపాటు ఇంట్లోనే గడపాల్సి ఉంటుంది. మరో ఏడు రోజుల పాటు ఆరోగ్యంపై స్వీయ పరిశీలన ఉండాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని